అమెరికా రుణదాతపై బైజూస్‌ దావా

అమెరికాకు చెందిన రెడ్‌వుడ్‌ అనే ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ నుంచి పొందిన 1.2 బిలియన్‌ డాలర్ల రుణం చెల్లింపులను దేశీయ ఎడ్‌టెక్‌ సంస్థ బైజూస్‌ దాటవేసింది.

Published : 07 Jun 2023 03:03 IST

1.2 బి. డాలర్ల రుణంపై చెల్లింపుల దాటవేత

దిల్లీ: అమెరికాకు చెందిన రెడ్‌వుడ్‌ అనే ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ నుంచి పొందిన 1.2 బిలియన్‌ డాలర్ల రుణం చెల్లింపులను దేశీయ ఎడ్‌టెక్‌ సంస్థ బైజూస్‌ దాటవేసింది. అంతే కాదు.. ‘దోపిడీ’ తరహా విధానాలు పాల్పడిందంటూ.. ఆ సంస్థపై దావా వేసింది. టర్మ్‌ రుణ షరతులకు విరుద్ధంగా అప్పుల్లో ఎక్కువ భాగాన్ని అది కొనుగోలు చేసిందంటూ న్యూయార్క్‌ సుప్రీం కోర్టులో వేసిన దావాలో బైజూస్‌ ఆరోపించింది. 1.2 బి. డాలర్ల రుణానికి సంబంధించి సోమవారం చెల్లించాల్సిన 40 మిలియన్‌ డాలర్ల వడ్డీని సైతం బైజూస్‌ జమ చేయలేదు. కోర్టు నిర్ణయం వెలువడే వరకు ఆ రుణంపై మిగతా చెల్లింపులూ చేయబోయేది లేదని పేర్కొంది. పరపతియేతర, సాంకేతికత ఎగవేతలను చూపుతూ రుణ మొత్తాన్ని సైతం చట్టవ్యతిరేకంగా గత మార్చిలో రుణదాతలు పెంచారని.. అమెరికా యూనిట్‌ అయిన బైజూస్‌ ఆల్ఫాను జప్తు చేసుకుని.. తన యాజమాన్యాన్ని నియమించుకున్నారనీ అందులో ఆరోపించింది. బైజూస్‌కు చెందిన అమెరికా కంపెనీలపై రుణదాత జీఎల్‌ఏఎస్‌ ట్రస్ట్‌ కంపెనీ, పెట్టుబడిదారు తిమోతీ ఆర్‌ పాల్‌ సైతం దావాలు దాఖలు చేశారు. బైజూస్‌ ఆల్ఫా నుంచి 500 మి. డాలర్లను బయటకు బదిలీ చేయడంపై బైజూస్‌ ఆల్ఫా, టాంజిబిల్‌ ప్లేలపై దావా వేశాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని