కొత్త ఉద్యోగులకు వీఆర్‌తో శిక్షణ

ప్రతి సంస్థ కొత్తగా చేరిన ఉద్యోగులకు శిక్షణ ఇచ్చేందుకు పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తుంటుంది. ఉద్యోగంలో చేరిన ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లకూ పలు అంశాలపై అవగాహన కల్పించేందుకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి.

Updated : 05 Feb 2023 11:57 IST

ఈనాడు - హైదరాబాద్‌: ప్రతి సంస్థ కొత్తగా చేరిన ఉద్యోగులకు శిక్షణ ఇచ్చేందుకు పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తుంటుంది. ఉద్యోగంలో చేరిన ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లకూ పలు అంశాలపై అవగాహన కల్పించేందుకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఖర్చును తగ్గించేందుకు వీలుగా ఏఆర్‌, వీఆర్‌ సాంకేతికత ఆధారంగా వీరికి అవసరమైన శిక్షణను ఇస్తే బాగుంటుంది కదా అనే ఆలోచనతో వచ్చిన అంకురమే డీప్‌లూప్‌. పలు ప్రముఖ సంస్థలకు ఇప్పుడు తాము సేవలందిస్తున్నామంటూ చెబుతున్నారు ఈ సంస్థ సహ వ్యవస్థాపకుడు సూర్య ప్రకాశ్‌. డీప్‌లూప్‌ గురించి ఇలా వివరిస్తున్నారు.

‘నేను, మరో సహ వ్యవస్థాపకుడు చంద్రధర్‌ గౌతమ్‌ ఇద్దరమూ ఒకే కాలేజీలో కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ చదువుకున్నాం. తను నాకు రెండేళ్ల జూనియర్‌. ఏదైనా కొత్తగా చేయాలనే ఆలోచన మా ఇద్దరినీ కలిపింది. దీంతో చదువుకుంటూనే కొన్ని ఆన్‌లైన్‌ గేమ్‌లు రూపొందించాం. ఉద్యోగంలో చేరిన తర్వాతా వీటిపై పని చేస్తూనే ఉన్నాం. కొత్తగా ఏఆర్‌ (అగ్యుమెంటెడ్‌ రియాల్టీ), వీఆర్‌ (వర్చువల్‌ రియాల్టీ)లు రావడం, వీటికి మంచి ఆదరణ లభిస్తుండటంతో మా దృష్టి అటువైపు మళ్లింది. దాదాపు ఏడాదిన్నరపాటు అన్ని అంశాలనూ గమనించాం. ఈ సాంకేతికతలను ఉపయోగించి, సరికొత్తగా ఏదైనా చేయాలనే ఆలోచనతో 2021 జూన్‌లో డీప్‌లూప్‌ను స్థాపించాం. ఈ దశలో మా ఆలోచన నచ్చి, మాతో కలిసి పనిచేసేందుకు చంద్ర దాసరి ముందుకొచ్చారు. ఇలా మా సంస్థ ప్రారంభమైంది.

ఏం చేస్తామంటే..

సాధారణంగా సంస్థలు తమ ఉద్యోగులకు అసలు ఉత్పత్తులపైనే శిక్షణ ఇస్తుంటాయి. దీనివల్ల చిన్న పొరపాటు జరిగినా నష్టం పెద్ద ఎత్తున ఉంటుంది. దీన్ని నివారించేలా అసలు ఉత్పత్తులపైనే పనిచేస్తున్న విధంగా ఏఆర్‌, వీఆర్‌ సాంకేతికత శిక్షణ ఇచ్చేలా మా సాఫ్ట్‌వేర్‌ సాయపడుతుంది. ఉదాహరణకు టీవీఎస్‌ మోటార్స్‌ తన ఉద్యోగులకు వారు ప్రత్యక్షంగా పనిచేస్తున్న విధంగానే మా సాఫ్ట్‌వేర్‌తో శిక్షణ ఇస్తోంది. ఇంజినీరింగ్‌ కాలేజీలో విద్యార్థులు పలు పరికరాలను ఉపయోగించడం ఎలా అనేది తెలుసుకునేందుకూ మా సాంకేతికత ఉపయోగపడుతుంది.

ఇప్పటి వరకూ..

టీవీఎస్‌లాంటి పెద్ద కంపెనీల ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడంతోపాటు, కొన్ని సంస్థలకు మార్కెటింగ్‌లోనూ మా సాంకేతికత ఉపయోగపడుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని వారికి ఉత్పత్తులపై పూర్తి అవగాహన కల్పించి, వారికి ఆయా వస్తువులను విక్రయించేందుకు పలు సంస్థలు ఇప్పుడు మాతో కలిసి పనిచేస్తున్నాయి. ఇలా దాదాపు 20 సంస్థలకు మా సేవలను అందిస్తున్నాం. తెలంగాణ స్టేట్‌ కాంక్లేవ్‌లో మూడో స్థానం, రెనో టాప్‌ 10 ఇన్నోవేటర్స్‌, మారుతీ ఎంఏఐఎల్‌ ఫైనలిస్టుగా, గ్రామీణ్‌ ఫౌండేషన్‌ టీఎఫ్‌ఐ ఛాలెంజ్‌లో రెండో స్థానం పొందాం.

విస్తరణ దిశగా..

ఏడాదిన్నర కిందట మా సంస్థ ఆరుగురితో ప్రారంభమయ్యింది. ఇపుడు మా బృందంలో 22 మంది ఉన్నారు. మరో ఏడాదిలో ఈ సంఖ్య 50కి చేరుకుంటుంది. ఇప్పటి వరకూ రూ.3 కోట్ల పెట్టుబడిని సమీకరించాం. విస్తరణ కోసం మరో దశ పెట్టుబడి కోసం ప్రయత్నిస్తున్నాం. ఆసుపత్రులు సహా, ఉద్యోగులకు శిక్షణ ఇచ్చే ప్రతి చోటా మా ఉత్పత్తిని వినియోగించాలన్నదే మా లక్ష్యం. ఐఓటీ ఆధారిత పరికరాలను ఉపయోగిస్తూ శిక్షణ ఇచ్చే సాంకేతికతనూ అభివృద్ధి చేస్తున్నాం.’


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు