క్రెడిట్‌ సూయిజ్‌ కొనుగోలుకు యూబీఎస్‌ యత్నాలు

దివాలా అంచున ఉన్న స్విట్జర్లాండ్‌ దిగ్గజ బ్యాంక్‌ క్రెడిట్‌ సూయిజ్‌ను కొనుగోలు చేసేందుకు యూబీఎస్‌ ఏజీ చర్చలు జరుపుతోంది.

Published : 19 Mar 2023 01:29 IST

దివాలా అంచున ఉన్న స్విట్జర్లాండ్‌ దిగ్గజ బ్యాంక్‌ క్రెడిట్‌ సూయిజ్‌ను కొనుగోలు చేసేందుకు యూబీఎస్‌ ఏజీ చర్చలు జరుపుతోంది. క్రెడిట్‌ సూయిజ్‌ టేకోవర్‌కు స్విస్‌ ప్రభుత్వం గ్యారెంటీ కల్పిస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో యూబీఎస్‌ గ్రూప్‌ ఈ దిశగా యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ ఆంగ్ల వార్తా సంస్థ ‘రాయిటర్స్‌’ తన కథనంలో పేర్కొంది. అమెరికాలో సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌, సిగ్నేచర్‌ బ్యాంక్‌కు కుప్పకూలిన తర్వాత 167 ఏళ్ల చరిత్ర కలిగిన క్రెడిట్‌ సూయిజ్‌ కూడా ఆర్థికంగా పతనం అంచున ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్‌ ఇబ్బందులపై మదుపర్లను కలవరపెట్టాయి. సంక్షోభ నియంత్రణకు క్రెడిట్‌ సూయిజ్‌ను టేకోవర్‌ చేయాల్సిందిగా స్విస్‌ వర్గాల నుంచి యూబీఎస్‌కు ఒత్తిడి వస్తున్నట్లు రాయిటర్స్‌ పేర్కొంది. ఈ ప్రణాళిక ప్రకారం.. క్రెడిట్‌ సూయిజ్‌ స్విస్‌ వ్యాపారాన్ని విడదీసే అవకాశం ఉంది. ఈ వార్తలపై స్పందించేందుకు యూబీఎస్‌, స్విట్జర్లాండ్‌కు చెందిన నియంత్రణ సంస్థ ఫిన్మా నిరాకరించాయి. బ్యాంక్‌కు ఉన్న అవకాశాలపై చర్చించేందుకు క్రెడిట్‌ సూయిజ్‌ సీఎఫ్‌ఓ దీక్షిత్‌ జోషి, ఆయన బృందాలు సమావేశం కానున్నాయి. అన్ని సజావుగా సాగితే ఈ రెండు బ్యాంకుల మధ్య ఒప్పందం కుదరొచ్చని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

షేరుకు భారీ నష్టాలు: నియంత్రణపరమైన ఇబ్బందులతో క్రెడిట్‌ సూయిజ్‌లో పెట్టుబడులు కొనసాగించమని సౌదీ నేషనల్‌ బ్యాంక్‌ ప్రకటించడం సంక్షోభానికి తెరలేపింది. 2021 ఫిబ్రవరి నుంచి చూస్తే ఈ షేరు 85 శాతం వరకు క్షీణించింది. తాజా పరిణామాలతో ప్రపంచ మార్కెట్లు కుదేలవ్వగా.. ఐరోపా బ్యాంకు షేర్లు నేలచూపులు చూశాయి. స్విస్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ నుంచి 54 బి.డాలర్ల (దాదాపు రూ.4.4 లక్షల కోట్ల) రుణం పొందనున్నట్లు గురువారం క్రెడిట్‌ సూయిజ్‌ వెల్లడించడంతో షేరు మళ్లీ పుంజుకుంది. శుక్రవారం ఈసీబీ వడ్డీ రేట్లను పెంచడంతో తిరిగి 10 శాతం వరకు నష్టపోయింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు