TCS: పనిచేయడానికి అత్యుత్తమం టీసీఎస్‌

‘మన దేశంలో పనిచేయడానికి ఉత్తమమైనవిగా’ ఉద్యోగులు భావిస్తున్న కంపెనీల జాబితాలో  అగ్రస్థానాన్ని ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) పొందింది.

Updated : 20 Apr 2023 09:23 IST

రెండో స్థానంలో అమెజాన్‌
దేశీయ సంస్థలతో లింక్డ్‌ఇన్‌ 2023 జాబితా

దిల్లీ: ‘మన దేశంలో పనిచేయడానికి ఉత్తమమైనవిగా’ ఉద్యోగులు భావిస్తున్న కంపెనీల జాబితాలో  అగ్రస్థానాన్ని ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) పొందింది. సామాజిక మాధ్యమ సంస్థ లింక్డ్‌ఇన్‌ భారత్‌లో అత్యుత్తమ 25 కంపెనీలతో జాబితాను వెలువరించింది. ఇ కామర్స్‌ దిగ్గజ సంస్థ అమెజాన్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌-ఆర్థిక సేవల సంస్థ మోర్గాన్‌ స్టాన్లీ రెండు, మూడు స్థానాలు దక్కించుకున్నాయి. గతేడాది జాబితాలో టెక్‌ కంపెనీలు ఆధిపత్యం ప్రదర్శించగా.. ఈసారి ఆర్థిక సేవలు, చమురు-గ్యాస్‌, నిపుణుల సేవలు, తయారీ, గేమింగ్‌ కంపెనీలు జాబితాలో ఎక్కువగా చోటు సాధించాయి. జాబితాలోని పలు అంశాలు ఇలా..

* అగ్రగామి 25 కంపెనీల్లో 10 కంపెనీలు ఆర్థిక సేవలు/ బ్యాంకింగ్‌/ ఫిన్‌టెక్‌ రంగాలకు చెందినవే ఉన్నాయి. మెక్వారీ గ్రూప్‌ (5వ స్థానం), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ (11), మాస్టర్‌కార్డ్‌ (12), యుబీ (14) స్థానాల్లో ఉన్నాయి.
* ఇ-స్పోర్ట్స్‌, గేమింగ్‌ రంగాల  కంపెనీలు తొలిసారిగా ఈ జాబితాలో చోటు పొందాయి. డ్రీమ్‌11 సంస్థ 20వ స్థానంలో, గేమ్స్‌ 24+7  సంస్థ 24వ స్థానంలో నిలిచింది.
* జాబితాలోని 25 కంపెనీల్లో 17 తొలిసారి చోటు దక్కించుకున్నవే కావడం గమనార్హం. భారత వ్యాపార వ్యవస్థ జోరు కొనసాగించడాన్ని ఇది సూచిస్తోంది. గతేడాది లింక్డ్‌ఇన్‌ అగ్రగామి అంకుర సంస్థల జాబితాలో ఉన్న జెప్టో.. తాజా జాబితాలో 16వ స్థానం పొందింది.

ఈ అంశాల ఆధారంగా: రాణించే సామర్థ్యం, నైపుణ్యాల వృద్ధి, కంపెనీ స్థిరత్వం, విదేశీ అవకాశాలు, కంపెనీ అనుబంధం, లింగ వైవిధ్యం, విద్యా నేపథ్యం, ఉద్యోగుల ఉనికి వంటి అంశాల ఆధారంగా, కంపెనీలకు ఈ జాబితాలో లింక్డ్‌ఇన్‌ చోటు కల్పించింది.

ఈ నైపుణ్యాలపై కంపెనీల ఆసక్తి: కృత్రిమ మేధ, రోబోటిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌, సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్‌ కంప్యూటర్‌ సెక్యూరిటీ వంటి నైపుణ్యాలు కలిగిన వారిని చేర్చుకునేందుకు కంపెనీలు మొగ్గుచూపుతున్నాయి.

* ‘ప్రస్తుత అనిశ్చితి పరిస్థితుల్లో భవిష్యత్‌ వృద్ధి, దీర్ఘకాల విజయాలు ఇచ్చే కంపెనీల కోసం నిపుణులు చూస్తున్నారు. ఉద్యోగావకాశాలకు వెతుక్కునేందుకు వీలుగా ఈ జాబితా వెలువరించామ’ని లింక్డ్‌ఇన్‌ ఇండియా మేనేజింగ్‌ ఎడిటర్‌ నిరాజిత బెనర్జీ తెలిపారు. 

బెంగళూరుకు అగ్రస్థానం: ఈ జాబితాలోని కంపెనీల్లో అత్యధికం బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్నాయి. ముంబయి, హైదరాబాద్‌, దిల్లీ, పుణె తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. నియామకాలు కూడా ఈ నగరాల్లోనే అధికంగా జరుగుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు