ఆద్యంతం ఒడుదొడుకులే

ఆద్యంతం ఒడుదొడుకులు ఎదుర్కొన్న సూచీలు, చివరకు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ షేర్లు రాణించినప్పటికీ.. ఐటీ, వాహన షేర్లకు అమ్మకాల ఒత్తిడి ఎదురైంది.

Published : 29 Mar 2023 03:28 IST

సమీక్ష

ద్యంతం ఒడుదొడుకులు ఎదుర్కొన్న సూచీలు, చివరకు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ షేర్లు రాణించినప్పటికీ.. ఐటీ, వాహన షేర్లకు అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. మార్చి డెరివేటివ్‌ కాంట్రాక్టుల ముగింపునకు ముందు మదుపర్ల లాభాల స్వీకరణతో సెంటిమెంట్‌ దెబ్బతింది. డాలరుతో పోలిస్తే రూపాయి 15 పైసలు పెరిగి 82.16 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 78.51 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగియగా, ఐరోపా సూచీలు మెరిశాయి.

* సెన్సెక్స్‌ ఉదయం 57,751.50 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. అదే జోరులో 57,949.45 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. గరిష్ఠాల్లో లాభాల్లో వెనక్కి వచ్చిన సూచీ.. ఇంట్రాడేలో 57,494.91 వద్ద కనిష్ఠానికి చేరింది. చివరకు 40.14 పాయింట్ల నష్టంతో 57,613.72 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 34 పాయింట్లు తగ్గి 16,951.70 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 16,913.75- 17,016.75 పాయింట్ల మధ్య కదలాడింది.

* వరుసగా రెండో రోజూ అదానీ షేర్లు కుదేలయ్యాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 7.06%, అదానీ పోర్ట్స్‌ 5.66%, అదానీ పవర్‌ 5%, అదానీ ట్రాన్స్‌మిషన్‌ 5%, అదానీ గ్రీన్‌ ఎనర్జీ 5%, అదానీ టోటల్‌ గ్యాస్‌ 5%, అదానీ విల్మర్‌ 4.99%, ఎన్‌డీటీవీ 4.99%, ఏసీసీ 4.22%, అంబుజా సిమెంట్స్‌ 2.91% నష్టాలు నమోదుచేశాయి.

* సెన్సెక్స్‌ 30 షేర్లలో 19 డీలాపడ్డాయి. టెక్‌ మహీంద్రా 2.90%, టాటా మోటార్స్‌ 2.46%, భారతీ ఎయిర్‌టెల్‌ 1.80%, విప్రో 1.40%, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 1.29%, హెచ్‌సీఎల్‌ టెక్‌ 1.26%, బజాజ్‌ ఫైనాన్స్‌ 1.04%, ఎల్‌ అండ్‌ టీ 0.95% చొప్పున నష్టపోయాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్‌ 2.33% లాభపడ్డాయి.

* అర్షద్‌ వార్సీకి ఉపశమనం: యూట్యూబ్‌లో తప్పుదోవ పట్టించే వీడియోలకు సంబంధించిన కేసులో బాలీవుడ్‌ నటుడు అర్షద్‌ వార్సీ, ఆయన భార్య మరియా గోరెట్టీలకు ఉపశమనం లభించింది. పంప్‌ అండ్‌ డంప్‌ పథకం ఆరోపణలపై మార్చి 2న వార్సీ దంపతులతో పాటు 31 సంస్థలపై సెబీ నిషేధం విధించింది. తాజాగా సెబీ ఆదేశాలను సెక్యూరిటీస్‌ అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌ (శాట్‌) పక్కన పెట్టింది.

* సహారా ఇండియా గ్రూప్‌ సంస్థ, దాని అధిపతి సుబ్రతా రాయ్‌, ఇతరుల నుంచి రావాల్సిన రూ.6.57 కోట్ల బకాయిలను వసూలు చేసినట్లు సెబీ తెలిపింది.

* వ్యాపారాన్ని సులభతరం చేయడం, రిజిస్ట్రేషన్‌కు పట్టే సమయాన్ని తగ్గించడంలో భాగంగా విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్ల (ఎఫ్‌పీఐల) ఆన్‌బోర్డింగ్‌ ప్రక్రియను సెబీ సులభతరం చేసింది.

* ఎలక్ట్రానిక్స్‌ తయారీ సేవల సంస్థ అవలాన్‌ టెక్నాలజీస్‌ రాబోయే ఐపీఓ ధరల శ్రేణిని ఒక్కో షేరుకు రూ.415-436గా నిర్ణయించింది. ఏప్రిల్‌ 3న ప్రారంభం కానున్న ఈ రూ.865 కోట్ల ఐపీఓ.. 6వ తేదీన ముగియనుంది.

* సెకండ్‌ స్పెషల్‌ సిచ్యుయేషన్స్‌ ఫండ్‌ కోసం 1.25 బిలియన్‌ డాలర్లను సమీకరించినట్లు కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ అనుబంధ సంస్థ కోటక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్స్‌ ప్రకటించింది.

* పెన్షన్‌ నిధి నియంత్రణ, అభివృద్ధి సంస్థ (పీఎఫ్‌ఆర్‌డీఏ) అంబుడ్స్‌మన్‌ వయసు పరిమితిని 65 ఏళ్ల నుంచి 70 ఏళ్లకు పెంచింది. అంబుడ్స్‌మన్‌ పదవీ కాలం మూడేళ్లు ఉంటుంది. మరో రెండేళ్ల వరకూ పొడిగించే వీలుంటుంది. ఫిర్యాదులను పరిష్కరించేందుకు పీఎఫ్‌ఆర్‌డీఏ అంబుడ్స్‌మన్‌ను నియమిస్తుంది.

* కల్యాణ్‌ జ్యువెలర్స్‌లో 2.26 శాతం షేర్లను హైడెల్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఓపెన్‌ మార్కెట్‌ లావాదేవీలో విక్రయించింది. ఒక్కో షేరును రూ.110.04 చొప్పున మొత్తం 2,33,25,686 షేర్లను రూ.256.67 కోట్లకు విక్రయించింది. డిసెంబరు త్రైమాసికం నాటికి కల్యాణ్‌ జ్యువెలర్స్‌లో హైడెల్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు 26.36 శాతం వాటా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని