44% తగ్గిన పీఎన్‌బీ లాభం

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) డిసెంబరు త్రైమాసికంలో రూ.629 కోట్ల స్టాండలోన్‌ నికర లాభాన్ని నమోదు చేసింది. 2021-22 ఇదే త్రైమాసికంలో బ్యాంక్‌ ఆర్జించిన నికర లాభం రూ.1,127 కోట్లతో పోలిస్తే ఇది 44 శాతం తక్కువ.

Published : 31 Jan 2023 02:35 IST

దిల్లీ: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) డిసెంబరు త్రైమాసికంలో రూ.629 కోట్ల స్టాండలోన్‌ నికర లాభాన్ని నమోదు చేసింది. 2021-22 ఇదే త్రైమాసికంలో బ్యాంక్‌ ఆర్జించిన నికర లాభం రూ.1,127 కోట్లతో పోలిస్తే ఇది 44 శాతం తక్కువ. మొత్తం ఆదాయం రూ.22,026 కోట్ల నుంచి రూ.25,722 కోట్లకు పెరిగింది. ఆస్తుల నాణ్యతకొస్తే స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు) 12.88 శాతం నుంచి 9.76 శాతానికి; నికర ఎన్‌పీఏలు 4.90 శాతం నుంచి 3.30 శాతానికి మెరుగయ్యాయి. అయినా మొండి బకాయిలకు కేటాయింపులు రూ.3,654 కోట్ల నుంచి రూ.3,908 కోట్లకు పెరిగాయి..నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) 17.6% పెరిగి రూ.9,179 కోట్లకు, నిర్వహణ లాభం 12.6 శాతం వృద్ధి చెంది రూ.5,716 కోట్లకు చేరాయని పీఎన్‌బీ ఎండీ అతుల్‌ కుమార్‌ గోయెల్‌ వెల్లడించారు.

* టైర్‌-1, టైర్‌-2 బాండ్ల జారీ ద్వారా రూ.12,000 కోట్లు సమీకరించేందుకు బ్యాంక్‌ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపిందని అతుల్‌ తెలిపారు. మార్కెట్‌ పరిస్థితులు, ఏటీ1 బాండ్లపై వడ్డీ రేట్ల ఆధారంగా ఈ త్రైమాసికంలోనే రూ.1,000-1,500 కోట్ల నిధుల్ని సమీకరించే అవకాశం ఉందని పేర్కొన్నారు.

* రుణ వృద్ధి 12-13 శాతం, డిపాజిట్ల వృద్ధి 8-9 శాతం మేర అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. నిరర్థక ఆస్తుల (ఎన్‌పీఏలు) పరిష్కార ప్రక్రియతో మార్చి త్రైమాసికంలో రూ.1,800 కోట్లు ఆశిస్తున్నామని వెల్లడించారు.

* కెనరా హెచ్‌ఎస్‌బీసీ ఓబీసీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌లో పీఎన్‌బీ వాటా విక్రయం గురించి అతుల్‌ చెబుతూ.. ‘భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) మార్గదర్శకాల ప్రకారం.. బ్యాంకులు ప్రస్తుతం ప్రమోటర్లుగా కాకుండా పెట్టుబడి రూపంలో వాటా కొనసాగించే అవకాశం లభించింద’ని తెలిపారు. పీఎన్‌బీ మెట్‌లైఫ్‌లో ప్రమోటర్‌ హోల్డింగ్‌ కొనసాగిస్తామన్నారు. పీఎన్‌బీ హౌసింగ్‌ రైట్స్‌ ఇష్యూలో పాల్గొంటామని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు