ATM: ఏటీఎం మోసగాళ్లు రెచ్చిపోతున్నారు!

ఏటీఎం యంత్రంలో మీ డెబిట్‌ కార్డు ఉంచిన తర్వాత అందులో అది చిక్కుకున్న సందర్భాలు ఎప్పుడైనా గమనించారా? దీనికి అవునని సమాధానం వస్తే అలా జరిగింది మీకు మాత్రమే కాదని తెలుసుకోండి.

Updated : 01 May 2023 10:46 IST

2021-22లో రూ.259 కోట్లు కాజేశారు
నష్టపోతున్న అమాయక ప్రజలు
కార్డు బ్లాక్‌ చేసే సమయానికే డబ్బులు మాయం

దిల్లీ: ఏటీఎం యంత్రంలో మీ డెబిట్‌ కార్డు ఉంచిన తర్వాత అందులో అది చిక్కుకున్న సందర్భాలు ఎప్పుడైనా గమనించారా? దీనికి అవునని సమాధానం వస్తే అలా జరిగింది మీకు మాత్రమే కాదని తెలుసుకోండి. సెక్యూరిటీ అంతగా లేని ఏటీఎంలను లక్ష్యంగా చేసుకుని మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. కార్డులను క్లోనింగ్‌ చేయడం, నేర్పుగా వేరే కార్డుతో భర్తీ చేయడం ద్వారా కష్టపడి సంపాదించిన/ పొదుపు చేసుకున్న మొత్తాన్ని వినియోగదార్ల నుంచి వారు కొట్టేస్తున్నారు. ఇద్దరు/ముగ్గురు బృందంగా ఏర్పడి ఈ మోసాలకు పాల్పడుతున్నారు. డెబిట్‌ కార్డు వినియోగదార్లు తమ కార్డును క్లోనింగ్‌ చేశారని/ దాని స్థానంలో వేరే కార్డును మార్చారని తెలుసుకునేలోపే వారి ఖాతాల నుంచి రూ.లక్షల వరకు మాయం అవుతున్నాయి.

* ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం, 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇలాంటి ఏటీఎం మోసాలు 65,893గా నమోదయ్యాయి. రూ.258.61 కోట్ల సొమ్ము మోసగాళ్ల జేబుల్లోకి వెళ్లింది.
* డెబిట్‌ కార్డు వినియోగదార్లు మోసపోయామని గుర్తించేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. తర్వాత బ్యాంకులకు ఫోన్‌ చేసి కార్డులు బ్లాక్‌ చేయించినా ఫలితం ఉండట్లేదు. కొన్ని బ్యాంకులు మీ పాస్‌వర్డ్‌ సరిపోలడంతో నగదు బదిలీ అయ్యిందని చెబుతున్నాయి. కొందరు ఆర్‌బీఐ అంబుడ్స్‌మన్‌ను సంప్రదించినా రిజర్వ్‌ బ్యాంక్‌-ఇంటిగ్రేటెడ్‌ అంబుడ్స్‌మన్‌ స్కీమ్‌-2021, 16 (2)(ఎ) నిబంధన కింద సేవలో ఎలాంటి లోపం లేదని ఫిర్యాదుల్ని తిరస్కరిస్తున్నారు.
* మోసగాళ్లు ఖాతాదార్లను మోసం చేసేందుకు రోజువారీగా ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటున్నారు. ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని మాత్రం ఆ స్థాయిలో సరిదిద్దలేకపోతున్నారు. డిజిటల్‌ లావాదేవీలు పెంచడానికి, తక్కువ నగదు వినియోగాన్ని ప్రోత్సహించడానికి ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని వీలైనంత త్వరగా పటిష్ఠం చేయాల్సిన అవసరం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని