63600 పాయింట్లను పరీక్షించొచ్చు!

అంతర్జాతీయ సంకేతాలు మిశ్రమంగా ఉన్నా, గత వారం సూచీలు లాభాలు నమోదుచేశాయి. మే డెరివేటివ్‌ కాంట్రాక్టుల గడువు ముగింపు నేపథ్యంలో షార్ట్‌ కవరింగ్‌ జరగడం, విదేశీ మదుపర్ల కొనుగోళ్లు ఇందుకు అండగా నిలిచాయి.

Published : 29 May 2023 03:04 IST

సమీక్ష: అంతర్జాతీయ సంకేతాలు మిశ్రమంగా ఉన్నా, గత వారం సూచీలు లాభాలు నమోదుచేశాయి. మే డెరివేటివ్‌ కాంట్రాక్టుల గడువు ముగింపు నేపథ్యంలో షార్ట్‌ కవరింగ్‌ జరగడం, విదేశీ మదుపర్ల కొనుగోళ్లు ఇందుకు అండగా నిలిచాయి. దేశీయంగా కంపెనీల త్రైమాసిక ఫలితాలు, కార్పొరేట్‌ వార్తలు మార్కెట్లను నడిపించాయి. ఈ ఏడాది వర్షపాతం సాధారణంగా నమోదుకావొచ్చని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం సెంటిమెంటును మెరుగు పరచింది. జూన్‌లో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం ఉండొచ్చని అభిప్రాయపడింది. బ్యారెల్‌ ముడిచమురు 1.8 శాతం లాభంతో 76.95 డాలర్లకు చేరింది. అమెరికా చమురు నిల్వలు తగ్గడం, జూన్‌ 4న ఒపెక్‌ సమావేశం జరగనుండటం ప్రభావం చూపాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 82.66 నుంచి 82.71కు తగ్గింది. అంతర్జాతీయంగా చూస్తే.. ఏప్రిల్‌లో బ్రిటన్‌ ద్రవ్యోల్బణం 8.7 శాతానికి తగ్గింది. జర్మనీ ఆర్థిక వ్యవస్థ వరుసగా రెండో త్రైమాసికంలోనూ 0.3% క్షీణించడంతో, సాంకేతికంగా మాంద్యంలోకి జారుకున్న సంకేతాలు ఇచ్చింది. అమెరికా రుణ పరిమితి పెంపుపై అనిశ్చితి నేపథ్యంలో అక్కడి మార్కెట్లు నష్టాలు చవిచూశాయి. మొత్తం మీద ఈ పరిణామాలతో గత వారం సెన్సెక్స్‌    1.3 శాతం లాభంతో 62,502 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 1.6% పెరిగి 18,499 పాయింట్ల దగ్గర స్థిరపడింది. రంగాల వారీ సూచీల్లో ఐటీ, ఆరోగ్య సంరక్షణ లాభపడగా.. బ్యాంకింగ్‌, యంత్ర పరికరాలు నష్టపోయాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐలు) నికరంగా రూ.3,230 కోట్ల షేర్లను, డీఐఐలు రూ.3,482 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. ఈ నెలలో ఇప్పటివరకు విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లు (ఎఫ్‌పీఐలు) నికరంగా రూ.37,316 కోట్ల పెట్టుబడులు పెట్టారు.

లాభపడ్డ, నష్టపోయిన షేర్ల నిష్పత్తి 6:5గా నమోదు కావడం..
ఎంపిక చేసిన షేర్లలో కొనుగోళ్లను సూచిస్తోంది.

ఈ వారంపై అంచనా: సెన్సెక్స్‌ గత వారం 61,500 పాయింట్ల వద్ద మద్దతు తీసుకుని లాభాల్లో ముగిసింది. కీలక స్థాయి అయిన 62,000 పాయింట్ల ఎగువన ముగియడంతో.. ప్రస్తుత లాభాలు 63,000 పాయింట్ల వరకు కొనసాగే అవకాశం ఉంది. అనంతరం స్వల్పకాలంలో 63,600 పాయింట్ల దగ్గర జీవనకాల గరిష్ఠాన్ని పరీక్షించొచ్చు.

ప్రభావిత అంశాలు: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి దేశీయ సూచీలు సంకేతాలు తీసుకోవచ్చు. షేరు/రంగం ఆధారిత కదలికలు మార్కెట్లను నడిపించొచ్చు. దేశీయంగా చూస్తే.. మార్చి త్రైమాసిక జీడీపీ గణాంకాలు ఈనెల 31న విడుదల కానున్నాయి. ఈ వారంలో విడుదలయ్యే తయారీ పీఎంఐ, మౌలిక రంగ వృద్ధి, నెలవారీ వాహన విక్రయాలు, జీఎస్‌టీ వసూళ్లు, ద్రవ్యలోటు, బ్యాంకు రణాల వృద్ధి గణాంకాలు కీలకం కానున్నాయి. కార్పొరేట్‌ త్రైమాసిక ఫలితాల సీజన్‌ చివరి దశకు చేరుకోవడంతో, షేరు ఆధారిత కదలికలు ప్రభావం చూపొచ్చు. అంతర్జాతీయంగా చూస్తే.. అమెరికా రుణ పరిమితి పెంపుపై చర్చల్లో పురోగతి లభిస్తే, మార్కెట్లు రాణిస్తాయి.  యూరోజోన్‌ ఎకనామిక్‌ సెంటిమెంట్‌, పలు దేశాల తయారీ పీఎంఐ, అమెరికా నిరుద్యోగ రేటు గణాంకాలపై దృష్టి పెట్టొచ్చు. ముడిచమురు ధరలు, రూపాయి కదలికలు, ఎఫ్‌ఐఐ కొనుగోళ్ల నుంచి సంకేతాలు తీసుకోవచ్చు.

తక్షణ మద్దతు స్థాయులు: 61,872, 61,484, 61,000
తక్షణ నిరోధ స్థాయులు: 63,000, 63,583, 64,200
సెన్సెక్స్‌ లాభాలు 63,600 పాయింట్ల వరకు కొనసాగొచ్చు.

సతీశ్‌ కంతేటి, జెన్‌ మనీ

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని