టెలికాం సాంకేతికత ఎగుమతిదారుగా భారత్‌

4జీ సాంకేతికతకు ముందు మనదేశం టెలికాం సాంకేతికతకు వినియోగదారుగానే ఉండేదని, కానీ ఇప్పుడు టెలికాం సాంకేతికతకు అతిపెద్ద ఎగుమతిదారుగా అవతరించేందుకు వేగంగా అడుగులు వేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.

Published : 23 Mar 2023 01:41 IST

ప్రధాని నరేంద్ర మోదీ
6జీ మార్గసూచీ పత్రం విడుదల
ఐటీయూ కార్యాలయం ప్రారంభం

దిల్లీ: 4జీ సాంకేతికతకు ముందు మనదేశం టెలికాం సాంకేతికతకు వినియోగదారుగానే ఉండేదని, కానీ ఇప్పుడు టెలికాం సాంకేతికతకు అతిపెద్ద ఎగుమతిదారుగా అవతరించేందుకు వేగంగా అడుగులు వేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ టెలిమాటిక్స్‌ క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్‌ టెలికమ్యూనికేషన్‌ యూనియన్‌ (ఐటీయూ) ఏరియా ఆఫీస్‌  ఇన్నోవేషన్‌ సెంటర్‌ను ప్రధాని బుధవారం ప్రారంభించి, ప్రసంగించారు. దేశంలో 6జీకి అనువైన వాతావరణాన్ని సృష్టించేందుకు ఈ కార్యాలయం ఉపయోగపడుతుందన్నారు. 6జీ కి సంబంధించి మార్గసూచీ పత్రాన్ని ఆయన విడుదల చేశారు. 5జీ సేవలను ప్రారంభించిన 6 నెలల్లోపే 6జీ నెట్‌వర్క్‌పై కసరత్తును ప్రారంభించడం గర్వకారణమన్నారు.

డేటా బదిలీ వేగం సెకనుకు 1 టెరాబిట్‌: 6జీ సాంకేతికతలో డేటా బదిలీ వేగం సెకనుకు 1 టెరాబిట్‌ వరకు ఉండనుంది. 5జీ గరిష్ఠ వేగం సెకనుకు 10,000 ఎంబీపీఎస్‌ కంటే ఇది 1,000 రెట్లు అధికం.

సాధికారతకు టెలికాం: ‘100 కోట్ల మొబైళ్లను ఉపయోగించడం ద్వారా.. ప్రపంచంలోనే ప్రజలు అత్యధికంగా అనుసంధానమైన దేశంగా భారత్‌ ఉంది. చౌక స్మార్ట్‌ఫోన్లు, డేటా వ్యయాలు భారత్‌ స్వరూపాన్ని మార్చేశాయి.  డిజిటల్‌ చెల్లింపులు, ప్రత్యక్ష నగదు బదిలీ, జన్‌ధన్‌, ఆధార్‌, బ్యాడ్‌బ్యాండ్‌ సేవల ద్వారా భారత్‌లో ప్రతి ఒక్కరికీ డిజిటల్‌ సేవలను వేగంగా అందుబాటులోకి తెచ్చాం. టెలికాం సాంకేతికత, ప్రజల సాధికారతకు దోహదం చేసే మార్గంలా మారింద’ని ప్రధాని వివరించారు. ఇంకా ఆయనేమన్నారంటే..

* 2014లో 24 కోట్లుగా ఇంటర్నెట్‌ వినియోగదార్లు.. ప్రస్తుతం 85 కోట్లకు చేరారు. ఇందువల్లే, దేశ ఆర్థిక వ్యవస్థ కంటే 2.5 రెట్లు అధికంగా డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతోంది.

* రానున్న రోజుల్లో 100 కొత్త 5జీ ప్రయోగశాలలను భారత్‌ ఏర్పాటు చేస్తుంది. దేశ అవసరాలకు తగ్గట్లు 5జీ అప్లికేషన్ల తయారీకి ఈ ప్రయోగశాలలు ఉపయోగపడతాయి.

* 2024 అక్టోబరులో దిల్లీలో ఐటీయూ వరల్డ్‌ టెలికమ్యూనికేషన్స్‌ స్టాండర్డైజేషన్‌ అసెంబ్లీని నిర్వహిస్తున్నాం. అప్పటిలోగా అత్యంత పేద దేశం కోసం సాంకేతికత పరంగా మన మేధావులు ఏదో ఒకటి చేయాలి. తద్వారా ఈ దశాబ్దం... భారత్‌ సాంకేతికత దశాబ్దమని చాటిచెప్పాలి.

* భూగర్భంలోని మౌలిక వసతులు ముఖ్యంగా టెలికాం ఫైబర్‌ లాంటివి దెబ్బతినకుండా కాపాడేందుకు ‘కాల్‌ బిఫోర్‌ యూ డిగ్‌’ మొబైల్‌ యాప్‌ను కూడా ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రారంభించారు.

ఐటీయూ గురించి..

* 1865లో ఇంటర్నేషనల్‌ టెలిగ్రాఫ్‌ యూనియన్‌గా ఇది వ్యవస్థాపితమైంది. ఆ తర్వాత ఇంటర్నేషనల్‌ టెలికమ్యూనికేషన్‌ యూనియన్‌గా 1932లో పేరు మార్చారు. అనంతరం 1947లో ఐక్యరాజ్యసమితిలో సమాచారం, కమ్యూనికేషన్ల సాంకేతికతల (ఐసీటీ) కోసం ప్రత్యేక విభాగంగా చేరింది.

* టెలికాం సాంకేతికతల కోసం ప్రపంచ స్థాయి ప్రమాణాలను సృష్టించేందుకు సభ్య దేశాలతో కలిసి ఇది పనిచేస్తోంది.

* ఐటీయూ వ్యవస్థాపితమైన 1865 నుంచే భారత్‌ వ్యవస్థాపిత సభ్యదేశంగా ఉంది. ఐటీయూ ఏరియా ఆఫీసు ఏర్పాటు నిమిత్తం ఆతిథ్య దేశ ఒప్పదంపై 2022లో భారత్‌ సంతకాలు చేసింది. దక్షిణాసియా ప్రాంతంలో ఐటీయూ కార్యాలయం ఏర్పాటు కావడం ఇదే మొదటిసారి.

* ఈ కార్యాలయం భారత్‌తో పాటు నేపాల్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక, మాల్దీవులు, ఆఫ్ఘనిస్తాన్‌, ఇరాన్‌లకు సేవలు అందిస్తుంది. తద్వారా ఈ దేశాల మధ్య పరస్పర ఆర్థిక సహకారాన్ని మరింత పెంచేందుకు తోడ్పడుతుంది.

భారత్‌ 6జీ మార్గసూచీ పత్రాన్ని టెక్నాలజీ ఇన్నోవేషన్‌ గ్రూపు రూపొందించింది. భారత్‌లో 6జీ కార్యాచరణ ప్రణాళికలు, మార్గసూచీని రూపొందించే ఉద్దేశంతో 2021 నవంబరులో ఏర్పాటైన ఈ కమిటీలో వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, పరిశోధన- అభివృద్ధి సంస్థలు, ప్రమాణాలను రూపొందించే సంస్థలు, టెలికాం సేవల కంపెనీలు సభ్యులుగా ఉన్నాయి.

* మన దేశానికి 6జీలో 127 పేటెంట్లు ఉన్నట్లు టెలికాం మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని