అధిక వడ్డీ రేట్ల కాలం ముగిసిందా?

పెట్టుబడికి, వడ్డీకి హామీనిచ్చే పథకం అనగానే వెంటనే గుర్తుకొచ్చేవి ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు(ఎఫ్‌డీ). కీలక వడ్డీ రేటు పెరుగుతూ వస్తుండటంతో ఎఫ్‌డీలపై వడ్డీ గరిష్ఠ స్థాయికి చేరుకుంది.

Published : 04 Jun 2023 02:01 IST

ఆర్‌బీఐ ఏమంటుందో?
డిపాజిటర్లలో ఆందోళన

ఈనాడు, హైదరాబాద్‌: పెట్టుబడికి, వడ్డీకి హామీనిచ్చే పథకం అనగానే వెంటనే గుర్తుకొచ్చేవి ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు(ఎఫ్‌డీ). కీలక వడ్డీ రేటు పెరుగుతూ వస్తుండటంతో ఎఫ్‌డీలపై వడ్డీ గరిష్ఠ స్థాయికి చేరుకుంది. అంతకు క్రితం దాదాపు రెండేళ్లపాటు వడ్డీ రేట్లు 5 శాతం లోపే ఉండేవి. ఆర్‌బీఐ రెపో రేటును పెంచడంతో ఇప్పుడు వీటిపై అందుతున్న ప్రతిఫలం ఆకర్షణీయంగా కనిపిస్తోంది. గత కొన్ని నెలలుగా బ్యాంకులు ఈ డిపాజిట్‌ రేట్లపై స్తబ్దుగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో అధిక వడ్డీ రేట్లకు కాలం చెల్లిందా అనే సందేహం వ్యక్తం అవుతోంది.

గత పరపతి విధాన సమీక్షలో ఆర్‌బీఐ రెపో రేటును స్థిరంగా ఉంచింది. ఈసారీ దీన్ని కొనసాగించడం లేదా 25 బేసిస్‌ పాయింట్ల మేరకు తగ్గించవచ్చనే అంచనాలున్నాయి. ముఖ్యంగా ద్రవ్యోల్బణం 5 శాతం ఉండటం, తయారీ రంగంలో కాస్త మందగమనంలాంటి కారణాలతో ఆర్‌బీఐ వడ్డీ రేటును పెంచేందుకు ఇష్టపడకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు దేశ ఆర్థిక వృద్ధి రేటు 6.50 - 7 శాతం మధ్యలో ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అదే సమయంలో ద్రవ్యోల్బణం 4.50 శాతం నుంచి 4.75 శాతం లోపు ఉండొచ్చు. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ కీలక వడ్డీ రేట్లపై కొత్తగా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవచ్చని బ్యాంకింగ్‌ నిపుణులు పేర్కొంటున్నారు.

సాధారణంగా ఆర్‌బీఐ విధాన సమీక్ష నిర్ణయానికి ముందు బ్యాంకులు వడ్డీ రేట్లను సవరిస్తుంటాయి. ఈసారి చాలా బ్యాంకులు తమ డిపాజిట్‌ వడ్డీ రేట్లను స్వల్పంగా తగ్గించాయి. జూన్‌ 1 నుంచి కొత్త రేట్లను అమల్లోకి తీసుకొచ్చాయి. యాక్సిస్‌ బ్యాంక్‌ కొన్ని వ్యవధుల డిపాజిట్లపై 20 బేసిస్‌ పాయింట్ల మేరకు వడ్డీని తగ్గించింది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ఏడాది వ్యవధి డిపాజిట్‌పై వడ్డీని 5 బేసిస్‌ పాయింట్లను తగ్గించింది. గత నెలలో 666 రోజుల వ్యవధి వడ్డీని 7.25 శాతం నుంచి 7.05 శాతానికి చేర్చింది. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గత ఏడాది నవంబరులో గరిష్ఠంగా 7.30 శాతం వడ్డీని అందిస్తుండగా, ఇప్పుడు అది 7 శాతంగానే ఉంది. సీనియర్‌ సిటిజన్లకు 7.50 శాతం వడ్డీని ఇస్తోంది. కొన్ని బ్యాంకులు ఎంసీఎల్‌ఆర్‌ను పెంచినప్పటికీ, డిపాజిట్లపై ఎలాంటి చర్యలూ చేపట్టలేదు.

రుణాలకు గిరాకీ పెరుగుతున్నా...

బ్యాంకుల్లో రుణాలకు గిరాకీ క్రమంగా పెరుగుతోంది. వివిధ రుణ ఖాతాల్లో 15 శాతానికి పైగా వృద్ధి కనిపిస్తోందని బ్యాంకింగ్‌ గణాంకాలు చెబుతున్నాయి. దీన్ని తట్టుకునేందుకు బ్యాంకులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను ఆకర్షించేలా వడ్డీ రేట్లను పెంచాలి. కానీ, డిపాజిట్లు సైతం అధికంగానే వస్తుండటంతో ఈ విషయాన్ని బ్యాంకులు అంతగా పట్టించుకోవడం లేదు. మరోవైపు రూ.2,000 నోట్ల ఉపసంహరణతో బ్యాంకుల్లో కరెంట్‌, పొదుపు ఖాతాల్లో డిపాజిట్లు పెరుగుతున్నాయి. వీటికి వడ్డీ టర్మ్‌ డిపాజిట్లతో పోలిస్తే చాలా తక్కువ. రానున్న ఒకటి రెండు త్రైమాసికాలపాటు ఈ డిపాజిట్లు రుణాల అవసరాలకు సరిపోయే అవకాశం ఉందని బ్యాంకులు భావిస్తున్నాయి. అందుకే, ఎఫ్‌డీలను పట్టించుకోవడం లేదనే అభిప్రాయాన్నీ బ్యాంకింగ్‌ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఆ తర్వాత రెపో రేటు తగ్గడం ప్రారంభిస్తే.. ఎఫ్‌డీలపై వడ్డీ రేటూ దిగి వస్తుంది.  కాబట్టి, ఇప్పుడున్న స్థాయి.. మున్ముందు ఉండకపోవచ్చని పేర్కొంటున్నారు.

డిపాజిటర్లు ఏం చేయాలంటే..

ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను చేసిన వారు.. వివిధ కాల వ్యవధులకు అధిక వడ్డీ ఇస్తున్న బ్యాంకుల్లో డిపాజిట్లను వేసుకునే విషయాన్ని పరిశీలించాలి. కొత్తతరం స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకుల్లో కొన్ని 8 శాతానికి పైగానే వడ్డీ ఇస్తున్నాయి. రూ.5 లక్షల వరకూ వీటిలోనూ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ వర్తిస్తుంది. కాబట్టి, డిపాజిట్‌దారులు మరికొన్నాళ్లు అధిక వడ్డీ ప్రయోజనం పొందేలా జాగ్రత్తగా ప్రణాళిక వేసుకోవాలని ఆర్థిక నిపుణులు సలహా ఇస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని