స్థిరీకరణ దిశగా సూచీలు

ఈ వారం స్టాక్‌మార్కెట్లు స్థిరీకరణకు గురికావొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే తక్కువ స్థాయిల వద్ద కొనుగోలు అవకాశం కోసం మదుపర్లు ఎదురుచూస్తున్నందున మొత్తం మీద మార్కెట్లో ధోరణి సానుకూలంగానే కనిపిస్తోంది.

Published : 05 Jun 2023 03:02 IST

ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాలపై దృష్టి
రుతుపవనాల పురోగతీ కీలకమే
యంత్ర పరికరాలు, ఐటీ షేర్లకు సానుకూలతలు
విశ్లేషకుల అంచనాలు
స్టాక్‌ మార్కెట్‌ ఈ వారం

ఈ వారం స్టాక్‌మార్కెట్లు స్థిరీకరణకు గురికావొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే తక్కువ స్థాయిల వద్ద కొనుగోలు అవకాశం కోసం మదుపర్లు ఎదురుచూస్తున్నందున మొత్తం మీద మార్కెట్లో ధోరణి సానుకూలంగానే కనిపిస్తోంది. ఎంపిక చేసిన మధ్య, చిన్న స్థాయి షేర్లలో కదలికలు ఉండొచ్చని అంటున్నారు. నిఫ్టీ-50 ఈ వారం 18400-18600 మధ్య చలించొచ్చని బ్రోకరేజీల అంచనాగా ఉంది. అంతర్జాతీయంగా చూస్తే అమెరికా మే నెల ఉద్యోగ నివేదిక సోమవారం వెలువడనుంది. ఎల్‌నినో ప్రభావాన్ని పెద్దగా పట్టించుకోకపోయినా.. రుతుపవనాల్లో ఏవైనా అసాధారణ పరిస్థితులు ఎదురైతే వ్యవసాయ ఆధారిత షేర్లు, ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లపై ప్రభావం పడొచ్చని విశ్లేషకులు అంటున్నారు. ఈ వారంలో రుతుపవనాలు రావొచ్చన్న అంచనాల మధ్య వ్యవసాయ ఆధారిత షేర్లపై మదుపర్లు దృష్టిసారించొచ్చు. వివిధ రంగాలపై విశ్లేషకుల అంచనాలు..

* యంత్రపరికరాల షేర్లు సానుకూలంగా చలించొచ్చు. అయితే లార్జ్‌ క్యాప్‌ స్క్రిప్‌లలో కొంత దిద్దుబాటు కనిపించొచ్చు. మిడ్‌-క్యాప్‌ షేర్లు రాణించొచ్చు. వరుసగా నాలుగో నెలా ఈ రంగం బలంగా కనిపిస్తోంది. బలమైన ఆర్డర్లు, కమొడిటీ ధరలు తగ్గడం ఇందుకు నేపథ్యం.

* ఎంపిక చేసిన ఐటీ షేర్లలో చలనాలను అంచనా వేస్తున్నారు. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ, టెక్‌ మహీంద్రా, విప్రోలు రాణించే అవకాశం ఉంది. ఇన్ఫోసిస్‌ కాస్త డీలా పడొచ్చు.

* సిమెంటు షేర్లు స్తబ్దుగా కదలాడవచ్చు. పరిశ్రమ మొత్తం మీద బలహీన ధరలు కొనసాగుతుండడం గమనార్హం. అల్ట్రాటెక్‌ సిమెంట్‌ను కొనొచ్చని, అంబుజా సిమెంట్స్‌ను అమ్మొచ్చని. ఏసీసీ, శ్రీ సిమెంట్‌ను అట్టేపెట్టుకోవచ్చని బ్రోకరేజీ ఒకటి సిఫారసు చేస్తోంది.

* వాహన షేర్లు సానుకూల ధోరణిలో చలించొచ్చు. మే నెలలో టోకు విక్రయాలకు తోడు మార్చి త్రైమాసికంలో బలమైన ఫలితాలు ఇందుకు దోహదం చేయొచ్చు. మొత్తం మీద కూడా ఈ రంగ ధోరణిపై విశ్లేషకులు సానుకూలంగానే ఉన్నారు.

* అప్‌స్ట్రీమ్‌ చమురు కంపెనీలైన ఓఎన్‌జీసీ, ఆయిల్‌ ఇండియా షేర్లు చమురు ధరల ఆధారంగా ట్రేడవవచ్చు. ఒపెక్‌, అనుబంధ దేశాల సమావేశం నేపథ్యంలో చమురు ధరలు ఊగిసలాడొచ్చన్న అంచనాలున్నాయి.

* ఎంపిక చేసిన టెలికమ్యూనికేషన్‌ స్క్రిప్‌లు చలించొచ్చు. గత వారం కొత్త గరిష్ఠాలను తాకిన భారతీ ఎయిర్‌టెల్‌ ఈ వారమూ రాణించే అవకాశం ఉంది.

* బ్యాంకింగ్‌ షేర్లపై మదుపర్లు అప్రమత్తత కొనసాగించొచ్చు. బ్యాంక్‌ నిఫ్టీ 42,500- 44,500 స్థాయుల్లో కదలాడే అవకాశం ఉంది. ఆర్‌బీఐ వడ్డీ రేట్ల నిర్ణయం ఈ షేర్లకు దిశానిర్దేశం చేయొచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ షేర్లపై బ్రోకరేజీలు సానుకూలంగా ఉన్నాయి.

* ఆకర్షణీయమైన విలువల కారణంగా ఔషధ షేర్లు లాభాలు కొనసాగించే అవకాశం ఉంది. ముడివస్తువుల ధరలు తగ్గడం, సరఫరా ఇబ్బందులు మెరుగుపడటంతో పరిశ్రమ రాణించొచ్చని అంటున్నారు. మ్యాన్‌కైండ్‌ ఫార్మా, టొరెంట్‌ ఫార్మా షేర్లపై విశ్లేషకులు బుల్లిష్‌గా ఉన్నారు.

* ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లలో లాభాల స్వీకరణ ఎదురుకావొచ్చు. ఇటీవలి కాలంలో ఈ షేర్లు భారీగా పెరగడం, రుతుపవనాలపై ఇంకా స్పష్టత రాకపోవడమే ఇందుకు కారణం. ఐటీసీ, హెచ్‌యూఎల్‌, మారికో షేర్లు సూచీని నడిపించొచ్చని భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని