టాటా మెమోరియల్‌ సెంటర్‌కు ఐసీఐసీఐ రూ.1,200 కోట్ల నిధులు

మరింత మంది కేన్సర్‌ రోగులకు వైద్య సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో టాటా మెమోరియల్‌ సెంటర్‌ (టీఎంసీ)కు రూ.1,200 కోట్ల మేర నిధుల సాయాన్ని అందించనున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్‌ తెలిపింది.

Updated : 03 Jun 2023 04:36 IST

విశాఖ సహా 3 ప్రాంతాల్లోని కేన్సర్‌ ఆసుపత్రుల విస్తరణ

ముంబయి: మరింత మంది కేన్సర్‌ రోగులకు వైద్య సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో టాటా మెమోరియల్‌ సెంటర్‌ (టీఎంసీ)కు రూ.1,200 కోట్ల మేర నిధుల సాయాన్ని అందించనున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్‌ తెలిపింది. దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం సహా మూడు ప్రాంతాల్లో టీఎంసీకి చెందిన కేన్సర్‌ ఆసుపత్రుల విస్తరణ నిమిత్తం తమ కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) విభాగం ఈ నిధులను ఇవ్వనున్నట్లు తెలిపింది. విస్తరణలో భాగంగా నవీ ముంబయిలోని ఖర్‌ఘర్‌ వద్ద టీఎంసీకి ఉన్న అడ్వాన్స్‌డ్‌ సెంటర్‌ ఫర్‌ ట్రీట్‌మెంట్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌ కేన్సర్‌లో రేడియేషన్‌ ఆంకాలజీ బ్లాక్‌; ముల్లాన్‌పుర్‌ (పంజాబ్‌), విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్‌)లోని టీఎంసీ హోమీ బాబా కేన్సర్‌ హాస్పిటల్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌లో రెండు పీడియాట్రిక్‌, హీమటాలాజికల్‌ ఆంకాలజీ బ్లాక్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఈ కొత్త బ్లాక్‌లు 2027 కల్లా పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభిస్తాయని ఐసీఐసీఐ బ్యాంక్‌ ఛైర్మన్‌ గిరీశ్‌ చంద్ర చతుర్వేది తెలిపారు. వీటిద్వారా ఏటా మరో 25,000 మంది కేన్సర్‌ రోగులకు వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుతం టీఎంసీ ఏటా 1.2 లక్షల మందికి కేన్సర్‌ చికిత్స అందిస్తోంది.  ఈ మూడు ఆసుపత్రుల విస్తరణ కోసం ఇప్పటికే రూ.500 కోట్ల మేర సీఎస్‌ఆర్‌ నిధి సిద్ధంగా ఉందని, మొత్తం మీద రూ.2,500 కోట్లు వెచ్చిస్తామని చతుర్వేది తెలిపారు. తద్వారా టీఎంసీ భాగస్వామ్యంతో చేపడుతున్న ఈ కార్యకలాపాల కోసం బ్యాంకు తన సీఎస్‌ఆర్‌ నిధుల్లో 50 శాతాన్ని వెచ్చించనుందని తెలిపారు.
2030 కల్లా సేవల వాటా రెట్టింపు..: 2030 కల్లా దేశవ్యాప్తంగా ఏటా కేన్సర్‌ చికిత్సా సేవల వాటాను రెట్టింపు చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు టాటా మెమోరియల్‌ సెంటర్‌ డైరెక్టర్‌ రాజేంద్ర బాడ్వే తెలిపారు. ‘ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏటా కేన్సర్‌ రోగుల సంఖ్య 13 లక్షల వరకు ఉంటోంది. వీళ్లలో 10% మందికి టాటా హాస్పిటల్‌ చికిత్స అందిస్తోంది. దీనిని ఈ దశాబ్దం చివరికల్లా 20 శాతానికి పెంచుకోవాలని భావిస్తున్నట్లు’ ఆయన పేర్కొన్నారు. ఈ లక్ష్య సాధన కోసం ఆసుపత్రుల విస్తరణ, శిక్షణా సామర్థ్యాలను పెంచుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు