బయో ఇంధనంతో ఎమిరేట్స్‌ విమానం

కర్బన ఉద్గారాలను తగ్గించుకోవడంపై ప్రపంచవ్యాప్తంగా విమానయాన సంస్థలు దృష్టి సారించాయి. ఇందులో భాగంగానే  ‘ఈకే2646 సంఖ్య ఉన్న బోయింగ్‌ 777ను బయో ఇంధనంతో విజయవంతంగా నడిపించినట్లు’ ఎమిరేట్స్‌ సంస్థ సోమవారం వెల్లడించింది.

Published : 31 Jan 2023 02:22 IST

పరీక్ష విజయవంతం

దుబాయ్‌ (యూఏఈ): కర్బన ఉద్గారాలను తగ్గించుకోవడంపై ప్రపంచవ్యాప్తంగా విమానయాన సంస్థలు దృష్టి సారించాయి. ఇందులో భాగంగానే  ‘ఈకే2646 సంఖ్య ఉన్న బోయింగ్‌ 777ను బయో ఇంధనంతో విజయవంతంగా నడిపించినట్లు’ ఎమిరేట్స్‌ సంస్థ సోమవారం వెల్లడించింది. ఈ విమానానికి ఉన్న రెండు జనరల్‌ ఎలక్ట్రిక్‌ కంపెనీ ఇంజిన్లలో ఒకదానిలో బయో ఇంధనాన్ని, మరో దానిలో భద్రత కోసం సంప్రదాయ విమాన ఇంధనాన్ని నింపింది. ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయమైన దుబాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరి, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ తీరం మీదుగా గంట పాటు ఎగిరి, పర్షియన్‌ గల్ఫ్‌ వైపు వెళ్లి తిరిగి సురక్షితంగా ఈ విమానం ల్యాండ్‌ అయ్యిందని ఎమిరేట్స్‌ చీఫ్‌ ఆపరేషన్‌ అధికారి అడెల్‌-అల్‌- రెధా తెలిపారు.

* బయో విమాన ఇంధనం ఒక మిశ్రమమని.. సంప్రదాయ విమాన ఇంధన లక్షణాలను ఇది కలిగి ఉంటుందని, ఇందులో ఫిన్‌ల్యాండ్‌ సంస్థ నెస్టే ఇంధనమూ కలిసి ఉంటుందని ఎమిరేట్స్‌ తెలిపింది. బయో ఇంధనానికి అవసరమైన ఉత్పత్తుల తయారీకి మొక్కల ఆధారిత షుగర్స్‌ ఉపయోగిస్తారు. నెస్లే ఇంధనం.. వెజిటేబుల్‌ నూనెలు, జంతువుల కొవ్వుల నుంచి తయారు చేస్తారు.

* వరల్డ్‌ రిసోర్సెస్‌ ఇన్‌స్టిట్యూట్‌ నివేదిక ప్రకారం.. కార్లు, ట్రక్కులు విడుదల చేసే కర్బన ఉద్గారాల్లో కేవలం ఆరింట ఒక వంతు మాత్రమే విమానాలు విడుదల చేస్తాయి.

* విమానయాన సంస్థల వ్యయాల్లో అధిక భాగం విమాన ఇంధనానికే ఖర్చు అవుతుంది. ఈ ఖర్చు తగ్గించుకునే ఉద్దేశంతో.. మరింత ఇంధన సామర్థ్యంతో కూడిన విమానాలు, ఇంజిన్లను తయారు చేయడంపై తయారీ సంస్థలు దృష్టి సారిస్తున్నాయి. అయితే సంప్రదాయ విమాన ఇంధనంతో పోలిస్తే బయో ఇంధనానికి మూడు రెట్లు లేదా అంతకుమించి ఖర్చు అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. దీనివల్ల విమాన టికెట్‌ ఛార్జీలు మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. కాగా.. ఎమిరేట్స్‌ సోమవారం నిర్వహించిన పరీక్షలో ఎంత మేర బయో ఇంధనాన్ని వాడిందనే విషయం తెలియరాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని