సంక్షిప్త వార్తలు(3)

జెన్‌ టెక్నాలజీస్‌ ఆకర్షణీయమైన ఫలితాలను నమోదు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి ఈ సంస్థ రూ.34.84 కోట్ల ఆదాయాన్ని, రూ.7.58 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది.

Published : 29 Jan 2023 02:01 IST

జెన్‌ టెక్నాలజీస్‌కు రూ.7.58 కోట్ల లాభం

ఈనాడు, హైదరాబాద్‌: జెన్‌ టెక్నాలజీస్‌ ఆకర్షణీయమైన ఫలితాలను నమోదు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి ఈ సంస్థ రూ.34.84 కోట్ల ఆదాయాన్ని, రూ.7.58 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. త్రైమాసిక ఈపీఎస్‌ రూ.0.95గా ఉంది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆదాయం రూ.13.33 కోట్లు, నికరలాభం   రూ.11.83 లక్షలుగా ఉన్నాయి. వీటితో పోల్చితే ప్రస్తుత త్రైమాసికంలో ఆదాయం,  నికరలాభం భారీగా పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలల కాలానికి జెన్‌ టెక్నాలజీస్‌ ఆదాయం రూ.94.15 కోట్లు, నికరలాభం రూ.20.36 కోట్లకు చేరుకున్నాయి. గత నెలాఖరు నాటికి కంపెనీ చేతిలో రూ.404 కోట్ల విలువైన ఆర్డర్లు ఉన్నాయి.


52% పెరిగిన డీసీబీ బ్యాంక్‌ లాభం

దిల్లీ: ప్రైవేటు రంగ డీసీబీ బ్యాంక్‌ డిసెంబరు త్రైమాసికంలో రూ.114 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. క్రితం ఏడాది ఇదే సమయంలో బ్యాంకు ఆర్జించిన నికర లాభం రూ.75 కోట్లతో పోలిస్తే ఇది 52 శాతం అధికం. మొత్తం ఆదాయం రూ.463 కోట్ల నుంచి రూ.541 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం రూ.345 కోట్ల నుంచి రూ.446 కోట్లకు చేరింది. ఆస్తుల నాణ్యత విషయానికొస్తే స్థూల నిరర్థక ఆస్తులు(ఎన్‌పీఏలు) 4.78 శాతం నుంచి 3.62 శాతానికి మెరుగయ్యాయి. నికర ఎన్‌పీఏలు 2.55 శాతం నుంచి 1.37 శాతానికి తగ్గాయి. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్‌) 16.26 శాతానికి చేరింది.


సంక్షిప్తంగా

* బీఎండబ్ల్యూ ఇండియా.. సరికొత్త బీఎండబ్ల్యూ ఎక్స్‌1 స్పోర్ట్స్‌ యాక్టివిటీ వెహికల్‌ (ఎస్‌ఏవీ)ను దేశీయంగా విడుదల చేసింది. పెట్రోల్‌ వేరియంట్‌ ధర రూ.45.90 లక్షలు కాగా, డీజిల్‌ వాహనం ధర రూ.47.90 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌ ధరలు). బీఎండబ్ల్యూ డీలర్‌షిప్‌ నెట్‌వర్క్‌, షాప్‌.బీఎండబ్ల్యూ.ఇన్‌లో బుకింగ్‌లు చేసుకోవచ్చు. డీజిల్‌ వాహనాలను మార్చి నుంచి, పెట్రోల్‌ వాహనాలను జూన్‌ నుంచి డెలివరీ చేస్తారు.

* ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లపై వినియోగదార్లు చేసే ఫిర్యాదుల పరిశీలనకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రీవెన్స్‌ అప్పిలేట్‌ కమిటీలు (జీఏసీలు) మార్చి 1 నుంచి పని చేస్తాయని ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఐటీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

* యూకే ఎయిర్‌లైన్‌ ఫ్లైబి మూడేళ్లలో రెండోసారి దివాలా ప్రక్రియను ఎదుర్కొంటోంది. 2020 మార్చిలో ఒకసారి దివాలా తీసిన ఈ ఎయిర్‌లైన్స్‌, గతేడాది ఏప్రిల్‌ నుంచి కార్యకలాపాలు ప్రారంభించింది. మళ్లీ తాజాగా దివాలా తీసింది.

* హై-టెక్‌ పైప్స్‌ డిసెంబరు త్రైమాసికంలో  రూ.13.02 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే సమయంలో ఆర్జించిన రూ.10.16 కోట్లతో పోలిస్తే ఇది 28% అధికం.

* అధిక నాణ్యత కలిగిన సముద్ర డీజిల్‌ ఇంజిన్లను రాంచీ ప్లాంటులో తయారు చేసేందుకు రక్షణ పీఎస్‌యూ గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌ అండ్‌ ఇంజినీర్స్‌ (జీఆర్‌ఎస్‌ఈ), జర్మనీకి చెందిన రోల్స్‌ రాయిస్‌ సొల్యూషన్స్‌తో అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని