జీడీపీలో 9 శాతానికి రవాణా వ్యయాలు

వచ్చే మూడేళ్లలో రవాణా వ్యయాలను జీడీపీలో 9 శాతానికి తగ్గించుకోవడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని కేంద్ర రోడ్డు, రవాణా మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు.

Published : 25 May 2023 02:07 IST

14-16% నుంచి తగ్గించడమే లక్ష్యం : గడ్కరీ

దిల్లీ: వచ్చే మూడేళ్లలో రవాణా వ్యయాలను జీడీపీలో 9 శాతానికి తగ్గించుకోవడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని కేంద్ర రోడ్డు, రవాణా మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. ప్రస్తుతం ఇవి జీడీపీలో 14-16 శాతంగా ఉన్నాయి. సీఐఐ నిర్వహించిన ఓ సమావేశంలో గడ్కరీ మాట్లాడుతూ.. రవాణా వ్యయాలు దిగివస్తే, ఎగుమతులు పెరుగుతాయని పేర్కొన్నారు. కాగా.. పరిశ్రమలో పోటీ సామర్థ్యాన్ని పెంచేందుకు, రవాణా ఖర్చులను తగ్గించేందుకు జాతీయ రవాణా విధానం, పీఎం గతి శక్తి కార్యక్రమాలను ప్రభుత్వం ప్రారంభించింది. దేశంలో రవాణా వ్యయాలను మదింపు చేసే నిమిత్తం ఓ విధానాన్ని రూపొందించేందుకు టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేయనున్నట్లు ఈ ఏడాది ప్రారంభంలో వాణిజ్య, పరిశ్రమ మంత్రిత్వ శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ టాస్క్‌ఫోర్స్‌లో సభ్యులుగా నీతి ఆయోగ్‌, గణాంకాలు- కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ, నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అప్లయ్డ్‌ ఎకనమిక్‌ రీసెర్చ్‌ (ఎన్‌సీఏఈఆర్‌) ప్రతినిధులు, ఇతర విశ్లేషకులు ఉండనున్నారు. ప్రస్తుతం తమ మంత్రిత్వ శాఖ వద్ద 260 రోప్‌వేలు, రూ.1.3 లక్షల కోట్ల విలువైన కేబుల్‌ రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతిపాదనలు ఉన్నాయని గడ్కరీ తెలిపారు. 500 బస్సు డిపోల కోసం రహదారుల మంత్రిత్వ శాఖ స్థలాలను గుర్తించిందని, వీటి అభివృద్ధి కోసం దిగ్గజ పారిశ్రామికవేత్తల నుంచి పెట్టుబడులనూ ఆహ్వానించిందని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశానికి 2 లక్షల విద్యుత్‌ బస్సుల అవసరం ఉందని మంత్రి తెలిపారు.

అత్యంత శక్తిమంత ఆర్థిక వ్యవస్థగా భారత్‌: మౌలిక రంగ అభివృద్ధిలో ప్రైవేట్‌- ప్రభుత్వ భాగస్వామ్యం, సాంకేతికత వినియోగం ద్వారా త్వరలోనే భారత్‌ అత్యంత శక్తిమంత ఆర్థిక వ్యవస్థగా అవతరించే అవకాశం ఉంటుందని మంత్రి గడ్కరీ వెల్లడించారు. మనదేశం రూ.16 లక్షల కోట్ల మేర సంప్రదాయ ఇంధనాలను దిగుమతి చేసుకుంటోందని, దీనిని తగ్గించుకునేందుకు ప్రభుత్వ రవాణా రంగంలో ఇథనాల్‌, మిథనాల్‌, విద్యుత్‌ కార్లు, బయో- సీఎన్‌జీ, బయో- ఎల్‌ఎన్‌జీ వినియోగానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. కాలుష్యాన్ని తగ్గించుకునేందుకూ ఇది దోహదం చేయనుందని తెలిపారు. హైడ్రోజన్‌.. భవిష్యత్‌ ఇంధనమని మంత్రి తెలిపారు. విద్యుత్‌ వాహనాల ఉత్పత్తిపై మంత్రి మాట్లాడుతూ... ప్రస్తుతం జపాన్‌ను వెనక్కి నెట్టి మూడో స్థానంలో భారత్‌ ఉందని తెలిపారు. వచ్చే ఐదేళ్లలో అగ్రస్థానానికి చేరుకుంటామనే ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు. ‘కార్ల ఎగుమతులకు భారత్‌ ప్రధాన కేంద్రంగా ఉందని, మున్ముందు ట్రాక్టర్లు, బస్సులు, ఆటోలనూ ఎగుమతి చేస్తుంద’ని మంత్రి వివరించారు. ట్రాఫిక్‌ రద్దీని తగ్గించేందుకు స్కైబస్సులను తీసుకొచ్చేందుకూ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని తెలిపారు. ఈ ప్రయత్నాలన్నింటి ద్వారా భారత్‌ దిగుమతిదారుగానే కాదు.. ఇంధనానికి ప్రధాన ఎగుమతిదారు అవుతుందని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని