బీడీఎల్‌ లాభం రూ.152 కోట్లు

మినీరత్న కంపెనీ భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ (బీడీఎల్‌) గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.796.8 కోట్ల ఆదాయం, రూ.152.7 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.

Published : 26 May 2023 00:55 IST

ఈనాడు, హైదరాబాద్‌: మినీరత్న కంపెనీ భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ (బీడీఎల్‌) గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.796.8 కోట్ల ఆదాయం, రూ.152.7 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2021-22 ఇదే కాలంలో ఆదాయం రూ.1,355.8 కోట్లు, నికర లాభం రూ.264.4 కోట్లుగా ఉంది. వీటితో పోలిస్తే ఆదాయం41.2%, నికర లాభం 42.3% క్షీణత నమోదయ్యింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.10 ముఖ విలువ ఉన్న ఒక్కో షేరుపై రూ.1.20 తుది డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా కీలకమైన ఎలక్ట్రానిక్‌ పరికరాలు, ఇతర విడిభాగాలు ఆలస్యంగా అందుతున్నాయని, అందుకే ఆదాయం, లాభాలపై ప్రతికూల ప్రభావం పడిందని బీడీఎల్‌ ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో కంపెనీ వెల్లడించింది.


ఐఆర్‌ఎఫ్‌సీ లాభం రూ.6337 కోట్లు

దిల్లీ: ఇండియన్‌ రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (ఐఆర్‌ఎఫ్‌సీ) గత ఆర్థిక సంవత్సరంలో రూ.6337 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. 2021-22లో సంస్థ లాభం రూ.6090 కోట్లే. ఇదే సమయంలో ఆదాయం రూ.20,298 కోట్ల నుంచి 17.70% పెరిగి రూ.23,891 కోట్లకు చేరింది. ప్రతి షేరుపై ఆర్జన కూడా రూ.4.66 నుంచి రూ.4.85కు పెరిగింది. రూ.10 ముఖ విలువ కలిగిన ప్రతి షేరుకు రూ.0.70 తుది డివిడెండ్‌ చెల్లించాలని కంపెనీ బోర్డు ప్రతిపాదించింది. ఇప్పటికే రూ.0.80 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ వాటాదార్లకు అందించింది.


2023-25కు ఐఏఎంఏఐ ఛైర్మన్‌గా హర్ష్‌ జైన్‌

దిల్లీ: ది ఇంటర్నెట్‌ అండ్‌ మొబైల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఐఏఎంఏఐ) ఛైర్మన్‌గా డ్రీమ్‌ స్పోర్ట్స్‌ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ హర్ష్‌ జైన్‌ ఎన్నికైనట్లు ఐఏఎంఏఐ గురువారం ప్రకటించింది. గూగుల్‌ ఇండియా కంట్రీ మేనేజర్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ సంజయ్‌ గుప్తా స్థానాన్ని ఈయన భరీ చేయనున్నారు. 2023-25 కాలానికి ఐఏఎంఏఐ ఛైర్మన్‌గా హర్ష్‌ జైన్‌ కొనసాగనున్నారు. కొత్తగా ఎన్నికైన 24 మంది సభ్యుల పాలక మండలి, కొత్త ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ ప్రస్తుత కౌన్సిల్స్‌ నుంచి బాధ్యతలు త్వరలో స్వీకరించనున్నారు. త్వరలో జరగబోయే వార్షిక సర్వసభ్య సమావేశం ఇందుకు వేదిక కానుంది. మేక్‌మైట్రిప్‌ సహ వ్యవస్థాపకులు, గ్రూప్‌ సీఈఓ రాజేశ్‌ మాగో అసోసియేషిన్‌ వైస్‌ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. టైమ్స్‌ ఇంటర్నెట్‌ వైస్‌ ఛైర్మన్‌ సత్యన్‌ గంజ్వానీ కోశాధికారిగా ఎన్నికయ్యారు. వీరు శివ్‌నాథ్‌ థుక్రాల్‌, హర్షిల్‌ మాథుర్‌ స్థానాలను భర్తీ చేయబోతున్నారు.


లేఆఫ్‌లు ప్రకటించిన ఎస్‌వీబీ కొనుగోలుదారు

భారత ఉద్యోగులపై ప్రభావం లేదు

రాలీ(అమెరికా): అమెరికాలో దివాలా అంచుకు చేరిన సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌(ఎస్‌వీబీ)ను కొనుగోలు చేసిన నార్త్‌ కరోలినాలోని ఫస్ట్‌ సిటిజన్స్‌ బ్యాంక్‌ ఆఫ్‌ రాలే తాజాగా సిబ్బందికి లేఆఫ్‌లు ప్రకటించింది. బ్యాంకు సిబ్బందిలో 3 శాతం (500) మందిని తొలగించింది. ఎంపిక చేసిన కార్పొరేట్‌ హోదాలపైనే ఈ ప్రభావం ఉంటుందని.. వినియోగదార్లతో ప్రత్యక్ష అనుబంధం ఉండే ఉద్యోగులపై కానీ.. భారత్‌లోని బృందంపై కానీ ఎటువంటి ప్రభావం ఉండదని బ్యాంకు సీఈఓ ఫ్రాంక్‌ హోల్డింగ్‌ స్పష్టం చేశారు. ఈ ఏడాది మొదట్లో వడ్డీ రేట్లు పెంచిన సమయంలో, సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ అందుకు సంసిద్ధంగా లేని కారణంగా ట్రెజరీ బాండ్ల నిల్వల విలువ తగ్గిపోయింది. ఇది కాస్తా ఖాతాదారుల నిధుల ఉపసంహరణకు దారి తీయడంతో బ్యాంకు కుప్పకూలింది.


ఐటీడీసీ వ్యాపారం రూ.458 కోట్లకు

దిల్లీ: ఇండియా టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ గత ఆర్థిక సంవత్సరంలో రూ.458.08 కోట్ల వ్యాపారాన్ని సాధించింది. 2021-22 వ్యాపారం కంటే ఇది 58% అధికం. నికరలాభం కూడా రూ.4.38 కోట్ల నుంచి 983% పెరిగి రూ.60.33 కోట్లకు చేరింది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఇంత భారీగా ఆదాయం, నికరలాభాన్ని నమోదు చేయడం ఇప్పుడేనని సంస్థ డైరెక్టర్‌ పీయూశ్‌ తివారీ తెలిపారు. కొవిడ్‌ అనంతరం ప్రజలు భారీగా పర్యటనలకు తరలి రావడమే ఇందుకు కారణమన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని