బ్యాంకుల్లో పాలనాపర లోపాలు

‘రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) పలు మార్గదర్శకాలను జారీ చేస్తున్నప్పటికీ.. ఇప్పటికీ కొన్ని బ్యాంకులు కార్పొరేట్‌ పాలనాపరంగా బలహీనంగా ఉన్నాయి.

Published : 30 May 2023 02:24 IST

బలోపేతం కావాల్సిన అవసరం ఉంది
వృద్ధి వ్యూహాలపై దూకుడొద్దు
ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ హెచ్చరిక

ముంబయి: ‘రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) పలు మార్గదర్శకాలను జారీ చేస్తున్నప్పటికీ.. ఇప్పటికీ కొన్ని బ్యాంకులు కార్పొరేట్‌ పాలనాపరంగా బలహీనంగా ఉన్నాయి. ఈ ధోరణి మారకపోతే.. బ్యాంకింగ్‌ రంగం ఊగిసలాటకు గురయ్యే ప్రమాదం ఉంద’ని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ హెచ్చరించారు. సోమవారమిక్కడ బ్యాంకు బోర్డుల డైరెక్టర్ల నుద్దేశించిన ఆయన ప్రసంగించారు.

‘స్మార్ట్‌ అకౌంటింగ్‌’ మంచిది కాదు

ఒత్తిడికి గురవుతున్న రుణాలను కప్పిపెట్టడానికి, ఆర్థిక పనితీరును ఘనంగా చూపించుకోవడానికి ‘స్మార్ట్‌ అకౌంటింగ్‌’ పద్ధతులు పాటించడం మంచిది కాదు. బ్యాంకు బోర్డులు, యాజమాన్యం.. ఈ తరహా ధోరణులకు అనుమతినివ్వొద్దు. గతంలోనూ ఆయా బ్యాంకుల దృష్టికి ఈ అంశాన్ని ఆర్‌బీఐ తీసుకెళ్లింది. బ్యాంకుల్లో బలమైన పాలనను నెలకొల్పడం బోర్డు ఛైర్మన్‌, డైరెక్టర్ల (నాన్‌ ఎగ్జిక్యూటివ్‌, పార్ట్‌టైం సహా) సంయుక్త బాధ్యత. ఒత్తిడిలో ఉన్న రుణాల అసలు పరిస్థితిని కొన్ని బ్యాంకులు దాచిపెడుతున్నాయి. ఇందు కోసం రెండు బ్యాంకులు కలిసి పనిచేస్తున్నాయి. ఒకరి రుణాలు మరొకరు విక్రయించడం, తిరిగి కొనుగోలు చేయడంలాంటివి చేస్తున్నాయి. లేదంటే ఒత్తిడిలో ఉన్న రుణ స్వీకర్తతో నిర్మాణాత్మక ఒప్పందాలు కుదుర్చుకుని ఒత్తిడిని దాచిపెడుతున్నాయి. లేదంటే అంతర్గత, కార్యాలయ ఖాతాలను ఉపయోగించుకుని వారి బకాయిలను సర్దుబాటు చేస్తున్నాయి.  

అదే జరిగితే నష్టభయం

కొన్ని బ్యాంకులు రుణ హోదాను దాచడం కోసం ‘వినూత్న’ పద్ధతులను పాటిస్తున్నాయి. ఎవర్‌గ్రీన్‌ రుణాలను ఇతర పద్ధతుల్లో ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ అంశాలను బోర్డు సభ్యులు ఎప్పటికప్పుడు పసిగట్టి జాగ్రత్త పడాలి. (ఎవర్‌గ్రీన్‌ రుణాలంటే.. రుణ కాలంలో అసలు మొత్తం చెల్లించకుండా.. వడ్డీ మాత్రమే చెల్లించే రుణాలు.) బ్యాంకులు తమ వృద్ధి వ్యూహాలు, ఎవర్‌గ్రీనింగ్‌ రుణాల విషయంలో దూకుడుగా ఉండొద్దు. ఈ విషయంలో బోర్డు సభ్యులు జాగ్రత్తగా ఉండాలి. క్రెడిట్‌, డిపాజిట్‌ ఉత్పత్తుల విషయంలో మరీ ఎక్కువ లేదా మరీ తక్కువ రేట్లు మంచిది కాదు. డిపాజిట్‌/క్రెడిట్‌ ప్రొఫైళ్లను వైవిధ్యీకరించకుంటే బ్యాంకులు నష్టభయంలో కూరుకుపోయే అవకాశాలు పెరుగుతాయి.

కీలక రేట్లు తగ్గొచ్చు: ఆక్స్‌ఫర్డ్‌ ఎకనామిక్స్‌

దిల్లీ: ప్రస్తుత ఏడాది చివరి త్రైమాసికం(అక్టోబరు-డిసెంబరు)లో ఆర్‌బీఐ తన కీలక రేట్లను తగ్గించే అవకాశం ఉందని అంతర్జాతీయ అంచనాల సంస్థ ఆక్స్‌ఫర్డ్‌ ఎకనామిక్స్‌ అంచనా వేసింది. మరింత సర్దుబాటు ధోరణికి ఆర్‌బీఐ మారడానికి పలు అంశాలు దోహదం చేయొచ్చని అంటోంది. ద్రవ్యోల్బణం ఇప్పటికే తగ్గుముఖం పడుతుండడంతో పాటు వినియోగదారు ద్రవ్యోల్బణం కిందకు రావొచ్చన్న అంచనాలున్నాయి.. ఈ నేపథ్యంలో రేట్ల పెంపు నుంచి రేట్ల కోత దిశగా ఆర్‌బీఐ దిశ మారొచ్చని చెబుతోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు