బేరింగ్‌ పీఈ చేతికి హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిల్లా?

హెచ్‌డీఎఫ్‌సీకి చెందిన విద్యా రుణాల సంస్థ ‘హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిల్లా’లో మెజార్టీ వాటాను హాంకాంగ్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే బేరింగ్‌ ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ కొనుగోలు చేయనుందని తెలుస్తోంది.

Published : 30 May 2023 02:02 IST

90 శాతం వాటా కొనుగోలు చేసే యోచన

దిల్లీ: హెచ్‌డీఎఫ్‌సీకి చెందిన విద్యా రుణాల సంస్థ ‘హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిల్లా’లో మెజార్టీ వాటాను హాంకాంగ్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే బేరింగ్‌ ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ కొనుగోలు చేయనుందని తెలుస్తోంది. దాదాపు 1.3 బిలియన్‌ డాలర్ల (రూ.10,000 కోట్ల) సంస్థాగత విలువకు ఈ లావాదేవీ జరిగే అవకాశం ఉందని సమాచారం. మార్కెట్‌ వర్గాల్లో ప్రచారంలో ఉన్న అంశాల ప్రకారం, హెచ్‌డీఎఫ్‌సీ  క్రెడిల్లాలో 90% వాటాను, హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌ నుంచి బేరింగ్‌ పీఈ కొనుగోలు చేస్తుంది. మిగిలిన 10%  వాటా హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌ వద్ద ఉంటుంది. వచ్చే రెండేళ్లలో దశల వారీగా ఈ 10% వాటాను కూడా విక్రయించాలనేది హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌ ఆలోచనగా తెలుస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌ త్వరలోనే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో విలీనం కాబోతున్న విషయం విదితమే. ఈ విలీనానికి ముందే హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిల్లాలో వాటాల విక్రయం పూర్తవుతుందని అంటున్నారు. కేవలం విద్యా రుణాలు ఇచ్చే ప్రైవేటు రంగ బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ)ల్లో హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిల్లా అగ్రగామిగా ఉంది. ప్రధానంగా విదేశాలకు ఉన్నత విద్య కోసం వెళ్లే విద్యార్థులకు ఈ సంస్థ అధికంగా రుణాలు ఇస్తోంది.


విజయ డయాగ్నొస్టిక్‌ లాభం రూ.27 కోట్లు

హైదరాబాద్‌: రోగ నిర్థారణ సేవల సంస్థ విజయ డయాగ్నొస్టిక్‌ సెంటర్‌, మార్చి త్రైమాసికానికి రూ.26.92 కోట్ల స్టాండలోన్‌ నికరలాభాన్ని ప్రకటించింది. 2021-22 ఇదే కాల లాభం రూ.23.71 కోట్లే. ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.117.05 కోట్ల నుంచి రూ.122.86 కోట్లకు పెరిగింది. 2022-23 పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ.464.15 కోట్ల ఆదాయంపై రూ.83.23 కోట్ల నికరలాభాన్ని సంస్థ నమోదు చేసింది. 2021-22లో రూ.463.79 కోట్ల ఆదాయంపై రూ.108.29 కోట్ల నికరలాభాన్ని సంస్థ ఆర్జించింది. 1 రూపాయి ముఖ విలువ కలిగిన ప్రతి షేరుకు రూ.1 డివిడెండును డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది.


50% స్మార్ట్‌ఫోన్‌ విడిభాగాలు స్థానికంగా సమీకరిస్తాం: షియామీ

దిల్లీ: విలువపరంగా స్మార్ట్‌ఫోన్‌లో వినియోగించే 50 శాతం విడిభాగాలను భారత్‌ నుంచే సమీకరించడం 2025కు సాకారమవుతుందని షియామీ ఇండియా అధ్యక్షుడు బి.మురళికృష్ణన్‌ వెల్లడించారు. కంపెనీ తాజాగా హియరబుల్స్‌ విభాగంలోకి అడుగుపెట్టామని, నోయిడాలో ఆప్టిమస్‌ ఎలక్ట్రానిక్స్‌ ఫ్యాక్టరీలో వీటిని ఉత్పత్తి చేయనున్నట్లు పేర్కొన్నారు.  ఈ ఏడాది చివరకు స్మార్ట్‌ఫోన్‌ తెరలు, ఫింగర్‌ప్రింట్‌ సెన్సర్‌లను కూడా స్థానికంగానే సమీకరించడంపై పనిచేస్తున్నట్లు వివరించారు. 5జీ ఫోన్లను రూ.10,000-15,000 శ్రేణిలో ఆవిష్కరిస్తే, విక్రయావకాశాలు బాగుంటాయనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని