లాభాలతో వీడ్కోలు

2022-23 ఆర్థిక సంవత్సరం చివరిరోజు సూచీలు భారీ లాభాలు ఆర్జించాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో సెన్సెక్స్‌, నిఫ్టీ దాదాపు 2% రాణించాయి.

Published : 01 Apr 2023 04:49 IST

సమీక్ష

2022-23 ఆర్థిక సంవత్సరం చివరిరోజు సూచీలు భారీ లాభాలు ఆర్జించాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో సెన్సెక్స్‌, నిఫ్టీ దాదాపు 2% రాణించాయి. ముఖ్యంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు 4.29% లాభపడి రూ.2331.05 వద్ద ముగిసింది. రిలయన్స్‌, ఎన్‌బీఎఫ్‌సీ అనుబంధ సంస్థ రిలయన్స్‌ స్ట్రాటిజిక్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ (జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌) విభజనకు జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ఆమోదం తెలపడమే ఇందుకు కారణం. ఈ అంశంపై మే 2న కంపెనీ బోర్డు సమావేశం కానుంది. రిలయన్స్‌ మార్కెట్‌ విలువ రూ.64,723 కోట్లు పెరిగి రూ.15.77 లక్షల కోట్లకు చేరింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 13 పైసలు పెరిగి 82.21 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు  79.18 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగియగా, ఐరోపా సూచీలు మెరిశాయి.

సెన్సెక్స్‌ ఉదయం 58,273.86 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా అదే జోరు కొనసాగించిన సూచీ, ఇంట్రాడేలో 59,068.47 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 1031.43 పాయింట్ల లాభంతో 58,991.52 వద్ద ముగిసింది. నిఫ్టీ 279.05 పాయింట్లు దూసుకెళ్లి 17,359.75 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 17,204.65- 17,381.60 పాయింట్ల మధ్య కదలాడింది.
నీ సెన్సెక్స్‌ 30 షేర్లలో 26 లాభాలు నమోదు చేశాయి. నెస్లే 3.30%, ఇన్ఫోసిస్‌ 3.19%, ఐసీఐసీఐ బ్యాంక్‌ 3.08%, టాటా మోటార్స్‌ 2.80%, టీసీఎస్‌ 2.16%, టెక్‌ మహీంద్రా 1.91%, యాక్సిస్‌ బ్యాంక్‌ 1.83%, హెచ్‌సీఎల్‌ టెక్‌ 1.81%, విప్రో 1.80% రాణించాయి. సన్‌ఫార్మా 0.77%, ఏషియన్‌ పెయింట్్స 0.27%, బజాజ్‌ ఫైనాన్స్‌ 0.24% నష్టపోయాయి.

ఆర్థిక సంవత్సరం మొత్తంమీద: ఆర్థిక సంవత్సరాన్ని మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంటే సెన్సెక్స్‌ 423.01 పాయింట్లు (0.72%) లాభపడగా, నిఫ్టీ 105 పాయింట్లు నష్టపోయింది. బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్‌ 1258.64 పాయింట్లు (4.46%), మిడ్‌క్యాప్‌ సూచీ 42.38 (0.17%) చొప్పున తగ్గాయి.  మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలోని నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.264.06 లక్షల కోట్ల నుంచి రూ.5.86 లక్షల కోట్లు తగ్గి రూ.258.19 లక్షల కోట్లకు పరిమితమైంది. సెన్సెక్స్‌ గతేడాది జూన్‌ 17న 50,921 వద్ద ఏడాది కనిష్ఠాన్ని, డిసెంబరు 1న 63,583 వద్ద జీవనకాల గరిష్ఠాన్ని నమోదుచేసింది.

* మదుపర్ల సంపద 2022 డిసెంబరు 14న రూ.291.25 లక్షల కోట్ల వద్ద రికార్డు గరిష్ఠస్థాయికి చేరింది.
* రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రూ.15.77 లక్షల కోట్లు, టీసీఎస్‌ రూ.11.73 లక్షల కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ రూ.8.98 లక్షల కోట్లు, ఐసీఐసీఐ బ్యాంక్‌ రూ.6.12 లక్షల కోట్లు, హిందుస్థాన్‌ యునిలీవర్‌ రూ.6.01 లక్షల కోట్ల మార్కెట్‌ విలువతో అగ్రగామి సంస్థలుగా ఉన్నాయి.
* 2021-22లో మదుపర్ల సంపద రూ.59.75 లక్షల కోట్లు పెరిగి, రూ.264.06 లక్షల కోట్లకు చేరడం గమనార్హం.
* తెలంగాణలోని ఆర్మూర్‌లో 4 తెరలు, ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో 5 తెరల మల్టీప్లెక్స్‌లను   ప్రారంభించినట్లు పీవీఆర్‌ తెలిపింది. ఆర్మూర్‌ మల్టీప్లెక్స్‌కు 1254 సీట్ల సామర్థ్యం ఉంది. తెలంగాణలో పీవీఆర్‌ తెరల సంఖ్య 106కు చేరింది.
* దేశీయ విపణిలో పలు ‘గణనీయ’ కాంట్రాక్టులను దక్కించుకున్నట్లు ఎల్‌ అండ్‌ టీ తెలిపింది. ఒక్కో ప్రాజెక్ట్‌ విలువ రూ.1000-2500 కోట్ల మధ్య ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్‌లో ఆర్‌ఈ జోన్‌లో 765కేవీ గ్యాన్‌ ఇన్సులేటెడ్‌, ఎయిర్‌ ఇన్సులేటెడ్‌ సబ్‌స్టేషన్‌ల ఏర్పాటు కూడా ఇందులో ఉంది.
* భారత విదేశీ మారకపు (ఫారెక్స్‌) నిల్వలు మార్చి 24తో ముగిసిన వారానికి 5.977 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.49000 కోట్లు) పెరిగి 578.778 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.47 లక్షల కోట్ల)కు చేరాయి. విదేశీ కరెన్సీ ఆస్తులు 4.38 బి.డాలర్లు పెరిగి 509.728 బి.డాలర్లకు వృద్ధి చెందాయి.
* సిటీ నెట్‌వర్క్స్‌ తీసుకున్న రుణం కోసం స్టాండర్డ్‌ ఛార్టర్డ్‌ బ్యాంక్‌తో వన్‌-టైమ్‌ సెటిల్‌మెంట్‌ ఒప్పందాన్ని జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కుదుర్చుకుంది.
* ఇంధన ధరలు శాంతించడంతో ఐరోపా ద్రవ్యోల్బణం ఏడాది కనిష్టమైన 6.9 శాతానికి చేరింది. అయితే ఆహార ధరలు మాత్రం ఇంకా అధికంగానే ఉన్నాయి. అందువల్ల ఐరోపా కేంద్ర బ్యాంక్‌ మరిన్ని వడ్డీ రేట్ల పెంపులకు మొగ్గుచూపొచ్చని అంటున్నారు.
* డెరివేటివ్‌ కాంట్రాక్టుల లాట్‌ పరిమాణాల్లో ఎన్‌ఎస్‌ఈ మార్పులు చేసింది. బ్యాంక్‌ నిఫ్టీ ప్రస్తుత లాట్‌ పరిమాణం 25 ఉండగా.. దాన్ని 15కు తగ్గించింది. జులై కాంట్రాక్టుల నుంచి ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి. నిఫ్టీ, ఫిన్‌ నిఫ్టీ, మిడ్‌క్యాప్‌ నిఫ్టీల్లో ఎటువంటి మార్పులు చేయలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని