మార్కెట్లకు బ్యాంకింగ్‌ కలకలం

సూచీల రెండు రోజుల లాభాలకు అడ్డుకట్ట పడింది. అంతర్జాతీయంగా కొన్ని బ్యాంకులు దివాలా తీయడంతో, మదుపర్లు భయాందోళనకు గురవుతున్నారు.

Published : 21 Mar 2023 01:54 IST

8 రోజుల్లో రూ.10.77 లక్షల కోట్లు ఆవిరి
సమీక్ష

సూచీల రెండు రోజుల లాభాలకు అడ్డుకట్ట పడింది. అంతర్జాతీయంగా కొన్ని బ్యాంకులు దివాలా తీయడంతో, మదుపర్లు భయాందోళనకు గురవుతున్నారు. ఫలితంగా ఫైనాన్స్‌, ఐటీ, యంత్ర పరికరాల షేర్లు డీలాపడ్డాయి. నిఫ్టీ మళ్లీ 17,000 పాయింట్ల దిగువకు చేరింది. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ సమావేశానికి ముందు మదుపర్లు కొంత అప్రమత్తత పాటించారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి 3 పైసలు పెరిగి 82.56 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 15 నెలల కనిష్ఠమైన 71.99 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.  

* మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలోని నమోదిత సంస్థల మార్కెట్‌ విలువ గత 8 ట్రేడింగ్‌ రోజుల్లో రూ.10.77 లక్షల కోట్లు ఆవిరైంది. మార్చి 8న రూ.266.24 లక్షల కోట్లుగా ఉన్న సంపద.. సోమవారం ట్రేడింగ్‌ ముగిసేసరికి రూ.255.43 లక్షల కోట్లకు చేరింది.

* సెన్సెక్స్‌ ఉదయం 57,773.55 వద్ద బలహీనంగా ప్రారంభమైంది.ఒకదశలో 900 పాయింట్లకు పైగా నష్టపోయి 57,084.91 వద్ద కనిష్ఠానికి పడిపోయింది. ఆఖరి గంటన్నరలో కోలుకుని 360.95 పాయింట్ల నష్టంతో 57,628.95 వద్ద ముగిసింది.  నిఫ్టీ 111.65 పాయింట్లు కోల్పోయి 16,988.40 దగ్గర స్థిరపడింది.

* రెండు రోజుల లాభాల తర్వాత అదానీ షేర్లు మళ్లీ నష్టపోయాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 3.84% తగ్గి రూ.1805.10 వద్ద ముగిసింది. అదానీ టోటల్‌ గ్యాస్‌ 4.99%, అదానీ పవర్‌ 4.83%, అదానీ ట్రాన్స్‌మిషన్‌ 1.49%, అంబుజా సిమెంట్స్‌ 3.37%, అదానీ విల్మర్‌ 3.16%, ఎన్‌డీటీవీ 3.11%, ఏసీసీ 1.84%, అదానీ పోర్ట్స్‌ 1.96% నీరసపడ్డాయి. అదానీ గ్రీన్‌ మాత్రమే 3.91% పెరిగింది.

* సెన్సెక్స్‌ 30 షేర్లలో 23 నష్టపోయాయి. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 4.25%, బజాజ్‌ ఫైనాన్స్‌ 3.18%, విప్రో 2.46%, టాటా స్టీల్‌ 2.38%, టాటా మోటార్స్‌ 1.96% డీలాపడ్డాయి. హెచ్‌యూఎల్‌ 2.54%, ఐటీసీ 0.80%, కోటక్‌ బ్యాంక్‌ 0.49%, నెస్లే 0.43% రాణించాయి.

* ఏటీసీ భారత అనుబంధ సంస్థ ఏటీసీ టెలికాం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో 50% వాటా కొనుగోలుకు కెనడా పింఛన్‌ నిధి సంస్థ కూడీపీక్యూ చర్చలు జరుపుతోంది.

* 2022-23లో అదానీ కృష్ణపట్నం పోర్ట్‌ రికార్డు స్థాయిలో 12.95 మిలియన్‌ టన్నుల బొగ్గును లోడింగ్‌ చేసింది. 2014-15లో ఇక్కడ జరిగిన 12.94 మి.టన్నుల బొగ్గు లోడింగ్‌ ఇప్పటివరకు అత్యధికంగా ఉంది.

* అంతర్జాతీయ సంస్థల్లో గేమింగ్‌ అంకుర సంస్థ వింజో దాదాపు రూ.410 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. సంస్థకు చెందిన గేమ్‌ డెవలపర్‌ ఫండ్‌ నుంచి ఈ పెట్టుబడులను పెట్టనుంది.

* మిత్రా అగ్రో ఎక్విప్‌మెంట్స్‌లో వాటాను 47.33% నుంచి 100 శాతానికి పెంచుకున్నట్లు మహీంద్రా అండ్‌ మహీంద్రా తెలిపింది.

* ఫిబ్రవరిలో ప్రైవేట్‌ ఈక్విటీ/వెంచర్‌ క్యాపిటల్‌ ఫండ్‌ల (పీఈ/వీసీ) పెట్టుబడులు ఏడాది క్రితంతో పోలిస్తే 44 శాతం తగ్గి 3.7 బిలియన్‌ డాలర్లకు పరిమితమైనట్లు కన్సల్టెన్సీ సంస్థ ఈవై తెలిపింది.

* గ్రూప్‌ కార్యకలాపాలపై దృష్టి పెట్టేందుకు సియట్‌ ఎండీ, సీఈఓ అనంత్‌ గోయెంకా రాజీనామా చేశారు. ఆయన ఇకపై వైస్‌ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. గోయెంకా స్థానాన్ని సీఓఓగా ఉనన అర్నబ్‌ బెనర్జీ భర్తీ చేయనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు