ఐటీలో మందగమనం కొనసాగుతుంది

దేశీయ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆశించినంత వృద్ధి సాధించకపోవచ్చని రేటింగ్‌ సేవల సంస్థ ఇక్రా తన నివేదికలో వెల్లడించింది.

Updated : 01 Jun 2023 06:46 IST

నియామకాలూ తగ్గుతాయి: ఇక్రా

ముంబయి: దేశీయ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆశించినంత వృద్ధి సాధించకపోవచ్చని రేటింగ్‌ సేవల సంస్థ ఇక్రా తన నివేదికలో వెల్లడించింది. 250 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.20.65 లక్షల కోట్ల) విలువైన ఐటీ పరిశ్రమ వృద్ధి రేటు ఈ ఆర్థికంలో మరింత మందగించి, 5-6 శాతానికి పరిమితం కావచ్చని పేర్కొంది. నియామకాల విషయంలోనూ అనిశ్చితి కొనసాగుతుందని వెల్లడించింది. కంపెనీలు సమీప భవిష్యత్తులో ఉద్యోగుల చేరికలను తక్కువ స్థాయిలోనే ఉంచుతాయని అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరం చివరి ఆరు నెలల్లో నియామకాలు తగ్గడాన్ని నివేదిక ప్రస్తావించింది. నాస్కామ్‌ మార్చిలో విడుదల చేసిన నివేదికలో ఐటీ రంగ వృద్ధి 2022-23లో 8.4 శాతానికే పరిమితమైంది. అంతక్రితం ఇది 15% వరకు ఉండటం గమనార్హం.  

డాలర్‌ పరంగానూ తక్కువే: భారతీయ ఐటీ కంపెనీలకు బలమైన ఆర్డర్లు ఇప్పటికే లభించినా, కొన్ని ఆర్డర్లు చర్చల దశలో ఉన్నప్పటికీ.. డాలరు విలువ పరంగా వృద్ధి తక్కువగానే ఉండొచ్చని పేర్కొంది. అత్యున్నత నాణ్యతను కలిగిన కంపెనీలు స్థిరమైన వృద్ధిని కొనసాగిస్తాయని తెలిపింది. దేశీయ పరిశ్రమకు లభించే ఆదాయాల్లో 80-90% వాటా కలిగిన ఉన్న అమెరికా, ఐరోపా దేశాల్లో స్థూల ఆర్థిక ప్రతికూలతలున్నందున గత ఆర్థిక సంవత్సరం చివరి రెండు త్రైమాసికాల్లో వృద్ధి మందగించిందని నివేదిక పేర్కొంది. అమెరికా బ్యాంకుల సంక్షోభం కారణంగా బ్యాంకింగ్‌, ఆర్థిక సేవలు, బీమా విభాగాల నుంచి మన ఐటీ కంపెనీలకు ఆదాయాలు పడిపోయాయని పేర్కొంది. ఖాతాదారులు ఐటీ వ్యయాలపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరుగుతోందని, ఇది ఐటీ కంపెనీల ఆదాయాలపై ప్రభావం చూపిస్తోందని తెలిపింది. లాభదాయకత విషయంలో మార్జిన్లు 1.90% తగ్గి, 22.9 శాతానికి చేరుకున్నాయని పేర్కొంది. దేశంలోని ప్రముఖ 5 ఐటీ కంపెనీలు గత ఆర్థిక సంవత్సరంలో నికరంగా 83,906 మంది నిపుణులను నియమించుకున్నాయని పేర్కొంది. 2021-22లో ఈ సంఖ్య 2.73 లక్షలుగా ఉంది. భవిష్యత్తులోనూ ఉద్యోగ నియామకాలు కాస్త తక్కువగానే ఉండే అవకాశం ఉందని ఇక్రా అంచనా వేసింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని