తెలంగాణలో రూ.76,568 కోట్ల పెట్టుబడులు

తెలంగాణ రాష్ట్రంలో  2021-22లో కొత్త పెట్టుబడులు 150 శాతం పెరిగినట్లు ఎంఎస్‌ఎంఈ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ వెల్లడించింది. కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆర్గానిక్‌ ఫుడ్‌ ప్రోడక్ట్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ ఏజెన్సీస్‌ అనే సంస్థతో కలిసి ఎంఎస్‌ఎంఈ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ (ఈపీసీ) ఒక అధ్యయనాన్ని చేపట్టింది.

Updated : 24 Mar 2023 02:10 IST

2020-21తో పోలిస్తే 150% వృద్ధి
కొత్తగా 60,000 ఉద్యోగాల కల్పన
7 లక్షలకు మించి ఐటీ ఉద్యోగాలు
ఎంఎస్‌ఎంఈ ఈపీసీ నివేదిక

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో  2021-22లో కొత్త పెట్టుబడులు 150 శాతం పెరిగినట్లు ఎంఎస్‌ఎంఈ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ వెల్లడించింది. కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆర్గానిక్‌ ఫుడ్‌ ప్రోడక్ట్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ ఏజెన్సీస్‌ అనే సంస్థతో కలిసి ఎంఎస్‌ఎంఈ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ (ఈపీసీ) ఒక అధ్యయనాన్ని చేపట్టింది. తదుపరి రూపొందించిన నివేదికను ఎంఎస్‌ఎంఈ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ డి.ఎస్‌.రావత్‌ గురువారం విడుదల చేశారు. దీని ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 2020-21లో కొత్త పెట్టుబడులు రూ.31,274 కోట్లు కాగా, 2021-22లో దీని కంటే 150 శాతం అధికంగా రూ.76,568 కోట్లు లభించాయి. ఇందులో ప్రైవేటు రంగ పెట్టుబడులు ఎంతో అధికంగా రూ.60,618 కోట్ల వరకు ఉండటం ప్రత్యేకత. అదే సమయంలో కొత్త పెట్టుబడి ప్రాజెక్టుల్లో, పూర్తయిన ప్రాజెక్టుల వాటా కూడా ఎక్కువగా ఉన్నట్లు ఈ నివేదిక వివరించింది.

వ్యవసాయం బలంగా ఉన్నందునే కొవిడ్‌ కాలంలోనూ వృద్ధి: ‘కొవిడ్‌’ మహమ్మారి విస్తరించిన కాలంలో అన్ని చోట్లా వృద్ధి రేటు మందగిస్తే తెలంగాణ రాష్ట్రం 2.2% వృద్ధి రేటు నమోదు చేసినట్లు పేర్కొంది. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలు బలంగా ఉండటం దీనికి కారణమని వివరించింది. కృత్రిమ మేధ (ఏఐ), బ్లాక్‌చైన్‌, క్లౌడ్‌, సైబర్‌ సెక్యూరిటీ విభాగాల్లో వ్యాపార సంస్థలు తమ కార్యకలాపాలు ప్రారంభించడానికి తెలంగాణ ఎంతో అనువైన ప్రదేశంగా ఉన్నట్లు వెల్లడించింది. ఐటీ ఎగుమతులు తెలంగాణ నుంచి   2014-15లో రూ.66,276 కోట్లు కాగా, 2021-22 నాటికి రూ.1.45 లక్షల కోట్లకు పెరిగినట్లు పేర్కొంది. అదే సమయంలో ఐటీ ఉద్యోగాల సంఖ్య 3.71 లక్షల నుంచి 7 లక్షలకు మించిపోయినట్లు వివరించింది.

ఆరోగ్య పర్యాటకంలోనూ: ఆరోగ్య పర్యాటక విభాగంలో తెలంగాణ ఆకర్షణీయ వృద్ధి నమోదు చేస్తున్నట్లు ఈ నివేదిక తెలియజేసింది. ఆఫ్రికా, సీఐఎస్‌, గల్ఫ్‌ దేశాల నుంచి పెద్దఎత్తున ప్రజలు వైద్య చికిత్స కోసం హైదరాబాద్‌ వస్తున్నట్లు తెలిపింది. ఆయా దేశాల నుంచి ఇప్పటి వరకు 2 లక్షల మందికి పైగా ఇక్కడ చికిత్స పొందారని, ఈ సంఖ్య మున్ముందు ఇంకా పెరుగుతుందని అంచనా వేసింది. రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా యూనిట్లు గ్రామీణ, సెమీ-అర్బన్‌ ప్రాంతాల్లో అధికంగా ఉన్నట్లు వివరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని