ఆటాడించింది

సాధారణ బడ్జెట్‌ నేపథ్యంలో దేశీయ సూచీలు బుధవారం తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొని, చివరకు మిశ్రమంగా ముగిశాయి. ఒకదశలో సూచీలు పరుగులు తీసినా, గరిష్ఠ స్థాయుల్లో అమ్మకాలతో వెనక్కి వచ్చేశాయి.

Updated : 02 Feb 2023 04:34 IST

గరిష్ఠాల నుంచి 1,000 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్‌  
నష్టాల్లో ముగిసిన నిఫ్టీ 

సాధారణ బడ్జెట్‌ నేపథ్యంలో దేశీయ సూచీలు బుధవారం తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొని, చివరకు మిశ్రమంగా ముగిశాయి. ఒకదశలో సూచీలు పరుగులు తీసినా, గరిష్ఠ స్థాయుల్లో అమ్మకాలతో వెనక్కి వచ్చేశాయి. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల నిర్ణయం వెలువడనుండటంతో మదుపర్లు అప్రమత్తమయ్యారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి 8 పైసలు పెరిగి 81.80 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 85.42 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

బడ్జెట్‌ ప్రసంగానికి ముందు

బడ్జెట్‌ మీద సానుకూల అంచనాలతో సెన్సెక్స్‌ ఉదయం 60,001.17 వద్ద భారీ లాభాల్లో ప్రారంభమైంది. బడ్జెట్‌ ప్రసంగం ప్రారంభమయ్యే సమయానికి సెన్సెక్స్‌ దాదాపు 550 పాయింట్ల లాభంలో ట్రేడవుతోంది. ప్రసంగం ప్రారంభమయ్యాక పరిమిత శ్రేణిలో కదలాడినా, లాభాలను మాత్రం కోల్పోలేదు.

ప్రసంగం అనంతరం

బడ్జెట్‌ ప్రసంగం పూర్తయ్యాక ఒక్కసారిగా కొనుగోళ్ల జోరు కనిపించింది. ఇంట్రాడేలో 1223 పాయింట్లు దూసుకెళ్లిన సెన్సెక్స్‌ 60,773.44 వద్ద గరిష్ఠానికి చేరింది. అనంతరం   అనూహ్యంగా అమ్మకాలు రావడంతో ఆ లాభాలన్నీ కోల్పోయి నష్టాల్లోకి జారుకుంది. ఒకదశలో 730 పాయింట్లు కోల్పోయి 58,816.84 వద్ద కనిష్ఠానికి పడిపోయింది. మళ్లీ కోలుకుని  158.18 పాయింట్ల లాభంతో 59,708.08 వద్ద ముగిసింది. నిఫ్టీ మాత్రం 45.85 పాయింట్లు తగ్గి 17,616.30 దగ్గర స్థిరపడింది. నీ బడ్జెట్‌లో రూ.2.4 లక్షల కోట్ల పెట్టుబడులు ప్రకటించినప్పటికీ రైల్వే షేర్లకు లాభాల స్వీకరణ ఎదురైంది. టెక్స్‌మాకో రైల్‌ 9.32%, ఆర్‌వీఎన్‌ఎల్‌ 4.53%, ఐఆర్‌ఎఫ్‌సీ 4.54%, ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌ 4.23%, కంటైనర్‌ కార్పొరేషన్‌2.96%, ఐఆర్‌సీటీసీ 1.43% చొప్పున నష్టాలు నమోదుచేశాయి. జూపిటర్‌ వ్యాగన్‌, టిటాగఢ్‌ వ్యాగన్స్‌ 5% కోల్పోయి లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి. కే అండ్‌ ఆర్‌ రైల్‌ 5% దూసుకెళ్లింది.

* అమెరికా ఫెడరల్‌ రిజర్వు బుధవారం నాటి సమీక్షలో వడ్డీరేట్లను 0.25 శాతం పెంచి 4.50-4.75 శాతం చేసింది. నేడు ఈ ప్రభావం మన మార్కెట్లపై ఉండే అవకాశం ఉంది.

ఆగని అదానీ షేర్ల పతనం: అదానీ గ్రూప్‌ షేర్లు వరుసగా అయిదో రోజూ పతనమయ్యాయి. గత 5 ట్రేడింగ్‌ రోజుల్లో అదానీ సంస్థల మార్కెట్‌ విలువ రూ.7 లక్షల కోట్లకు పైగా క్షీణించింది. బుధవారం అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేరు 28.45% కుప్పకూలి రూ.2,128.70 వద్ద ముగిసింది. అదానీ పోర్ట్స్‌    19.69%, అదానీ టోటల్‌ గ్యాస్‌ 10%, అదానీ గ్రీన్‌ 5.78%, అదానీ విల్మర్‌ 4.99%, అదానీ పవర్‌ 4.98%, అదానీ ట్రాన్స్‌మిషన్‌ 2.46% నష్టపోయాయి. అంబుజా సిమెంట్స్‌ 16.56%, ఏసీసీ 6.34%, ఎన్‌టీడీవీ 4.98% నష్టాలు నమోదుచేశాయి.

ఎఫ్‌పీఓ ఉపసంహరణ: అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ రూ.20,000 కోట్ల ఫాలోఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఎఫ్‌పీఓ)ను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. మదుపర్లకు డబ్బులు వెనక్కి ఇస్తామంది.

* ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా ఉన్న అదానీ తన స్థానాన్ని కోల్పోయారు. హిండెన్‌బర్గ్‌ నివేదిక అనంతరం షేర్ల పతనం ఇందుకు నేపథ్యం. ఫలితంగా ముకేశ్‌ అంబానీ తిరిగి అగ్రస్థానానికి చేరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని