రూ.29,000 కోట్ల సమీకరణలో అదానీ గ్రూప్‌!

గౌతమ్‌ అదానీకి చెందిన అదానీ గ్రూప్‌ తన 3 కంపెనీల్లో ఈక్విటీ షేర్లను సంస్థాగత మదుపర్లకు విక్రయించడం ద్వారా 3 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.29,000 కోట్ల) వరకు సమీకరించాలని భావిస్తోంది.

Published : 01 Jun 2023 02:32 IST

3 కంపెనీల్లో షేర్ల విక్రయం ద్వారా

దిల్లీ: గౌతమ్‌ అదానీకి చెందిన అదానీ గ్రూప్‌ తన 3 కంపెనీల్లో ఈక్విటీ షేర్లను సంస్థాగత మదుపర్లకు విక్రయించడం ద్వారా 3 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.29,000 కోట్ల) వరకు సమీకరించాలని భావిస్తోంది. అమెరికా షార్ట్‌సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ నివేదిన వెలువడ్డ అనంతరం, నిధుల సమీకరణకు గ్రూప్‌ వేస్తున్న వ్యూహాత్మక అడుగు ఇదే. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ ట్రాన్స్‌మిషన్‌ బోర్డులు ఇప్పటికే రూ.21,000 కోట్ల(2.5 బి. డాలర్లకు పైగా) వరకు నిధుల సమీకరణకు ఆమోద ముద్ర వేశారు. అదానీ గ్రీన్‌ ఎనర్జీ బోర్డు కూడా వచ్చే కొద్ది వారాల్లో 100 కోట్ల డాలర్ల (సుమారు రూ.8200 కోట్ల) నిధుల సమీకరణకు ఆమోదముద్ర వేయనుందని ఈ అంశాలతో సంబంధమున్న వర్గాలు పేర్కొన్నాయి. జూన్‌ తొలి / రెండో వారంలో నిధుల సమీకరణ అంశాన్ని పరిశీలించడానికి అదానీ గ్రీన్‌ ఎనర్జీ బోర్డు సమావేశం కావొచ్చని ఆ వర్గాలు పేర్కొన్నాయి. బోర్డు ఆమోదం లభించిన నేపథ్యంలో.. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ ట్రాన్స్‌మిషన్‌లు నిధుల సమీకరణ కోసం వాటాదార్ల ఆమోదాన్ని ఇప్పటికే కోరాయి. మొత్తం 3.5 బిలియన్‌ డాలర్లను గ్రూప్‌ మూలధన వ్యయ అవసరాల కోసమే వినియోగించనున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం(జులై-సెప్టెంబరు)లోగా ఈ సమీకరణ పూర్తి కావొచ్చని భావిస్తున్నారు. హిండెన్‌బర్గ్‌ నివేదిక నేపథ్యంలో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ రూ.20,000 కోట్ల ఎఫ్‌పీఓను నిలపాల్సి వచ్చింది. ఆ పరిణామం సంభవించిన 3 నెలల్లోనే తాజా నిధుల సమీకరణ పరిణామాలు చోటు చేసుకుంటుండడం విశేషం. అదానీ గ్రూప్‌ షేర్ల విలువలు మళ్లీ పెరుగుతుండటం ఇందుకు నేపథ్యం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని