రూ.164 లక్షల కోట్ల ఎగుమతులు!

దేశ ఎగుమతులను 2030 కల్లా 2 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.164 లక్షల కోట్ల)కు పెంచుకునే లక్ష్యంతో కొత్త విదేశీ వాణిజ్య విధానాన్ని (ఎఫ్‌టీపీ) కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరించింది.

Published : 01 Apr 2023 04:54 IST

2030 లక్ష్యం
కొత్త విదేశీ వాణిజ్య విధానం ఆవిష్కరణ
ఇ-కామర్స్‌ ఎగుమతులకూ ప్రయోజనాలు
రూపాయల్లో వాణిజ్యం పెంచడంపై దృష్టి

దిల్లీ: దేశ ఎగుమతులను 2030 కల్లా 2 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.164 లక్షల కోట్ల)కు పెంచుకునే లక్ష్యంతో కొత్త విదేశీ వాణిజ్య విధానాన్ని (ఎఫ్‌టీపీ) కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరించింది. శుక్రవారం కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్‌ గోయల్‌, ఫారిన్‌ ట్రేడ్‌ డైరెక్టరు జనరల్‌ (డీజీఎఫ్‌టీ) సంతోష్‌ సారంగి కొత్త ఎఫ్‌టీపీ ప్రత్యేకతలను విలేకర్లకు తెలియజేశారు. రూపాయిని అంతర్జాతీయ కరెన్సీగా మార్చడం, ఇ-కామర్స్‌ ఎగుమతులకూ ప్రయోజనాలు వర్తింపజేయడం కొత్త ఎఫ్‌టీపీ ప్రధాన ఉద్దేశాలుగా ఉన్నాయి. రాష్ట్రాలు, జిల్లాల్లోని ఎగుమతిదార్లు, విదేశాల్లోని భారత రాయబార్ల మధ్య పరస్పర సహకారాన్ని ప్రోత్సహించడం, లావాదేవీల వ్యయాలు తగ్గించడం, మరిన్ని ఎగుమతి కేంద్రాల అభివృద్ధికి ఇందులో ప్రాధాన్యమిచ్చారు.


తుది తేదీ లేదు  

సాధారణంగా ఎఫ్‌టీపీలను అయిదేళ్ల కాలానికి ప్రకటిస్తుంటారు. ఈసారి అలాంటి గడువేమీ లేకుండా, ఎప్పటికీ కొనసాగేలా.. పరిస్థితుల ఆధారంగా ఎప్పటికప్పుడు మార్పులు చేసుకునేలా (డైనమిక్‌ అండ్‌ రెస్పాన్సివ్‌) ఈ కొత్త విదేశీ వాణిజ్య విధానాన్ని తీసుకొచ్చినట్లు మంత్రి తెలిపారు. రంగాలవారీగా లేదంటే దేశీయ ఉత్పత్తులను, సేవలను ప్రపంచానికి చేరువ చేయాలనే ప్రధాన లక్ష్యంతో ముందుకెళ్తున్నామని గోయల్‌ పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మన వస్తు, సేవల ఎగుమతులు 765 బిలియన్‌ డాలర్ల విలువను అధిగమించే అవకాశం ఉందని డీజీఎఫ్‌టీ తెలిపింది.   2021-22లో ఇవి 676 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి.


అంతర్జాతీయ కరెన్సీగా రూపాయి..

మన రూపాయిని అంతర్జాతీయ కరెన్సీగా మార్చే ఉద్దేశంతో, రూపాయల్లో వాణిజ్య చెల్లింపులకు అనుమతినిచ్చేలా ఎఫ్‌టీపీలో మార్పులు చేశారు. ‘కరెన్సీ సంక్షోభాలు లేదా డాలర్ల కొరత ఎదుర్కొంటున్న దేశాలతో రూపాయల్లో వాణిజ్యాన్ని జరిపేందుకు భారత్‌ సిద్ధంగా ఉంద’ని వాణిజ్య కార్యదర్శి సునీల్‌ భర్త్‌వాల్‌ తెలిపారు. మన ఎగుమతిదార్లు అంతర్జాతీయంగా పోటీ సామర్థ్యాన్ని పెంచుకోవాలని, అప్పుడు రాయితీలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు. రాయితీలు, ప్రోత్సాహకాలపై మాత్రమే పరిశ్రమ విజయం ఆధారపడి ఉండదని పీయూష్‌ గోయల్‌ తెలిపారు.


200- 300 బి.డాలర్లకు ఇ-కామర్స్‌ ఎగుమతులు

2030 కల్లా ఇ-కామర్స్‌ ఎగుమతులు 200- 300 బిలియన్‌ డాలర్లకు చేరే అవకాశం ఉందని ఎఫ్‌టీపీ అంచనా వేసింది. కొరియర్‌ ద్వారా ఎగుమతుల విలువ పరిమితిని ఒక్కో ప్యాకెట్‌కు రెట్టింపు చేసి రూ.10 లక్షలకు పెంచింది.  ఇ-కామర్స్‌ సంస్థలకు సులభ స్టాకింగ్‌, కస్టమ్స్‌ అనుమతులు, రిటర్న్‌ల ప్రాసెసింగ్‌ విషయంలో తోడ్పాటు అందించేందుకు గిడ్డంగుల సదుపాయాలతో నిర్దేశిత జోన్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఎఫ్‌టీపీకి సంబంధించిన దరఖాస్తుల డిజిటైజేషన్‌, ఆటోమేటిక్‌ సిస్టమ్‌ ఆధారిత అనుమతులు, అడ్వాన్స్‌ ఆథరైజేషన్‌ పొడిగింపు/ రీవ్యాలిడేషన్‌ దరఖాస్తులు ఒక్క రోజులో ప్రాసెసింగ్‌, వస్త్ర పరిశ్రమకు ప్రత్యేక అడ్వాన్స్‌ ఆథరైజేషన్‌ పథకం పొడిగింపు, సగటు ఈవో (ఎక్స్‌ఫోర్ట్‌ ఆబ్లిగేషన్‌) నిర్వహణ నుంచి పాడి పరిశ్రమకు మినహాయింపు లాంటివీ కొత్త ఎఫ్‌టీపీలో చేర్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని