EPFO : నేడు ఈపీఎఫ్‌ వడ్డీరేటు ఖరారు

ఉద్యోగుల భవిష్యనిధి(ఈపీఎఫ్‌) ఖాతాల్లో నిల్వలపై వడ్డీరేటు మంగళవారం ఖరారు కానుంది. 2021-22 మాదిరిగానే 2022-23 ఆర్థిక సంవత్సరానికి 8.1% వడ్డీరేటునే కొనసాగించే అవకాశాలున్నట్లు సమాచారం.

Published : 28 Mar 2023 06:58 IST

8.10 శాతమే కొనసాగే అవకాశం!

ఈనాడు, హైదరాబాద్‌: ఉద్యోగుల భవిష్యనిధి(ఈపీఎఫ్‌) ఖాతాల్లో నిల్వలపై వడ్డీరేటు మంగళవారం ఖరారు కానుంది. 2021-22 మాదిరిగానే 2022-23 ఆర్థిక సంవత్సరానికి 8.1% వడ్డీరేటునే కొనసాగించే అవకాశాలున్నట్లు సమాచారం. ఈనెల 27, 28 తేదీల్లో సమావేశమవుతున్న ఈపీఎఫ్‌ఓ సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీ (సీబీటీ) అజెండాలో వడ్డీరేటు ఖరారు ప్రధాన అంశంగా ఉంది. అయితే వడ్డీరేటు కొంత పెంచాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. సోమవారం ప్రారంభమైన సీబీటీ సమావేశంలో కార్మికుల సమస్యలపై కార్మిక సంఘాల ప్రతినిధులు, ట్రస్టీలు పలు అంశాలపై మాట్లాడారు. అధిక పింఛనుపై సుప్రీంకోర్టు తీర్పు అమల్లో భాగంగా ఉమ్మడి ఆప్షన్‌ దరఖాస్తు విషయమై ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారుల్లో పలు సందేహాలున్నాయని, వాటికి పరిష్కారం చూపించాలని కోరారు. ఈపీఎఫ్‌ఓ గరిష్ఠ వేతన పరిమితికి మించి అధిక వేతనం పొందుతున్న ఉద్యోగులు, ఆ అధిక వేతనంపై ఈపీఎఫ్‌ చందా చెల్లించేందుకు యజమానితో కలిసి పేరా నం.26(6) కింద ఉమ్మడి ఆప్షన్‌ ఇచ్చినవారే అర్హులన్న నిబంధనతో కార్మికులు నష్టపోతున్నారని వివరించారు. ఈ మేరకు పేరా నం.26(6) కింద మినహాయింపులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అధిక పింఛనుపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు యథావిధిగా అమలు చేస్తున్నామని, ఏమైనా మార్పులు చేస్తే తీర్పు ఉల్లంఘన కిందకు వస్తుందని కార్మికశాఖ, ఈపీఎఫ్‌ఓ ఉన్నతాధికారులు పేర్కొన్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని