ఆదుకున్న రిలయన్స్‌, మారుతీ షేర్లు

రిలయన్స్‌, మారుతీ, ఎస్‌బీఐ వంటి పెద్ద షేర్లు ఆదుకోవడంతో సూచీల రెండు రోజుల వరుస నష్టాలకు అడ్డుకట్ట పడింది. అమెరికా, ఐరోపా బ్యాంకింగ్‌ వ్యవస్థల సంక్షోభం నేపథ్యంలో మదుపర్లు ఆచితూచి వ్యవహరించారు.

Updated : 28 Mar 2023 02:21 IST

సమీక్ష

రిలయన్స్‌, మారుతీ, ఎస్‌బీఐ వంటి పెద్ద షేర్లు ఆదుకోవడంతో సూచీల రెండు రోజుల వరుస నష్టాలకు అడ్డుకట్ట పడింది. అమెరికా, ఐరోపా బ్యాంకింగ్‌ వ్యవస్థల సంక్షోభం నేపథ్యంలో మదుపర్లు ఆచితూచి వ్యవహరించారు. రూపాయి బలపడడం సెంటిమెంట్‌ను మెరుగుపరచగా, విదేశీ అమ్మకాలు లాభాలను పరిమితం చేశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 3 పైసలు పెరిగి 82.37 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 0.39% లాభపడి 75.28 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లలో జపాన్‌ మినహా మిగతావి నష్టపోయాయి. ఐరోపా సూచీలు రాణించాయి.

సెన్సెక్స్‌ ఉదయం 57,566.90 వద్ద స్తబ్దుగా ప్రారంభమైంది. ప్రారంభ ట్రేడింగ్‌లో 57,415.02 వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ.. మళ్లీ పుంజుకుని లాభాల్లోకి వచ్చింది. ఒకదశలో 58,019.55 వద్ద గరిష్ఠానికి చేరింది. ఆఖర్లో అమ్మకాల ఒత్తిడి ఎదురుకావడంతో 126.76 పాయింట్ల లాభంతో 57,653.86 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 40.65 పాయింట్లు పెరిగి 16,985.70 దగ్గర స్థిరపడింది.

* సోమవారం అదానీ గ్రూప్‌ షేర్లు నష్టాల్లో ముగిశాయి. అదానీ పవర్‌ 4.98%, అదానీ ట్రాన్స్‌మిషన్‌ 4.98%, అదానీ విల్మర్‌ 4.93%, అదానీ టోటల్‌ గ్యాస్‌ 4.91% చొప్పున తగ్గి లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి. ఎన్‌డీటీవీ 4.60%, అదానీ గ్రీన్‌ 4.40%, అదానీ పోర్ట్స్‌ 1.43%, ఏసీసీ 1.01%, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 0.99%, అంబుజా 0.59% పడ్డాయి.

* సెన్సెక్స్‌ 30 షేర్లలో 16 లాభపడ్డాయి. రిలయన్స్‌  1.54%, సన్‌ఫార్మా 1.15%, ఎస్‌బీఐ 0.87%, కోటక్‌ బ్యాంక్‌ 0.80%  చొప్పున రాణించాయి. ఎం అండ్‌ ఎం, పవర్‌గ్రిడ్‌, టాటా మోటార్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ 1.06% వరకు నష్టపోయాయి. రంగాల వారీ సూచీల్లో ఆరోగ్య సంరక్షణ, ఎఫ్‌ఎమ్‌సీజీ, బ్యాంకింగ్‌, లోహ, టెక్‌ మెరిశాయి. విద్యుత్‌, యుటిలిటీస్‌, పరిశ్రమలు, వాహన, స్థిరాస్తి, సేవలు డీలాపడ్డాయి.

* ఏప్రిల్‌ 1 నుంచి డెట్‌ మ్యూచువల్‌ ఫండ్లకు కొత్త పన్ను నిబంధనలు అమల్లోకి రానున్న తరుణంలో పెట్టుబడులు పెంచుకునేందుకు పలు అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు చూస్తున్నాయి. ఇందులో భాగంగా ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌టన్‌ మ్యూచువల్‌ ఫండ్‌, మిరే అసెట్‌ మ్యూచువల్‌ ఫండ్‌, ఎడెల్‌వీస్‌ మ్యూచువల్‌ ఫండ్‌లు అంతర్జాతీయ పథకాలను పునరుద్ధరించాయి.

* ముఖం, నాలుక, ఇతర శరీర భాగాల కదలికల ఇబ్బందుల చికిత్సలో వినియోగించే వాల్బెనైజ్‌ జనరిక్‌ క్యాప్సూళ్లకు యూఎస్‌ఎఫ్‌డీఏ తాత్కాలిక అనుమతి ఇచ్చినట్లు లుపిన్‌ తెలిపింది.

* ఆఫ్‌లైన్‌ రిటైల్‌ చెల్లింపుల పైలెట్‌ ప్రాజెక్ట్‌కు స్వీడన్‌ కంపెనీ క్రంచ్‌ఫిష్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ తెలిపింది.

* ఆఫ్రికా దేశం ఘనాలో అపాచీ 180, నియో ఎన్‌ఎక్స్‌ సహా ఏడు కొత్త మోడళ్లను టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ విడుదల చేసింది.

* భారత్‌ 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు స్మార్ట్‌ సిటీలు, గ్రామాల అభివృద్ధిలో ప్రజా-ప్రైవేట్‌ భాగస్వామ్యాలు (పీపీపీ) కీలకమని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ పేర్కొన్నారు.

* రాఘవ్‌ బాల్‌కు చెందిన డిజిటల్‌ న్యూస్‌ ప్లాట్‌ఫామ్‌ క్వింటిలియన్‌ బిజినెస్‌ మీడియాలో 49 శాతం వాటాను రూ.48 కోట్లకు గౌతమ్‌ అదానీ సంస్థ ఏఎంజీ మీడియా నెట్‌వర్క్స్‌ కొనుగోలు చేసింది.

* బీమా బ్రోకింగ్‌ వ్యాపారం నుంచి ఆదిత్య బిర్లా క్యాపిటల్‌ నిష్క్రమించింది. ఈ విభాగాన్ని ఎడ్మీ సర్వీసెస్‌ వెల్లడించని మొత్తానికి కొనుగోలు చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు