మూడో రోజూ లాభాల పరుగు

సానుకూల అంతర్జాతీయ సంకేతాల అండతో వరుసగా మూడో రోజూ సూచీలు లాభాలు కొనసాగించాయి. అమెరికా రుణ పరిమితి పెంచేందుకు ఆదివారం ఒప్పందం కుదరడమే ఇందుకు నేపథ్యం.

Published : 30 May 2023 02:18 IST

సమీక్ష

సానుకూల అంతర్జాతీయ సంకేతాల అండతో వరుసగా మూడో రోజూ సూచీలు లాభాలు కొనసాగించాయి. అమెరికా రుణ పరిమితి పెంచేందుకు ఆదివారం ఒప్పందం కుదరడమే ఇందుకు నేపథ్యం. లోహ, స్థిరాస్తి, ఫైనాన్స్‌ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 3 పైసలు తగ్గి 82.63 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 0.17 శాతం నష్టంతో 76.82 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లలో టోక్యో, షాంఘై లాభపడగా, హాంకాంగ్‌ నష్టపోయాయి. ఐరోపా సూచీలు నిరాశపరిచాయి.

సెన్సెక్స్‌ ఉదయం 62,801.54 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా లాభాల్లోనే కదలాడిన సూచీ.. ఇంట్రాడేలో 63,026 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 344.69 పాయింట్లు లాభంతో 62,846.38 వద్ద ముగిసింది. నిఫ్టీ 99.30 పాయింట్లు పెరిగి 18,598.65 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 18,581.25- 18,641.20 పాయింట్ల మధ్య కదలాడింది.

* మార్చి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించడంతో ఎం అండ్‌ ఎం షేరు ఇంట్రాడేలో 5.31% లాభపడి రూ.1350 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 3.71% రాణించి రూ.1329.45 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.5,919.2 కోట్లు పెరిగి రూ.1.65 లక్షల కోట్లకు చేరింది.

* వచ్చే 16 నెలల్లో సాధారణ బీమా విభాగం ఐసీఐసీఐ లాంబార్డ్‌లో తమ వాటాను మరో 4 శాతం పెంచుకోనున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్‌ ప్రకటించింది. ప్రస్తుతం ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌లో బ్యాంకుకు 48.02% వాటా ఉంది. ప్రస్తుత మార్కెట్‌ ధర ప్రకారం.. మరో 4 శాతం వాటా కొనుగోలుకు దాదాపు రూ.2,352.5 కోట్లు అవసరమవుతాయి. ఈ వార్తల నేపథ్యంలో ఐసీఐసీఐ లాంబార్డ్‌ షేరు 8.19% దూసుకెళ్లి రూ.1190 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.4,427.87 కోట్లు పెరిగి రూ.58,446.72 కోట్లుగా నమోదైంది.

* ఇండియా ఐఎన్‌ఎక్స్‌పై బాండ్ల జారీ ద్వారా 750 మి.డాలర్లు సమీకరించినట్లు ఎస్‌బీఐ వెల్లడించింది.

* సెన్సెక్స్‌ 30 షేర్లలో 20 రాణించాయి. ఎం అండ్‌ ఎం 3.71%, టైటన్‌ 2.48%, టాటా స్టీల్‌ 1.88%, ఎస్‌బీఐ 1.55%, హెచ్‌డీఎఫ్‌సీ 1.53%, అల్ట్రాటెక్‌ 1.49%, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 1.30%, ఐటీసీ 1.22%, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 1.20% చొప్పున లాభపడ్డాయి. పవర్‌గ్రిడ్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, మారుతీ, విప్రో, టీసీఎస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ 1.14% వరకు నష్టపోయాయి. రంగాల వారీ సూచీల్లో మన్నికైన వినిమయ వస్తువులు 1.58%, లోహ 1.38%, ఆర్థిక సేవలు 0.81%, స్థిరాస్తి 0.80%, కమొడిటీస్‌ 0.79%, వాహన 0.63% పెరిగాయి. చమురు-గ్యాస్‌, ఐటీ, టెక్‌, ఇంధన నీరసపడ్డాయి. బీఎస్‌ఈలో 1967 షేర్లు లాభపడగా, 1661 స్క్రిప్‌లు నష్టపోయాయి. 183 షేర్లలో ఎటువంటి మార్పులేదు.

* అదానీ గ్రూప్‌ సంస్థ ఎన్‌డీటీవీని మంగళవారం నుంచి స్వల్పకాల ఏఎస్‌ఎం నియమావళిలో చేరుస్తున్నట్లు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ వెల్లడించాయి. ఇప్పటికే అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ఏఎస్‌ఎం నియామవళిలో ఉంది.

నేటి బోర్డు సమావేశాలు: అదానీ పోర్ట్స్‌, అపోలో హాస్పిటల్స్‌, రామ్‌కీ ఇన్‌ఫ్రా, అపెక్స్‌ ఫ్రోజెన్‌ ఫుడ్స్‌, ఈఐడీ ప్యారీ, ఐబీ రియల్‌ ఎస్టేట్‌, రాజేశ్‌ ఎక్స్‌పోర్ట్స్‌, రిలయన్స్‌ ఇన్‌ఫ్రా, టెగా ఇండస్ట్రీస్‌, టొరెంట్‌ ఫార్మా

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని