ఆర్‌బీఐ కఠిన నిబంధనలే బ్యాంకులకు రక్ష

భారతీయ బ్యాంకులు వ్యవస్థాగతంగా పటిష్టంగా ఉన్నాయని, ఇందుకు ఆర్‌బీఐ నిరంతర పర్యవేక్షణ, కఠిన నిబంధనలే కారణమని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) అధ్యక్షుడు, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ ఛైర్మన్‌, ఎండీ సంజీవ్‌ బజాజ్‌ అన్నారు. ‘అంతర్జాతీయ పరిణామాల వల్ల దేశ వృద్ధిపై కొంత ప్రభావం పడొచ్చ’ని పేర్కొన్నారు.

Published : 18 Mar 2023 08:49 IST

సీఐఐ అధ్యక్షుడు సంజీవ్‌ బజాజ్‌

ఈనాడు, హైదరాబాద్‌: భారతీయ బ్యాంకులు వ్యవస్థాగతంగా పటిష్టంగా ఉన్నాయని, ఇందుకు ఆర్‌బీఐ నిరంతర పర్యవేక్షణ, కఠిన నిబంధనలే కారణమని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) అధ్యక్షుడు, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ ఛైర్మన్‌, ఎండీ సంజీవ్‌ బజాజ్‌ అన్నారు. ‘అంతర్జాతీయ పరిణామాల వల్ల దేశ వృద్ధిపై కొంత ప్రభావం పడొచ్చ’ని పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన సీఐఐ దక్షిణ ప్రాంత వార్షిక సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. గత 25 ఏళ్లుగా దేశంలో భౌతిక, డిజిటల్‌ మౌలిక వసతులు ఎంతో అభివృద్ధి చెందినందున, ప్రపంచానికి కొత్త ఆవిష్కరణలు అందించే దిశగా మన పరిశ్రమ సాగాలని ఉద్బోధించారు.

రుణాలకు ఇబ్బంది లేదు: అమెరికా, ఐరోపాల్లో కొన్ని బ్యాంకుల మూసివేతపై స్పందిస్తూ.. భారతీయ బ్యాంకులు ఎంత బలంగా ఉన్నాయో ప్రపంచానికి చాటి చెప్పే సమయం ఇదని అన్నారు. ‘ప్రస్తుతం విదేశాల్లో రుణ లభ్యత  కష్టంగా మారినా, ఇది స్వల్పకాలమే. దేశంలో మంచి కంపెనీలు, అంకురాలకు రుణాలు పెద్ద సమస్యే కాదు. మంచి ఆలోచనలు, వ్యాపారాలకు ప్రపంచ వ్యాప్తంగా తగినంత మూలధనం అందుబాటులో ఉంది’ అని అన్నారు.

అత్యాశ వద్దు: ఫిన్‌టెక్‌ అంకురాల్లో పెట్టుబడులు పెట్టేందుకు బ్యాంకులు, బీమా సంస్థలు అత్యుత్సాహం చూపొద్దని ఆయన సూచించారు. కొన్ని అంకురాలు బాగానే పనిచేస్తున్నా, తమ విలువను ఎన్నో రెట్లు అధికంగా చూపిస్తున్నాయని పేర్కొన్నారు. ‘అందువల్ల వృద్ధిని మాత్రమే కాకుండా, ఆయా సంస్థల్లోని నష్టభయాలనూ గమనించాలి. పెట్టుబడి ఎలా తిరిగి వస్తుందన్న దానిపై దృష్టి ఉండాలి’ అని తెలిపారు.

వడ్డీ రేట్ల పెంపు ఆగాలి: ‘వడ్డీ రేట్ల పెంపునకు విరామం కావాలి. ప్రస్తుతం దేశంలో సహేతుక వడ్డీ రేట్లు ఉన్నాయి. అందువల్ల భవిష్యత్తు పెంపుపై ఆర్‌బీఐ తగిన విధంగా వ్యవహరిస్తుందని నమ్ముతున్నట్లు’ బజాజ్‌ పేర్కొన్నారు. కార్యక్రమంలో.. సీఐఐ డైరెక్టర్‌ జనరల్‌ చంద్రజిత్‌ బెనర్జీ, సీఐఐ దక్షిణ ప్రాంత విభాగం డిప్యూటీ ఛైర్మన్‌, వోల్వో గ్రూపు ఇండియా ప్రెసిడెంట్‌, ఎండీ కమల్‌ బాలి, బ్లూమ్‌బర్గ్‌ ఎన్‌ఈఎఫ్‌ కమోడిటీస్‌, ఎనర్జీ గ్లోబల్‌ హెడ్‌ ఆశిశ్‌ సేథియా ప్రసంగించారు.


మరిన్ని ఆవిష్కరణలు రావాలి

‘మన దేశమే అతి పెద్ద మార్కెట్‌. ఇక్కడి ఆవిష్కరణలు మన ప్రజల అవసరాలను తీర్చగలిగితే అవి పెద్ద విజయం సాధించినట్లే. ఈ దిశగా సంస్థలు పోటీ పడాలి. అంతర్జాతీయ ప్రమాణాలతో మన ఉత్పత్తులు రావాలి. ఆరోగ్య సంరక్షణతో పాటు ప్రతి రంగంలోనూ కృత్రిమ మేధ వంటి సాంకేతికతలు కీలకం అవుతున్నాయి. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలనే అంశాన్ని చేతల్లో చూపించాలి. ప్రతి రంగంలో, రాజకీయాల్లో వారి ప్రాతినిధ్యం పెరగాలి.’  

సుచిత్ర ఎల్ల, సీఐఐ దక్షిణ ప్రాంత ఛైర్‌పర్సన్‌,
భారత్‌ బయోటెక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌


సీఐఐ దక్షిణ ప్రాంత ఛైర్మన్‌గా కమల్‌ బాలి

సీఐఐ దక్షిణ ప్రాంత విభాగం కొత్త ఛైర్మన్‌గా వోల్వో గ్రూపు ఇండియా ప్రెసిడెంట్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కమల్‌ బాలి ఎంపికయ్యారు. 2023-24 ఏడాదికి ఈయన ఛైర్మన్‌గా కొనసాగుతారు. ఇప్పటి వరకూ ఈ విభాగానికి ఆయన డిప్యూటీ ఛైర్మన్‌గా ఉన్నారు. 2017-18లో సీఐఐ కర్ణాటకకు ఛైర్మన్‌గా పనిచేశారు.

డిప్యూటీ ఛైర్‌పర్సన్‌గా చంద్ర టెక్స్‌టైల్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఆర్‌ నందిని ఎంపికయ్యారు. 2010-11లో సీఐఐ తమిళనాడు విభాగానికి ఛైర్‌పర్సన్‌గా ఆమె పనిచేశారు. సీఐఐ ఇండియన్‌ వుమెన్‌ నెట్‌వర్క్‌కూ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు