రష్యాలో రూ.2,500 కోట్లు నిలిచిపోయాయ్‌

రష్యాలో భారత చమురు సంస్థలకు సంబంధించి సుమారు రూ.2,500 కోట్ల (300 మిలియన్‌ డాలర్ల) డివిడెండు ఆదాయం నిలిచిపోయిందని ఆయిల్‌ ఇండియా ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ రంజిత్‌ రాథ్‌ తెలిపారు.

Published : 26 May 2023 00:56 IST

భారత చమురు సంస్థల డివిడెండు ఆదాయం ఇది

దిల్లీ: రష్యాలో భారత చమురు సంస్థలకు సంబంధించి సుమారు రూ.2,500 కోట్ల (300 మిలియన్‌ డాలర్ల) డివిడెండు ఆదాయం నిలిచిపోయిందని ఆయిల్‌ ఇండియా ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ రంజిత్‌ రాథ్‌ తెలిపారు. ఉక్రెయిన్‌పై దాడి అనంతరం రష్యాపై పాశ్చాత్య దేశాలు కఠిన ఆంక్షలు విధించడం ఇందుకు కారణమైందని తెలిపారు. రష్యాలోని 4 చమురు ప్రాజెక్టుల్లో వాటాల కొనుగోలు కోసం భారత్‌కు చెందిన ప్రభుత్వ రంగ చమురు సంస్థలు 5.46 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టాయి. వాంకోర్‌నెఫ్ట్‌ చమురు- గ్యాస్‌ క్షేత్రంలో 49.9 శాతం వాటా, టాస్‌-యుర్యాఖ్‌ నెఫ్టేగజోడోబైఛా క్షేత్రాల్లో 29.9 శాతం వాటా కూడా ఇందులో ఉన్నాయి. ఈ క్షేత్రాల్లో చమురు- గ్యాస్‌ విక్రయం ద్వారా వచ్చే లాభాలపై భారత సంస్థలకు డివిడెండు వస్తుంది. ‘ఈ ప్రాజెక్టులపై మేం ఎప్పటికప్పుడు డివిడెండు ఆదాయం పొందుతున్నాం. అయితే అది రష్యాలోని బ్యాంకు ఖాతాల్లో ఉంద’ని రంజిత్‌ తెలిపారు. గతేడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభించాక, స్విఫ్ట్‌ ఆర్థిక లావాదేవీల ప్రాసెసింగ్‌ సిస్టమ్‌ వినియోగించే విషయంలో రష్యాలోని దిగ్గజ బ్యాంకులపై నిషేధం విధించారు. అటు రష్యా కూడా డాలర్ల వినియోగంపై ఆంక్షలు పెట్టింది. దీంతో ఆయిల్‌ ఇండియా, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, భారత్‌ పెట్రోరిసోర్సెస్‌లతో కూడిన కన్షార్షియానికి 300 మి.డాలర్ల డివిడెండు ఆదాయం నిలిచిపోయింది. మరికొన్ని ప్రాజెక్టుల్లో వాటా కలిగి ఉన్న ఓఎన్‌జీసీ విదేశ్‌ లిమిటెడ్‌కు కూడా ఇంతే మొత్తంలో డివిడెండు ఆదాయం ఉంది. ఈ డివిడెండు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కెనరా బ్యాంక్‌ల సంయుక్త సంస్థ అయిన కమర్షియల్‌ ఇండో బ్యాంక్‌ ఎల్‌ఎల్‌సీ (సీఐబీఎల్‌) వద్ద ఉంది. ఈ డబ్బులను రష్యా నుంచి తీసుకొచ్చేందుకు అవకాశం ఉన్న మార్గాలపై ప్రస్తుతం భారత సంస్థలు దృష్టి సారించాయని రంజిత్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు