ఆరంభ లాభాలు ఆవిరి

ఆద్యంతం ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్‌లో సూచీలు ఆరంభ లాభాలను పొగొట్టుకున్నాయి. బ్యాంకింగ్‌, ఇంధన షేర్లకు అమ్మకాల ఒత్తిడి ఎదురవ్వగా.. వాహన షేర్లు మెరిశాయి.

Published : 25 Jan 2023 02:54 IST

ఆద్యంతం ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్‌లో సూచీలు ఆరంభ లాభాలను పొగొట్టుకున్నాయి. బ్యాంకింగ్‌, ఇంధన షేర్లకు అమ్మకాల ఒత్తిడి ఎదురవ్వగా.. వాహన షేర్లు మెరిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 28 పైసలు తగ్గి 81.70 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 0.7 శాతం నష్టంతో 87.57 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లలో జపాన్‌ నిక్కీ లాభపడింది. చైనా మార్కెట్లు పనిచేయలేదు. ఐరోపా సూచీలు డీలాపడ్డాయి.
సెన్సెక్స్‌ ఉదయం 61,122.20 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 325 పాయింట్లు పెరిగిన సూచీ, 61,266.06 వద్ద గరిష్ఠాన్ని తాకింది. గరిష్ఠాల్లో లాభాల స్వీకరణ ఎదురు కావడంతో, ఒకదశలో 60,849.12 పాయింట్లకు పడిపోయింది. చివరకు 37.08 పాయింట్లు పెరిగి 60,978.75 వద్ద ముగిసింది. నిఫ్టీ ఎటువంటి మార్పులేకుండా 18,118.30 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 18,078.65- 18,201.25 పాయింట్ల మధ్య కదలాడింది.
నీ డిసెంబరు త్రైమాసిక ఫలితాలు మెప్పించకపోవడంతో యాక్సిస్‌ బ్యాంక్‌ షేరు బీఎస్‌ఈలో 2.50% నష్టపోయి రూ.910.05 వద్ద, గ్లాండ్‌ఫార్మా షేరు     1.48% తగ్గి రూ.1357 వద్ద,  టాటా కమ్యూనికేషన్స్‌ షేరు 4.26% కోల్పోయి రూ.1324 వద్ద ముగిశాయి.

* మెరుగైన త్రైమాసిక ఫలితాలు ప్రకటించడంతో   పూనావాలా ఫిన్‌కార్ప్‌ 4.08% లాభపడి రూ.302.50 దగ్గర స్థిరపడింది.

* సెన్సెక్స్‌ 30 షేర్లలో 15 లాభపడ్డాయి. టాటా మోటార్స్‌ 3.34%, మారుతీ 3.27%, హెచ్‌సీఎల్‌ టెక్‌ 1.47%, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 1.35%, హెచ్‌డీఎఫ్‌సీ 0.92%, ఏషియన్‌ పెయింట్స్‌ 0.88% చొప్పున రాణించాయి. యాక్సిస్‌ బ్యాంక్‌ 2.50%, పవర్‌గ్రిడ్‌ 1.78%, టాటా స్టీల్‌ 1.35%, కోటక్‌ బ్యాంక్‌ 1.31%, ఎల్‌ అండ్‌ టీ 1.18%, ఎస్‌బీఐ 1.02%, సన్‌ఫార్మా 0.81% డీలాపడ్డాయి. రంగాల వారీ సూచీల్లో.. లోహ 1.21%, ఆరోగ్య సంరక్షణ 1.01%, స్థిరాస్తి 0.95%, యుటిలిటీస్‌ 0.82%, విద్యుత్‌ 0.78%, యంత్ర పరికరాలు  0.75% పడ్డాయి. వాహన, ఐటీ, వినియోగ, మన్నికైన వినిమయ వస్తువులు 1.17% వరకు పెరిగాయి. బీఎస్‌ఈలో 2043 షేర్లు నష్టపోగా, 1482 స్క్రిప్‌లు లాభపడ్డాయి. 125 షేర్లలో ఎటువంటి మార్పులేదు.

* భారత్‌లో వ్యవసాయంపై దృష్టితో 18.2 మిలియన్‌ డాలర్ల మహిళా సాధికారత కార్యక్రమాన్ని పెప్సికో ఫౌండేషన్‌, కేర్‌ సంయుక్తంగా ప్రారంభించాయి. పశ్చిమ బెంగాల్‌లోని రెండు జిల్లాల్లో ‘షీ ఫీడ్స్‌ ది వరల్డ్‌’ కార్యక్రమం పేరిట దీన్ని ప్రారంభించిన సంస్థ, తర్వాత ఉత్తర ప్రదేశ్‌కు విస్తరించనుంది.

నేటి బోర్డు సమావేశాలు: డాక్టర్‌ రెడ్డీస్‌, సిప్లా, టాటా మోటార్స్‌, అమరరాజా బ్యాటరీస్‌, బజాజ్‌ ఆటో, ఇండియన్‌ బ్యాంక్‌, డీఎల్‌ఎఫ్‌, వీఎస్‌టీ, టాటా ఎలెక్సి, బ్లూడార్ట్‌, సియెట్‌, చెన్నై పెట్రో, డిక్సన్‌ టెక్నాలజీస్‌, ఈక్విటాస్‌ హోల్డింగ్స్‌, ఇంద్రప్రస్థ గ్యాస్‌, జ్యోతి ల్యాబ్స్‌, టీమ్‌లీజ్‌, టొరెంట్‌ ఫార్మా, వీఐపీ ఇండస్ట్రీస్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని