ఈ సారి వడ్డీ రేట్లు యథాతథం

వచ్చే వారం (6-8వ తేదీల్లో) జరగనున్న రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) ద్రవ్యపరపతి విధాన సమీక్షలో కీలక రేట్లను 6.5 శాతం వద్ద యథాతథంగా కొనసాగించే అవకాశం ఉందని గోల్డ్‌మన్‌ శాక్స్‌ ఇండియా విశ్లేషకులు ఒక నివేదికలో పేర్కొన్నారు.

Published : 03 Jun 2023 01:51 IST

ఏడాది చివరి వరకు ఇదే ధోరణి
గోల్డ్‌మన్‌ శాక్స్‌ ఇండియా అంచనా

ముంబయి: వచ్చే వారం (6-8వ తేదీల్లో) జరగనున్న రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) ద్రవ్యపరపతి విధాన సమీక్షలో కీలక రేట్లను 6.5 శాతం వద్ద యథాతథంగా కొనసాగించే అవకాశం ఉందని గోల్డ్‌మన్‌ శాక్స్‌ ఇండియా విశ్లేషకులు ఒక నివేదికలో పేర్కొన్నారు. ఈ ఏడాది రిటైల్‌ ద్రవ్యోల్బణం సగటున 5.3 శాతంగా నమోదు కావొచ్చని అంచనా వేశారు. ఆర్‌బీఐ లక్ష్యిత శ్రేణి 2-6 శాతం మధ్యే ఇది ఉందని తెలిపారు. అయితే ఇటీవలి అకాల వర్షాల కారణంగా జరిగిన పంట నష్టంతో ఆహార ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. మార్చిలో 5.7 శాతంగా ఉన్న రిటైల్‌ ద్రవ్యోల్బణం.. ఏప్రిల్‌లో 18 నెలల కనిష్ఠమైన 4.7 శాతానికి చేరింది. 2023-24 మొదటి త్రైమాసికంలో ఆర్‌బీఐ అంచనా కంటే 0.5 శాతం తక్కువగా ద్రవ్యోల్బణం ఉండే అవకాశం ఉంది. దీంతో జూన్‌ సమీక్షలో ఆర్‌బీఐ కీలక రేట్లను సవరించక పోవచ్చని గోల్డ్‌మన్‌ శాక్స్‌ అభిప్రాయపడింది. ఈ ఏడాది చివరి వరకు ఇదే ధోరణి కొనసాగించే అవకాశం కూడా ఉందని వివరించింది. 2022 మే నుంచి ఆర్‌బీఐ కీలక రేట్లను ఆరు సార్లు పెంచింది. ఫలితంగా రెపో రేటు 4.15 శాతం నుంచి 6.5 శాతానికి పెరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని