మహిళల పెట్టుబడులూ స్థిరాస్తికే

మహిళల దగ్గర డబ్బులుంటే బంగారం కొనేందుకే మొగ్గుచూపుతారనే భావన ఉంది. అయితే 65 శాతం మంది మహిళలు స్థిరాస్తిలో పెట్టుబడులపైనే ఆసక్తి కనబరుస్తున్నారని తమ సర్వేలో తేలిందని స్థిరాస్తి కన్సల్టెంట్‌ అనరాక్‌ తెలిపింది.

Published : 06 Mar 2023 01:29 IST

బంగారంపై ఆసక్తి 8% మందికే
అనరాక్‌ సర్వే

దిల్లీ: మహిళల దగ్గర డబ్బులుంటే బంగారం కొనేందుకే మొగ్గుచూపుతారనే భావన ఉంది. అయితే 65 శాతం మంది మహిళలు స్థిరాస్తిలో పెట్టుబడులపైనే ఆసక్తి కనబరుస్తున్నారని తమ సర్వేలో తేలిందని స్థిరాస్తి కన్సల్టెంట్‌ అనరాక్‌ తెలిపింది. స్టాక్స్‌లో పెట్టుబడులు పెడతామని 20% మంది, బంగారం కొంటామని 8% మంది, కాలావధి డిపాజిట్‌ చేస్తామని 7% మంది వెల్లడించినట్లు పేర్కొంది. తాము మొత్తం 5500 మంది నుంచి అభిప్రాయాలు సమీకరించగా, అందులో సగం మంది మహిళలని వివరించింది. ఈ సంస్థ నివేదిక ప్రకారం..

* రూ.45 లక్షలకు మించిన నివాసాలు కొనుగోలు చేసేందుకు చూస్తున్నట్లు 83% మంది మహిళలు తెలిపారు. రూ.45-90 లక్షల శ్రేణి సౌకర్యవంతమని 36% మంది, రూ.90 లక్షలు-రూ.1.5 కోట్ల విలువైన ఆస్తులపై 27% మంది, రూ.కోటిన్నరకు మించిన సౌధాలు కొంటామని 20% మంది తెలిపారు.
* రూ.45 లక్షల కంటే తక్కువ విలువైన నివాసాల కొనుగోలుపై అతి తక్కువ మంది ఆసక్తి కనబరచారని అనరాక్‌ గ్రూప్‌ వైస్‌ ఛైర్మన్‌ సంతోష్‌ కుమార్‌ తెలిపారు. నివసించేందుకు-పెట్టుబడుల కోసం ఇళ్లు కొనుగోలు చేసే వారి నిష్పత్తి 82:18 నుంచి 77:23కి మారినట్లు తెలిపారు. మహిళలు తప్పనిసరిగా ఇంటికి సహ యజమానిగా ఉండేలా రూపొందించిన ప్రధాన్‌మంత్రి ఆవాస్‌ యోజన, వారి పేరిట ఇల్లు ఉంటే రుణ వడ్డీ - రిజిస్ట్రేషన్‌ సుంకంలో రాయితీల వంటివి మహిళల పేరిట ఇళ్ల నమోదుకు ఉపకరిస్తున్నాయని వెల్లడించారు.


రుణ చెల్లింపుల్లో అతివలే భేష్‌

వారికి ఇచ్చినవి రూ.16 లక్షల కోట్లు

ముంబయి: రుణాల తిరిగి చెల్లింపుల్లో పురుషులతో పోలిస్తే మహిళలే మేలని క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ కంపెనీ (సీఐసీ) ట్రాన్స్‌యూనియన్‌ సిబిల్‌ తెలిపింది. రుణ చెల్లింపు సామర్థ్యానికి దర్పణంగా నిలిచే క్రెడిట్‌ స్కోర్‌ పరంగా చూసినా, 57% మంది మహిళలు ‘ప్రైమ్‌’ విభాగంలోకి వస్తే, పురుషులు 51% మందే ఉన్నట్లు వివరించింది. వ్యక్తిగత రుణాలతో పాటు విలువైన సామగ్రి కొనుగోలుకు రుణాలు తీసుకోవడంలోనూ మహిళలు ఆసక్తి కనబరుస్తున్నారని తెలిపింది. వ్యాపార రుణాల్లోనూ 32% మంది మహిళలే ఉంటున్నారు.
* దేశంలో 45.40 కోట్ల మంది మహిళలుంటే, 2022 నాటికి 6.3 కోట్ల మంది రుణాలు తీసుకున్నారు. 2022లో ఎక్కువమంది వ్యవసాయ రుణాలు, విలువైన వస్తువుల కొనుగోలుకు రుణం తీసుకున్నారు.
* మహిళల పేరిట ఇచ్చిన రుణాల మొత్తం రూ.16 లక్షల కోట్లకు చేరిందని, మొత్తం రుణాల్లో ఇది 19 శాతానికి సమానమని పేర్కొంది.
* 91.7 లక్షల మంది మహిళలు రుణాలు తీసుకోవడం ద్వారా, ఈ విభాగంలో తమిళనాడు దేశంలోనే ముందు ఉందని తెలిపింది.


8.5% నుంచే గృహ రుణాలు: బీఓబీ

దిల్లీ:ఈ నెల 31 వరకు గృహ రుణాలపై వడ్డీ రేటును 0.4% తగ్గిస్తున్నట్లు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) ప్రకటించింది. దీంతో బీఓబీ గృహ రుణాలు 8.5% నుంచి లభించనున్నాయి. ఎంఎస్‌ఎంఈ రుణాలపై ప్రారంభ వడ్డీ రేటును 8.40 శాతానికి తగ్గించారు. ప్రాసెసింగ్‌ ఛార్జీలను గృహరుణాలపై  100 శాతం, ఎంఎస్‌ఎంఈ రుణాలపై 50% తగ్గించామంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని