Hyderabad: అత్యంత ఖరీదైన నగరాల్లో హైదరాబాద్‌

భారత్‌లో విదేశీయులకు అత్యంత ఖరీదైన నగరాల్లో హైదరాబాద్‌కూ చోటు లభించింది. దేశీయంగా చూస్తే ఈ జాబితా అగ్రస్థానంలో ముంబయి నిలిచింది.

Updated : 08 Jun 2023 08:47 IST

ప్రపంచ వ్యాప్తంగా 202వ స్థానం
దేశీయంగా ముంబయికి అగ్రస్థానం
అంతర్జాతీయంగా అగ్రస్థానంలో హాంకాంగ్‌

దిల్లీ: భారత్‌లో విదేశీయులకు అత్యంత ఖరీదైన నగరాల్లో హైదరాబాద్‌కూ చోటు లభించింది. దేశీయంగా చూస్తే ఈ జాబితా అగ్రస్థానంలో ముంబయి నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో దిల్లీ, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, పుణె ఉన్నాయని ‘మెర్సర్స్‌ 2023 కాస్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ సర్వే’ చెబుతోంది. ప్రతి నగరంలో వసతి, రవాణా, ఆహారం, దుస్తులు, గృహోపకరణాలు, వినోదం వంటి 200 వరకు అంశాలకయ్యే వ్యయాలను పరిగణనలోకి తీసుకుని, ఈ జాబితా రూపొందించారు.  

అయిదు ఖండాల్లోని 227 నగరాల్లో జరిపిన ఈ సర్వేలోని ముఖ్యాంశాలు..

* ప్రపంచం మొత్తం మీద ఖరీదైన నగరాల్లో ముంబయికి 147వ స్థానం దక్కింది. దిల్లీ 169, చెన్నై 184, బెంగళూరు 189, హైదరాబాద్‌ 202, కోల్‌కతా 211, పుణె 213వ స్థానాల్లో నిలిచాయి.

* అంతర్జాతీయంగా చూస్తే హాంకాంగ్‌, సింగపూర్‌, జూరిచ్‌ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. చాలా తక్కువ ఖరీదైన ప్రాంతాల్లో హవానా (ఈ ఏడాది ఇది 83 స్థానాలు కోల్పోయింది), పాకిస్థాన్‌లోని కరాచీ, ఇస్లామాబాద్‌ ఉన్నాయి.

ముంబయితో పోలిస్తే చెన్నై, హైదరాబాద్‌, కోల్‌కతా, పుణెల్లో వసతి ఖర్చులు 50 శాతం తక్కువగా ఉన్నాయి. విదేశీ ఉద్యోగులకు కోల్‌కతాలో అత్యంత తక్కువ వసతి ఖర్చులున్నాయి.

* అంతర్జాతీయ ర్యాంకింగ్‌లో భారత నగరాల స్థానాల్లో మార్పులు కనిపించాయి. కరెన్సీ ఊగిసలాటలు, ఐరోపా వంటి ప్రాంతాల్లో వస్తువులు, సేవల ధరల్లో మార్పులు ఇందుకు కారణంగా నిలిచాయి.

* విదేశాల్లో కార్యకలాపాలు నిర్వహించుకోవాలనుకునే బహుళ జాతి కంపెనీ(ఎమ్‌ఎన్‌సీ)లకు ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో షాంఘై, బీజింగ్‌, టోక్యోలతో పోలిస్తే ముంబయి(147), దిల్లీ(169) వ్యయాల పరంగా మంచి గమ్యస్థానాలుగా నిలుస్తున్నాయి.

* ఆసియాలో అత్యంత ఖరీదైన అగ్రగామి 35 నగరాల్లో ముంబయి, దిల్లీ నిలిచాయి. ఆసియా నగరాల్లో ముంబయి స్థానం గతేడాదితో పోలిస్తే ఒక స్థానం తగ్గి 27కు చేరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని