బలంగా పుంజుకున్న సూచీలు

మూడు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాల మద్దతుతో ఐటీ, టెక్‌, బ్యాంకింగ్‌ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి.

Published : 20 May 2023 02:54 IST

సమీక్ష

మూడు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాల మద్దతుతో ఐటీ, టెక్‌, బ్యాంకింగ్‌ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. విదేశీ మదుపర్ల పెట్టుబడులు కలిసొచ్చాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 82.67 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 0.78% లాభపడి 76.45 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లలో సియోల్‌, టోక్యో రాణించగా, షాంఘై, హాంకాంగ్‌ నష్టపోయాయి. ఐరోపా సూచీలు లాభాల్లో ట్రేడయ్యాయి.

సెన్సెక్స్‌ ఉదయం 61,556.25 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారôభమైంది. వెంటనే నష్టాల్లోకి జారుకున్న సూచీ, 61,251.70 వద్ద ఇంట్రాడే కనిష్ఠానికి పడిపోయింది. దిగువ స్థాయుల వద్ద కొనుగోళ్లతో మళ్లీ లాభాల్లోకి వచ్చిన సూచీ 61,784.61 వద్ద గరిష్ఠానికి చేరింది. చివరకు 297.94 పాయింట్ల లాభంతో 61,729.68 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 73.45 పాయింట్లు పెరిగి 18,203.40 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ సూచీ 18,060.40- 18,21.10 పాయింట్ల మధ్య కదలాడింది.

అదానీ షేర్ల దూకుడు: అదానీ షేర్ల ధరలు గణనీయంగా పెరగడంలో, నియంత్రణ పరమైన లోపాలు ఉపకరించాయని ఇప్పుడే నిర్థారణకు రాలేమని సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ వెల్లడించడంతో అదానీ గ్రూప్‌లోని 10 కంపెనీల షేర్లు లాభపడ్డాయి. అదానీ విల్మర్‌ 6.85%, అదానీ పవర్‌ 4.93%, అదానీ ట్రాన్స్‌మిషన్‌ 4.62%, అదానీ గ్రీన్‌ ఎనర్జీ 4.18%, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 3.65%, అదానీ పోర్ట్స్‌ 3.65%, ఎన్‌డీటీవీ 3.53%, అదానీ టోటల్‌ గ్యాస్‌ 3.05%, అంబుజా 1.20%, ఏసీసీ 1% చొప్పున లాభాలు నమోదు చేశాయి.

త్రైమాసిక ఫలితాల ప్రభావంతో ఇండిగో షేరు ఇంట్రాడేలో రూ.2308 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 0.03% తగ్గి రూ.2264.35 వద్ద ముగిసింది.

నెక్సస్‌ సెలెక్ట్‌ ట్రస్ట్‌ రీట్‌ షేరు ఇష్యూ ధర రూ.100తో పోలిస్తే 2.27% లాభంతో రూ.102.27 వద్ద అరంగేట్రం చేసింది. ఇంట్రాడేలో రూ.104.90 వద్ద గరిష్ఠాన్ని తాకి, చివరకు 4.26% పెరిగి రూ.104.26 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.15,795.39 కోట్లుగా నమోదైంది.

సెన్సెక్స్‌ 30 షేర్లలో 22 లాభాలు నమోదు చేశాయి. టాటా మోటార్స్‌ 3.22%, టెక్‌ మహీంద్రా 2.30%, ఇన్ఫోసిస్‌ 1.84%, హెచ్‌సీఎల్‌ టెక్‌ 1.45%, ఎం అండ్‌ ఎం 1.20%, యాక్సిస్‌ బ్యాంక్‌ 1.08%, అల్ట్రాటెక్‌ 0.95%, ఐసీఐసీఐ బ్యాంక్‌ 0.90% చొప్పున రాణించాయి. ఎన్‌టీపీసీ, ఏషియన్‌ పెయింట్స్‌, టైటన్‌, పవర్‌గ్రిడ్‌, టాటా స్టీల్‌, సన్‌ఫార్మా 1% వరకు నష్టపోయాయి.  

ఏడాది గరిష్ఠానికి ఫారెక్స్‌ నిల్వలు: మన విదేశీ మారకపు (ఫారెక్స్‌) నిల్వలు ఏడాది గరిష్ఠ స్థాయికి చేరాయి. మే 12తో ముగిసిన వారానికి 3.5 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.28,700 కోట్లు) పెరిగి 599.529 బి.డాలర్ల (రూ.49.15 లక్షల కోట్ల)కు చేరాయని ఆర్‌బీఐ పేర్కొంది. 2021 అక్టోబరులో నమోదైన 645 బిలియన్‌ డాలర్ల ఫారెక్స్‌ నిల్వలే ఇప్పటివరకు గరిష్ఠస్థాయి. సమీక్షా వారంలో విదేశీ కరెన్సీ ఆస్తులు 3.577 బి.డాలర్లు వృద్ధి చెంది 529.598 బి.డాలర్లుగా నమోదయ్యాయి. పసిడి నిల్వలు 38 మి.డాలర్లు అధికమై 46.353 బి.డాలర్లకు చేరాయి.  

భారత్‌లో బ్రూక్‌ఫీల్డ్‌ ఫండ్స్‌ నుంచి రెండు వాణిజ్య ఆస్తులను రూ.11,225 కోట్ల (1.4 బి.డాలర్లు)కు కొనుగోలు చేయడానికి బ్రూక్‌ఫీల్డ్‌ ఇండియా రీట్‌, సింగపూర్‌ జీఐసీ ఒప్పందం కుదుర్చుకున్నాయి. దిల్లీ, గురుగ్రామ్‌ల్లో ఉన్న ఈ రెండు ఆస్తుల బిల్టప్‌ ఏరియా 6.5 మి.చదరపు అడుగులుగా ఉంది.


నేటి బోర్డు సమావేశాలు: దివీస్‌ ల్యాబ్స్‌, దొడ్ల డెయిరీ, గోదావరి పవర్‌ అండ్‌ ఇస్పాత్‌, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌, ఎంసీఎక్స్‌, వీఆర్‌ఎల్‌ లాజిస్టిక్స్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని