చైనాకు ఫాక్స్‌కాన్‌ షాక్‌

అమెరికా, చైనా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో తయారీ పరిశ్రమలు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుంటున్నాయి.

Updated : 04 Mar 2023 07:29 IST

భారత్‌లో ఐఫోన్ల తయారీ పెంపు
అమెరికా, డ్రాగన్‌ మధ్య అనిశ్చితులే కారణం
ఈటీవీభారత్‌

అమెరికా, చైనా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో తయారీ పరిశ్రమలు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుంటున్నాయి. యాపిల్‌ ఫోన్లను తయారు చేసే తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్‌ సంస్థ తమ ఐఫోన్‌ల తయారీ యూనిట్‌ను భారత్‌లో నెలకొల్పేందుకు ప్రణాళికలు రచించింది. బెంగళూరులో సుమారు 700 మిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది.

తైవాన్‌ విషయంలో చైనా నిరంకుశ ధోరణిపై అమెరిగా ఆగ్రహంతో ఉండడం, డ్రాగన్‌కు చెందిన నిఘా బెలూన్‌ను అమెరికాలో కూల్చివేసిన నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఉద్రికత్తలు పెరిగాయి. కరోనా తర్వాత పలు దేశాలు తయారీ సంస్థలకు రాచబాట వేస్తున్న వేళ.. చైనాలోని తయారీ రంగ పరిశ్రమలు కొత్త మార్గాలు ఎంచుకుంటున్నాయి. ఆర్థికంగా వేగవంతమైన అభివృద్ధి సాధిస్తున్న భారత్‌, వియత్నాం వంటి దేశాలు పెట్టుబడులకు అనుకూలంగా ఉన్నాయని అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐఫోన్‌ల తయారీ సంస్థ ఫాక్స్‌కాన్‌ భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది.

బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని 300 ఎకరాల్లో 700 మిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. భారత్‌లో ఫాక్స్‌కాన్‌కు ఇదే అతిపెద్ద పెట్టుబడి. ఇక్కడ ఏర్పాటు చేసే పరిశ్రమలో పెద్ద ఎత్తున ఐఫోన్‌లను ఉత్పత్తి చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ యూనిట్‌ ద్వారా సుమారు లక్ష మందికి ఉద్యోగాలు లభిస్తాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై పేర్కొన్నారు. ఫాక్స్‌కాన్‌ బాటలో మరికొన్ని కంపెనీలు చైనా నుంచి బయటపడాలని చూస్తున్నాయి. భారత్‌, వియత్నాం వంటి దేశాలకు తమ ఉత్పత్తి కేంద్రాలను తరలించాలని యాపిల్‌తో పాటు ఇతర అమెరికా కంపెనీలు చైనాలో ఉన్న తమ సరఫరాదారులకు సూచిస్తున్నాయి. ఒకే చోట తయారీ కేంద్రాలు కేంద్రీకృతం కావడం వల్ల విపత్తుల సమయాల్లో సరఫరా ఇబ్బందులు తలెత్తుతాయనే అంచనాకు వచ్చాయి. ఇప్పటికే కరోనా సమయంలో ఈ సమస్యను ఎదుర్కొన్నాయి.

చైనాలోని తన ప్లాంట్‌లో ఫాక్స్‌కాన్‌ సంస్థ 2 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తోంది. ఇప్పటికే యాపిల్‌ ఫోన్ల తయారీ దారులైన ఫాక్స్‌కాన్‌, పెగట్రాన్‌, విస్ట్రాన్‌ భారత్‌లో తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల తయారీదారుగా ఉన్న డ్రాగన్‌ తన హోదాను కోల్పోయే ప్రమాదముందని నిపుణులు అంటున్నారు. 


భారత్‌ వైపు మొగ్గు..

చైనాలో కొవిడ్‌ ఆంక్షల నేపథ్యంలో ఐఫోన్‌ తయారీలో తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి. దీంతో ఫాక్స్‌కాన్‌ భారత్‌లో తమ కార్యకలాపాల్ని విస్తరిస్తోంది. ఇప్పటికే తాజా ఐఫోన్‌-14 మోడళ్ల తయారీని చెన్నైలోని ప్లాంటులో పెంచింది. చైనాలో తరచూ ఏదో రకమైన ఇబ్బందులు తలెత్తి ఐఫోన్‌ సరఫరాలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో చైనాపై ఎక్కువగా ఆధారపడడాన్ని ఫాక్స్‌కాన్‌ తగ్గించుకుంటోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని