ఐటీలో నియామకాలు.. పరిమితంగానే

సమీప- మధ్య కాలంలో దేశీయ ఐటీ సేవల పరిశ్రమ రంగ వృద్ధి నెమ్మదించవచ్చని రేటింగ్‌ సంస్థ ఇక్రా అంచనా వేసింది. అమెరికా, ఐరోపా లాంటి కీలక విపణుల్లో స్థూల ఆర్థిక పరిస్థితుల ప్రభావంతో ఐటీ కోసం వెచ్చించడం తగ్గే అవకాశం ఉండటమే ఇందుకు కారణంగా పేర్కొంది.

Updated : 07 Feb 2023 10:31 IST

ఐటీ సేవల రంగం  నెమ్మదించొచ్చు
అమెరికా, ఐరోపాల్లో పరిణామాలే కారణం
సమీప- మధ్యకాల వృద్ధిపై ఇక్రా అంచనా

దిల్లీ: సమీప- మధ్య కాలంలో దేశీయ ఐటీ సేవల పరిశ్రమ రంగ వృద్ధి నెమ్మదించవచ్చని రేటింగ్‌ సంస్థ ఇక్రా అంచనా వేసింది. అమెరికా, ఐరోపా లాంటి కీలక విపణుల్లో స్థూల ఆర్థిక పరిస్థితుల ప్రభావంతో ఐటీ కోసం వెచ్చించడం తగ్గే అవకాశం ఉండటమే ఇందుకు కారణంగా పేర్కొంది. 2021-22లో అధిక నియామకాలను చేపట్టడంతో.. సమీపకాలంలో ఐటీ సేవల కంపెనీల నియామకాలూ పరిమితంగానే ఉండొచ్చని వివరించింది. గత ఆర్థిక సంవత్సరాలతో పోలిస్తే గిరాకీ కూడా తగ్గుముఖం పట్టొచ్చని వెల్లడించింది. ఇంకా ఆ నివేదిక ఏమంటోందంటే..

* స్థిర కరెన్సీ రూపేణా గత రెండు త్రైమాసికాల్లో దేశీయ ఐటీ సేవల కంపెనీల వృద్ధి నెమ్మదించింది. ప్రాతిపదిక ప్రభావం (బేస్‌ ఎఫెక్ట్‌) , అమెరికా, ఐరోపా విపణుల్లో ప్రతికూల పరిస్థితులు ఇందుకు కారణం.
* అధిక వేతన వ్యయాల కారణంగా నిర్వహణ లాభాల మార్జిన్‌లు కూడా తగ్గే అవకాశం ఉంది.
* విభాగాల వారీగా చూస్తే.. ఐటీ కంపెనీలకు అత్యంత కీలకమైన బీఎఫ్‌ఎస్‌ఐ (బ్యాంకింగ్‌, ఆర్థిక సేవలు, బీమా) విభాగం వృద్ధి ఇతర విభాగాలతో పోలిస్తే నెమ్మదించింది.
* గిరాకీ- సరఫరా వ్యత్యాసాల ప్రభావంతో గణనీయంగా పెరిగిన ఉద్యోగుల వలసల రేటు.. గత రెండు త్రైమాసికాలుగా తగ్గుముఖం పట్టింది.  
* వృద్ధి మరింత నెమ్మదించొచ్చనే అంచనా వేసినప్పటికీ.. దేశీ ఐటీ సేవల పరిశ్రమకు స్థిరత్వంతో కూడిన వృద్ధి అంచనాను కొనసాగిస్తున్నాం. ఐటీ సేవలకు డిమాండు పెరగడం ఇందుకు కారణం.

డెల్‌లో 6,650 మందికి ఉద్వాసన!

అనిశ్చిత భవిష్యత్‌ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిబ్బందిలో 5 శాతం వరకు ఉద్యోగులను తొలగించనున్నట్లు డెల్‌ టెక్నాలజీస్‌ ఇంక్‌ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. అంటే దాదాపు 6,650 మంది వరకు ఉద్వాసనకు గురి కావొచ్చని ఒక ఆంగ్ల వార్తా సంస్థ పేర్కొంది. మరో వైపు, ఇన్ఫోసిస్‌ సైతం శిక్షణ అనంతరం సరైన పనితీరు కనబరచని 600 మంది ఫ్రెషర్స్‌ను ఇంటికి పంపుతూ నిర్ణయం తీసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని