సంక్షిప్త వార్తలు(7)

మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) 1986-87 నుంచి ఇప్పటి వరకు 25 లక్షల వాహనాల ఎగుమతుల మైలురాయిని అధిగమించినట్లు పేర్కొంది.

Updated : 30 Mar 2023 03:19 IST

మారుతీ వాహన ఎగుమతులుజీ @ 25 లక్షలు

దిల్లీ: మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) 1986-87 నుంచి ఇప్పటి వరకు 25 లక్షల వాహనాల ఎగుమతుల మైలురాయిని అధిగమించినట్లు పేర్కొంది. భారత్‌కు పొరుగు దేశాలైన బంగ్లాదేశ్‌, నేపాల్‌లకు 1986-87 నుంచి ఎగుమతులు ప్రారంభించిన ఎంఎస్‌ఐ ప్రస్తుతం ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా, ఆసియా, మధ్య ప్రాచ్యంలోని సుమారు 100 దేశాలకు  వాహనాలను ఎగుమతి చేస్తోంది. గుజరాత్‌ ముంద్రా పోర్టు నుంచి లాటిన్‌ అమెరికాకు ఎగుమతి చేసిన బాలెనోతో 25 లక్షల మార్కును అధిగమించినట్లు కంపెనీ తెలిపింది.

మహీంద్రా థార్‌ ఉత్పత్తి జీ 1,00,000: తమ స్పోర్ట్స్‌ వినియోగ వాహనం థార్‌ల సంచిత (క్యుములేటివ్‌) ఉత్పత్తి 2.5 ఏళ్లలో లక్ష మైలురాయిని అధిగమించినట్లు మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎంఅండ్‌ఎం) బుధవారం వెల్లడించింది.


గ్రాన్యూల్స్‌ గాబాపెంటిన్‌ మాత్రలకు యూఎస్‌ఎఫ్‌డీఏ అనుమతి

ఈనాడు, హైదరాబాద్‌: గ్రాన్యూల్స్‌ ఇండియా తన గాబాపెంటిన్‌ మాత్రలకు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ(యూఎస్‌ఎఫ్‌డీఏ) నుంచి అనుమతి సంపాదించింది. ఈ ఔషధాన్ని నరాల సంబంధిత వ్యాధి చికిత్సలో వినియోగిస్తున్నారు. గాబాపెంటిన్‌ 600 ఎంజీ, 800 ఎంజీ ట్యాబ్లెట్లకు అనుమతి లభించినట్లు గ్రాన్యూల్స్‌ ఇండియా పేర్కొంది. వయాట్రిస్‌ స్పెషాలిటీ ఎల్‌ఎల్‌సీ. అనే సంస్థ న్యూరాంటిన్‌ అనే బ్రాండు పేరుతో ఈ ఔషధాన్ని విక్రయిస్తోంది. యూఎస్‌లో ఏటా దాదాపు 145 మిలియన్‌ డాలర్ల అమ్మకాలను ఈ మందు నమోదు చేస్తోంది. దీంతో కలిసి యూఎస్‌తో తమకు 55 ఔషధాలకు అనుమతి లభించినట్లు అవుతుందని గ్రాన్యూల్స్‌ ఇండియా వెల్లడించింది.


అసోచామ్‌ అధ్యక్షుడిగా అజయ్‌ సింగ్‌

ఈనాడు, హైదరాబాద్‌: భారత్‌లోని పరిశ్రమ సంఘాల్లో ఒకటైన అసోసియేటెడ్‌ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ ఆఫ్‌ ఇండియా(అసోచామ్‌) అధ్యక్షుడిగా స్పైస్‌జెట్‌ సీఎండీ అజయ్‌ సింగ్‌ పదవీ బాధ్యతలు చేపట్టారు. అసోఛామ్‌ సీనియర్‌ ఉపాధ్యక్షుడిగా సోరిన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ ఛైర్మన్‌ సంజయ్‌ నాయర్‌ వ్యవహరిస్తారు. వందేళ్లకు పైగా సేవలు అందిస్తున్న అసోచామ్‌ వంటి ప్రతిష్ఠాత్మకమైన సంస్థకు అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించడానికి  ఎంతో ఆసక్తిగా ఉన్నట్లు అజయ్‌ సింగ్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఎంతో వేగంగా మారుతున్న ప్రస్తుత ఆర్థిక, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఆర్థిక వేత్తలు, విద్యావేత్తలతో కలిసి పనిచేసేందుకు ప్రాధాన్యం ఇస్తామని ఆయన వివరించారు.


ఈ ఏడాది సరాసరి వేతన పెంపు 9.1%

డెలాయిట్‌ ఇండియా అధ్యయనం

ముంబయి: ఈ ఏడాది సరాసరి వేతన పెంపు 9.1 శాతానికి తగ్గొచ్చని డెలాయిట్‌ ఇండియా టాలెంట్‌ అవుట్‌లుక్‌ 2023 నివేదికలో వెల్లడించింది. ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్లు, ఆర్థిక వ్యవస్థలో మందగమనం వంటి అంశాలు వేతనాలపై ప్రభావం చూపుతాయని పేర్కొంది. 2022లో సరాసరి వేతన పెంపు 9.4 శాతంగా ఉన్నట్లు తెలిపింది. 2023లో లైఫ్‌సైన్సెస్‌ రంగంలో అత్యధిక వేతన పెంపు ఉండొచ్చని అంచనా వేసింది. ఐటీ రంగంలో గత ఏడాదితో పోలిస్తే ఈసారి వేతనాల పెంపు తక్కువగా ఉంటుందని తెలిపింది. దేశంలో వలసల రేటు 2022లో 19.7 శాతానికి పెరిగిందని, 2021లో ఈ రేటు 19.4 శాతంగా ఉందని వివరించింది. 2023 జనవరిలో 7 రంగాలు, 25 ఉప రంగాల్లోని 300 సంస్థలపై అధ్యయనం చేసి డెలాయిట్‌ ఇండియా ఈ నివేదికను రూపొందించింది.


జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ చేతికి మిత్రా ఎనర్జీ ఆస్తులు

దిల్లీ: మిత్రా ఎనర్జీ (ఇండియా) ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన 1753 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన ఆస్తులను రూ.10,150 కోట్లకు కొనుగోలు చేయడం పూర్తి చేసినట్లు జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ ప్రకటించింది. జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ అనుబంధ సంస్థ జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ ఈ కొనుగోలును పూర్తి చేసింది. దేశంలోని దక్షిణ, పశ్చిమ, మధ్య రాష్ట్రాల్లో కంపెనీకి 1331 మెగావాట్ల పవన విద్యుత్‌, 422 మెగావాట్ల సౌరశక్తి విద్యుత్‌ పోర్ట్‌ఫోలియో ఉంది. వీటికి ఇంకా 17 ఏళ్ల సగటు కాలవ్యవధి ఉంది. జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ స్థాపించిన తర్వాత ఇదే అతిపెద్ద కొనుగోలు కావడం గమనార్హం.


కీలక రేట్లు మరో పావు శాతం పెంపు!

యాక్సిస్‌ బ్యాంకు ఆర్థికవేత్తల అంచనా

ముంబయి: వచ్చే నెల జరగనున్న పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) కీలక రేట్లను మరో 25 బేసిస్‌ పాయింట్లు (పావు శాతం) పెంచే అవకాశం ఉందని యాక్సిస్‌ బ్యాంకుకు చెందిన ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత రేట్ల పెంపు ప్రక్రియలో.. ఇదే చివరిది కావొచ్చని అభిప్రాయపడ్డారు. వచ్చే ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో కీలక రేట్లను తగ్గించడాన్ని ఆర్‌బీఐ ప్రారంభించే అవకాశం ఉందని తెలిపారు. కాగా.. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే ఉద్దేశంతో మే 2022 నుంచి ఆర్‌బీఐ కీలక రేట్లను 250 బేసిస్‌ పాయింట్లు పెంచిన సంగతి తెలిసిందే. ఈ పరిణామం రుణ గ్రహీతల ఈఎంఐల (నెలవారీ వాయిదాల) భారాన్ని పెంచింది.


సంక్షిప్తంగా..

* భారత ఆర్థిక వ్యవస్థ వచ్చే దశాబ్దం పాటు 6.5 శాతం వృద్ధి రేటు సాధించే అవకాశం ఉందని ముఖ్య ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్‌ వెల్లడించారు.

* 4 సహారా గ్రూప్‌ సహకార సంఘాలకు చెందిన 10 కోట్ల మంది మదుపర్లకు 9 నెలల్లోగా వారి నగదు వెనక్కి వస్తుందని ప్రభుత్వం తెలిపింది. సహారా-సెబీ రిఫండ్‌ ఖాతా నుంచి రూ.5,000 కోట్లను సెంట్రల్‌ రిజిస్ట్రార్‌కు బదిలీ చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించడం ఇందుకు నేపథ్యం.

* దేశీయ మొబైల్‌ తయారీని ప్రోత్సహించే ఉద్దేశంతో తీసుకొచ్చిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకం కింద పెట్టుబడుల లక్ష్యాన్ని రూ.5,124 కోట్లకు పెంచినట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ పార్లమెంటుకు తెలిపారు.

* 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌ జియో, వొడాఫోన్‌ ఐడియాతో పాటు మొత్తం 6 టెలికాం కంపెనీలకు రూ.4.17 లక్షల కోట్ల అప్పులున్నాయని కేంద్ర టెలికాం సహాయ మంత్రి దేవ్‌సిన్హ్‌ చౌహాన్‌ పార్లమెంట్‌కు తెలిపారు.

* ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌తో ఉన్న వివాదాలను పరిష్కరించుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ తెలిపింది. దీంతో షేరు 3 శాతానికిపైగా పెరిగి బీఎస్‌ఈలో రూ.216 వద్ద ముగిసింది.

* భారతీయ రైల్వేలకు 300 విద్యుత్‌ లోకోలను డెలివరీ చేసినట్లు ఫ్రెంచ్‌ బహుళజాతి రోలింగ్‌ స్టాక్‌ తయారీ సంస్థ ఆల్‌స్టోమ్‌ బుధవారం వెల్లడించింది.

* మధ్యప్రాచ్యం, ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో విమానయాన ధరలు పెరుగుతుండటంతో ఈ రంగ రికవరీకి ప్రమాదం పొంచి ఉందని అంతర్జాతీయ విమానాశ్రయాల మండలి (ఏసీఐ)-ఆసియా పసిఫిక్‌ తెలిపింది.

* వచ్చే మే నుంచి కృష్ణా-గోదావరి (కేజీ-డి5) బ్లాక్‌లో చమురు ఉత్పత్తిని, 2024లో సహజ వాయువు ఉత్పత్తిని ప్రారంభిస్తామని ఓఎన్‌జీసీ వెల్లడించింది.

* 2030 నాటికి ఏడాదికి 10 లక్షల విద్యుత్‌ వాహనాలను ఉత్పత్తి చేసే లక్ష్యంతో కర్ణాటకలో నర్సాపుర ప్లాంటును ఏర్పాటు చేసినట్లు హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా తెలిపింది.

* ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త నవీన్‌ జిందాల్‌కుడల్లాస్‌లోని టెక్సాస్‌ విశ్వవిద్యాలయం జీవనకాల సాఫల్య పురస్కారం అందించింది.

* బహరామ్‌పోర్‌-ఫరక్కా హైవేస్‌ లిమిటెడ్‌ను రూ.1,323 కోట్లకు క్యూబ్‌ హైవేస్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వి ప్రై.లిమిటెడ్‌కు విక్రయించినట్లు హిందుస్థాన్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ (హెచ్‌సీసీ) బుధవారం వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని