యాక్సెంచర్‌లో 19,000 ఉద్యోగాల కోత

ఐటీ సేవల బహుళజాతి దిగ్గజ సంస్థ యాక్సెంచర్‌, ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించుకుంది.

Published : 24 Mar 2023 01:35 IST

దిల్లీ: ఐటీ సేవల బహుళజాతి దిగ్గజ సంస్థ యాక్సెంచర్‌, ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించుకుంది. తమ మొత్తం ఉద్యోగుల్లో 19,000 మందిని (2.5 శాతానికి పైగా) తొలగించనున్నట్లు యాక్సెంచర్‌ గురువారం వెల్లడించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మందగమనం నెలకొన్న నేపథ్యంలో, ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. రాబోయే 18 నెలల్లో ఇది అమలవుతుంది. ‘తొలగింపునకు గురవుతున్న వారిలో సగం మంది ప్రాజెక్టు బిల్లింగ్‌తో సంబంధం లేని వారే ఉంటారని’ సంస్థ పేర్కొంది. అయితే 2023 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం నుంచి వృద్ధికి అవసరమైన విభాగాల్లో నియామకాలు కొనసాగిస్తామని పేర్కొంది. సెప్టెంబరు-ఆగస్టును ఆర్థిక సంవత్సరంగా యాక్సెంచర్‌ పాటిస్తుంటుంది. యాక్సెంచర్‌ ఉద్యోగ కోతల నిర్ణయ ప్రభావం మనదేశంలో ఎంత మందిపై ఉంటుందనేది తెలియాల్సి ఉంది. యాక్సెంచర్‌లో మొత్తం 7,00,000 మంది ఉద్యోగులుండగా అందులో 3,00,000 మంది భారత్‌లో పని చేస్తున్నారు. ఇప్పటికే అమెజాన్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, మెటా, ట్విటర్‌, ఎరిక్సన్‌ వంటి దిగ్గజ సంస్థలు భారీ సంఖ్యలో ఉద్యోగుల తొలగింపును చేపట్టిన సంగతి విదితమే.

* యాక్సెంచర్‌ తమ వార్షిక ఆదాయ వృద్ధి రేటు, లాభాల అంచనాలను స్వల్పంగా తగ్గించుకుంది. ఈ ఏడాది కంపెనీ వార్షిక ఆదాయ వృద్ధిని 8-10 శాతంగా అంచనా వేసింది. గతేడాది అంచనాతో పోలిస్తే ఇది 1 శాతం తక్కువ.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని