సంక్షిప్త వార్తలు

విమానాయన సంస్థ విస్తారా ముంబయి-లండన్‌ మధ్య నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించింది. ఈ సర్వీసులు వారానికి 5 రోజులు నడుస్తాయని సంస్థ తెలిపింది.

Published : 02 Jun 2023 03:51 IST

ముంబయి-లండన్‌ మధ్య విస్తారా విమానం

ఈనాడు, దిల్లీ: విమానాయన సంస్థ విస్తారా ముంబయి-లండన్‌ మధ్య నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించింది. ఈ సర్వీసులు వారానికి 5 రోజులు నడుస్తాయని సంస్థ తెలిపింది. తొలి సర్వీసుగా బోయింగ్‌ 787-9 డ్రీమ్‌లైనర్‌ విమానం గురువారం మధ్యాహ్నం 14.35 గంటలకు ముంబయిలో బయలుదేరి 19.55 (బీఎస్‌టీ) గంటలకు లండన్‌ హీత్రూ విమానాశ్రయానికి చేరుకుంది.  


31 నెలల గరిష్ఠానికి భారత తయారీ పీఎమ్‌ఐ

దిల్లీ: దేశంలో తయారీ కార్యకలాపాలు మరింత రాణించి, మే నెలలో 31 నెలల గరిష్ఠ స్థాయికి చేరాయి. కొత్త ఆర్డర్లు బాగా పెరగడం, సానుకూల మార్కెట్‌ పరిస్థితులు ఇందుకు దోహదం చేశాయి. తయారీ కార్యకలాపాలు పెరగడం వల్ల మరిన్ని ఉద్యోగావకాశాలూ కలిగాయి. ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ ఇండియా మాన్యుఫాక్చరింగ్‌ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ సూచీ ఏప్రిల్‌లో 57.2గా ఉండగా.. మే నెలలో 58.7కు పెరిగింది. 2020 అక్టోబరు తరవాత అత్యధిక వృద్ధి ఇదే. వరుసగా 23వ నెలలోనూ కార్యకలాపాల పరిస్థితులు మెరుగుకావడం విశేషం. ఈ సూచీ 50 పాయింట్ల పైన నమోదైతే వృద్ధిగా, దానికి దిగువన క్షీణతగా పరిగణిస్తారు.


2024 ఏప్రిల్‌లో ఫాక్స్‌కాన్‌ ఐఫోన్ల తయారీ

దిల్లీ: వచ్చే ఏడాది ఏప్రిల్‌ కల్లా కర్ణాటకలో ఐఫోన్ల తయారీని, యాపిల్‌ సరఫరాదారు ఫాక్స్‌కాన్‌ ప్రారంభించనుందని ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఫ్యాక్టరీ కోసం కేటాయించిన స్థలాన్ని జులై 1న ఫాక్స్‌కాన్‌కు అందజేయనున్నట్లు తెలిపింది. ఈ ప్రాజెక్టు విలువ రూ.13,000 కోట్లు (1.59 బి.డాలర్లు) కాగా.. దీంతో దాదాపు 50,000 ఉద్యోగాలు వస్తాయని కర్ణాటక ప్రభుత్వం అంచనా వేస్తోంది. బెంగళూరు శివార్లలోని దేవనహళ్లిలో ప్లాంట్‌ ఏర్పాటు చేసి, ఏడాదికి 2 కోట్ల ఐఫోన్లను తయారు చేయాలని ఫాక్స్‌కాన్‌ భావిస్తోంది. కొవిడ్‌ సంబంధిత ఆంక్షల వల్ల తలెత్తిన పరిణామాల నేపథ్యంలో, చైనా నుంచి ఐఫోన్ల ఉత్పత్తిని ఇతర దేశాలకు మార్చాలని యాపిల్‌ నిర్ణయించింది. ఇందులో భాగంగానే కర్ణాటకలో ప్లాంట్‌ను ఫాక్స్‌కాన్‌ ఏర్పాటు చేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని