ఫేస్‌బుక్‌కు రూ.10,000 కోట్ల అపరాధ రుసుము

మెటా (ఫేస్‌బుక్‌)కు గట్టి దెబ్బే తగిలింది. గోప్యతా అపరాధ రుసుము కింద 1.3 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.10,000 కోట్ల)ను చెల్లించాలని మెటాను యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ) ఆదేశించింది.

Updated : 23 May 2023 06:55 IST

ఐరోపా నిర్ణయం
ఐరోపా వినియోగదార్ల డేటాను అమెరికాకు పంపొద్దని ఆదేశాలు

లండన్‌: మెటా (ఫేస్‌బుక్‌)కు గట్టి దెబ్బే తగిలింది. గోప్యతా అపరాధ రుసుము కింద 1.3 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.10,000 కోట్ల)ను చెల్లించాలని మెటాను యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ) ఆదేశించింది. ఐరోపా వినియోగదార్ల డేటాను అమెరికాకు బదిలీ చేయడం అక్టోబరు కల్లా నిలిపేయాలనీ తెలిపింది. తమపై ఏవైనా కఠిన చర్యలు తీసుకుంటే ఈయూలో సేవలు నిలిపేస్తామని గతంలో పేర్కొన్న మెటా, ప్రస్తుతానికి ఐరోపాలో ఫేస్‌బుక్‌ కార్యకలాపాలకు ఎటువంటి అవాంతరాలూ ఉండవని తెలపడం గమనార్హం.

అన్యాయమిది.. మెటా: ‘ఇది తప్పుడు నిర్ణయం.. అన్యాయం. ఈయూ, యూఎస్‌ మధ్య డేటా బదిలీ చేస్తున్న పలు ఇతర కంపెనీలకూ కష్టమేన’ని మెటా ప్రెసిడెంట్‌, చీఫ్‌ లీగల్‌ ఆఫీసర్‌ జెన్నిఫర్‌ న్యూస్టెడ్‌ పేర్కొన్నారు. మెటాకు మొత్తం 21 డేటా సెంటర్లు ఉండగా.. 17 అమెరికాలోనే ఉన్నాయి. యూరోపియన్‌ దేశాలైన డెన్మార్క్‌, ఐర్లండ్‌, స్వీడన్‌లలో మూడు ఉండగా.. మరొకటి సింగపూర్‌లో ఉంది. తాజా పరిణామాలతో యూఎస్‌ నిఘా చట్టాల్లో మార్పులు చేపట్టేంత వరకు.. ఈయూ వినియోగదార్ల డేటాను ఈయూలోనే నిల్వ చేయాల్సి రావొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇదే అతిపెద్ద పెనాల్టీ..: అయిదేళ్ల కిందట ఐరోపా సమాఖ్య కఠిన డేటా గోప్యతా విధానాన్ని తీసుకొచ్చింది. అప్పటి నుంచి  విధించిన పెనాల్టీల్లో ఇదే అతిపెద్దది. అంతక్రితం 2021లో అమెజాన్‌పై డేటా రక్షణ ఉల్లంఘన కారణంగా 746 మి. యూరోల అపరాధ రుసుము విధించింది. ఇతర సామాజిక మాధ్యమ దిగ్గజాలు కూడా అవి పాటించే డేటా విధానాల వల్ల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. అమెరికా వినియోగదార్ల డేటాను ఒరాకిల్‌ సర్వర్లలో స్టోర్‌ చేసేందుకు 1.5 బి. డాలర్ల ప్రాజెక్టును తీసుకొచ్చినట్లు తెలిపారు. పాశ్చాత్య దేశాల్లోని భయాలను తగ్గించేందుకు చైనాకు చెందిన టిక్‌టాక్‌ ప్రయత్నిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని