సాప్‌ ల్యాబ్‌లో 1,000 ఉద్యోగాలు

వ్యాపార సంస్థలకు సాంకేతిక పరిష్కారాలను అందించే సాప్‌(ఎస్‌ఏపీ) ల్యాబ్స్‌ ఇండియా ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 1,000 మంది ఉద్యోగులను నియమించుకోనుంది.

Published : 03 Jun 2023 02:04 IST

ఈనాడు, హైదరాబాద్‌: వ్యాపార సంస్థలకు సాంకేతిక పరిష్కారాలను అందించే సాప్‌(ఎస్‌ఏపీ) ల్యాబ్స్‌ ఇండియా ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 1,000 మంది ఉద్యోగులను నియమించుకోనుంది. దేశంలో హైదరాబాద్‌ సహా మరో నాలుగు ప్రధాన నగరాల్లో కార్యాలయాలున్నాయని, ఇందులో 15,000 ఉద్యోగులు పనిచేస్తున్నారని సాప్‌ ల్యాబ్స్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సింధు గంగాధరన్‌ తెలిపారు. హైదరాబాద్‌ కేంద్రంలో 225 మంది నిపుణులు ఉన్నారని పేర్కొన్నారు. సంస్థ పరిశోధన, అభివృద్ధిలో 40 శాతానికి పైగా భారత్‌లోని కేంద్రాల భాగస్వామ్యం ఉందన్నారు. హైదరాబాద్‌ ఇందులో ఎంతో కీలకమని పేర్కొన్నారు. కొన్ని ప్రత్యేక సాఫ్ట్‌వేర్లను ఇక్కడి నుంచే అందించినట్లు తెలిపారు. కొత్త నియామకాల్లో హైదరాబాద్‌ కేంద్రంలో ప్రాముఖ్యత ఉండబోతోందన్నారు.

అంకురాలకు ప్రోత్సాహం..: హైదరాబాద్‌ అంకురాలకు ఎంతో ప్రాధాన్యం ఉందని, ఇక్కడ ఈ వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని సింధు గంగాధరన్‌ ‘ఈనాడు’తో అన్నారు. సాప్‌ ల్యాబ్స్‌ ఇండియా పలు రంగాల్లోని అంకురాలను ప్రోత్సహించేందుకు వీలుగా సాప్‌ స్టార్టప్‌ స్టూడియోను ఏర్పాటు చేశామని తెలిపారు. ఒక్కో దశలో సగటున 18 అంకురాలతో కలిసి పనిచేస్తున్నామన్నారు. ‘ఎంపిక చేసిన అంకురాలకు తగిన మార్గదర్శకత్వం ఇస్తున్నాం. అవి మార్కెట్లోకి వెళ్లడానికి అవసరమైన సహాయాన్ని, సాంకేతిక సహకారాన్నీ అందిస్తున్నాం. టి-హబ్‌తో కలిసి ఇక్కడి అంకుర వ్యవస్థలో భాగస్వామ్యం అయ్యాం’ అని పేర్కొన్నారు.  సరైన నాయకత్వం, వినూత్న ఆవిష్కరణలు ఉన్న సంస్థలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.  

ఉద్యోగాల కోత తాత్కాలికమే..: నాస్కామ్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ బోర్డులో సభ్యులుగానూ ఉన్న సింధు గంగాధరన్‌ ప్రస్తుత ఉద్యోగాల కోత విషయమై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ‘కొవిడ్‌ సమయంలో ప్రతి ఒక్కరూ డిజిటల్‌కు మారడం ద్వారా, తమ వ్యాపారాలను కొనసాగించడానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఈ క్రమంలో ఉద్యోగ నియామకాల్లో వృద్ధి కనిపించింది. ఇప్పుడు కాస్త సర్దుబాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగాల్లో కోత కనిపిస్తోంది. కానీ, ఇది తాత్కాలికమే. మళ్లీ నియామకాలు పెరుగుతాయి. సరైన నైపుణ్యాలు ఉన్న వారికి ఎప్పుడూ ఇబ్బంది ఉండదు’ అని పేర్కొన్నారు. ఐటీ రంగంలో మహిళల ప్రాధాన్యం పెరిగిందని పేర్కొన్నారు. సాప్‌ ల్యాబ్స్‌లో ప్రస్తుతం 35% వరకూ మహిళా నిపుణులు ఉన్నారని, భవిష్యత్తులో ఈ సంఖ్య 50 శాతానికి చేరుకుంటుందని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని