సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ను కొంటా.. డిజిటల్‌ బ్యాంక్‌గా మారుస్తా: మస్క్‌

సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌(ఎస్‌వీబీ) సంక్షోభంపై ట్విటర్‌ సీఈఓ ఎలాన్‌ మస్క్‌ స్పందించారు. సంక్షోభంలో ఉన్న ఆ బ్యాంకును కొనుగోలు చేసేందుకు తాను సిద్ధమని ప్రకటించారు.

Updated : 12 Mar 2023 04:16 IST

సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌(ఎస్‌వీబీ) సంక్షోభంపై ట్విటర్‌ సీఈఓ ఎలాన్‌ మస్క్‌ స్పందించారు. సంక్షోభంలో ఉన్న ఆ బ్యాంకును కొనుగోలు చేసేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. ఎస్‌వీబీని డిజిటల్‌ బ్యాంక్‌గా మారుస్తానంటూ ట్వీట్‌ చేశాడు. ‘ఎస్‌వీబీని ట్విటర్‌ కొనుగోలు చేసి డిజిటల్‌ బ్యాంక్‌గా మార్చాలి’ అంటూ ఎలక్టాన్రిక్‌ కంపెనీ రేజర్‌ సీఈఓ మిన్‌-లియాంగ్‌ టన్‌ ట్వీట్‌ చేయగా.. అందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఎలాన్‌ మస్క్‌ బదులిచ్చారు.

10 రోజుల ముందే షేర్లు అమ్మేసిన సీఈఓ: అమెరికా సహా ఇతర మార్కెట్లలో బ్యాంకింగ్‌ షేర్ల పతనానికి కారణమైన సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ విషయంలో మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. బ్యాంక్‌లో సంక్షోభం తలెత్తడానికి కొద్ది రోజుల ముందే బ్యాంక్‌ సీఈఓ గ్రెగ్‌ బెకర్‌ తన షేర్లు అమ్మారని తెలిసింది. ఎస్‌వీబీ మాతృ సంస్థ అయిన ఎస్‌వీబీ ఫైనాన్షియల్‌లో ఉన్న 3.6 బిలియన్‌ డాలర్ల విలువైన షేర్లను ఫిబ్రవరి 27న విక్రయించారని ఆ గ్రూప్‌ ఎక్స్ఛేంజీలకిచ్చిన సమాచారంలో తెలిపింది. షేర్ల విక్రయానికి అనుమతి ఇవ్వాలని జనవరి 26నే నియంత్రణ సంస్థలను బెకర్‌ కోరినట్లు వెల్లడైంది. బ్యాంకు వైఫల్యం చెందడానికి కొద్ది రోజుల ముందే బెకర్‌ తన షేర్లను విక్రయించడం చర్చనీయాంశమైంది. దీనిపై అటు బెకర్‌గానీ, ఎస్‌వీబీ గ్రూప్‌ గానీ అధికారికంగా స్పందించలేదు. బ్యాంకులో వాటాల విక్రయం ప్రతిపాదన గురించి బెకర్‌కు ముందే తెలుసా అనేదీ తెలియరాలేదు.

కాగా, బ్యాంకు డిపాజిట్లకు, ఆస్తులకు మధ్య పొంతన లేకపోవడంతో శుక్రవారం సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ ఆస్తులను ‘ద ఫెడరల్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌(ఎఫ్‌డీఐసీ) స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. 2008లో వాషింగ్టన్‌ మ్యూచువల్‌ తర్వాత అమెరికా బ్యాంకింగ్‌ వ్యవస్థలో ఇదే అతిపెద్ద బ్యాంకు వైఫల్యం కావడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని