నాట్కో ఫార్మా ఆకర్షణీయ ఫలితాలు

నాట్కో ఫార్మా రికార్డు స్థాయి లాభాలు ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.926.9 కోట్ల ఆదాయాన్ని, రూ.275.8 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది.

Published : 30 May 2023 02:18 IST

2022-23లో 37.6% పెరిగిన ఆదాయం

ఈనాడు, హైదరాబాద్‌: నాట్కో ఫార్మా రికార్డు స్థాయి లాభాలు ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.926.9 కోట్ల ఆదాయాన్ని, రూ.275.8 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. 2021-22 ఇదేకాలంలో రూ.610.6 కోట్ల ఆదాయంపై రూ.50.5 కోట్ల నికరనష్టాన్ని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం పూర్తికాలానికి నాట్కో ఫార్మా రూ.2,811.7 కోట్ల మొత్తం ఆదాయాన్ని, రూ.715.3 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. వార్షిక ఈపీఎస్‌ రూ.39.18గా ఉంది. 2021-22లో ఆదాయం రూ.2,043.8 కోట్లు, నికరలాభం రూ.170 కోట్లే ఉన్నాయి. దీంతో పోల్చితే గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 37.6%, నికరలాభం 320% పెరిగినట్లు అవుతోంది. అమెరికా, కెనడా, బ్రెజిల్‌ దేశాల్లో మందుల అమ్మకాలను పెంచుకోగలగడం వల్ల అధిక ఆదాయాలు, లాభాలు నమోదు చేసినట్లు నాట్కో ఫార్మా వెల్లడించింది. క్రాప్‌ హెల్త్‌ డివిజన్‌ గత ఆర్థిక సంవత్సరంలో రూ.41 కోట్ల అమ్మకాలను నమోదు చేసింది.

యూకే కంపెనీ కొనుగోలుకు నిర్ణయం: యూకేలో వ్యాపార కార్యకలాపాలను విస్తరించిందుకు వీలుగా అక్కడ జిస్టా ఫార్మా లిమిటెడ్‌ అనే కంపెనీని కొనుగోలు చేసే సన్నాహాల్లో నాట్కో ఫార్మా నిమగ్నమైంది. ఆ కంపెనీలో 100% వాటా కొనుగోలు చేయనున్నట్లు, తత్ఫలితంగా తన అనుబంధ కంపెనీగా మారుతుందని నాట్కో ఫార్మా వివరించింది. ఇందుకు రూ.16.5 - 24.5 కోట్ల వరకు వెచ్చించాల్సి ఉంటుందని పేర్కొంది. జిస్టా ఫార్మా గత మూడేళ్లలో ఏటా 1 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.8.2 కోట్ల) సగటు టర్నోవర్‌ను నమోదు చేసింది.

కొలంబియాలో అనుబంధ కంపెనీ: దక్షిణ అమెరికాలోని కొలంబియాలో కొత్తగా ఒక అనుబంధ కంపెనీని  ఒక లక్ష డాలర్ల పెట్టుబడితో నాట్కో ఫార్మా ఏర్పాటు చేయనుంది. నాట్కో ఫార్మా కొలంబియా ఎస్‌ఏఎస్‌ పేరుతో నెలకొల్పే ఈ కంపెనీ ద్వారా అక్కడ మందుల అమ్మకాలు నిర్వహించనున్నట్లు వివరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు