బీఎస్‌ఎన్‌ఎల్‌కు రూ.89,047 కోట్లు

ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌)కు రూ.89,047 కోట్ల విలువైన మూడో పునరుద్ధరణ ప్రణాళికను కేంద్రప్రభుత్వం ప్రకటించింది.

Updated : 08 Jun 2023 03:06 IST

దేశవ్యాప్తంగా 4జీ, 5జీ సేవలకు వీలుగా
మూడో పునరుద్ధరణ ప్రణాళిక

దిల్లీ: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌)కు రూ.89,047 కోట్ల విలువైన మూడో పునరుద్ధరణ ప్రణాళికను కేంద్రప్రభుత్వం ప్రకటించింది. బీఎస్‌ఎన్‌ఎల్‌ అధీకృత మూలధనాన్ని రూ.1,50,000 కోట్ల నుంచి రూ.2,10,000 కోట్లకు పెంచడంతో పాటు, ప్రభుత్వ ఈక్విటీ వాటా రూపంలో సంస్థకు 4జీ, 5జీ స్పెక్ట్రమ్‌ కేటాయింపు కూడా తాజా ప్యాకేజీలో భాగంగా ఉంటాయి. బుధవారం మంత్రిమండలి సమావేశంలో ఆమోదించిన తాజా ప్యాకేజీ వల్ల బీఎస్‌ఎన్‌ఎల్‌ సుస్థిరమైన సర్వీస్‌ ప్రొవైడర్‌గా నిలదొక్కుకుని, దేశంలోని మారుమూల ప్రాంతాలకు టెలికాం సేవలను మరింతగా అందించగలదని భావిస్తున్నారు.

3 విడతలలో రూ.3.22 లక్షల కోట్లు

ప్రభుత్వరంగ టెలికాం సంస్థలైన బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌లకు తొలుత 2019లో రూ.69,000 కోట్ల విలువైన పునరుద్ధరణ ప్రణాళికను ప్రభుత్వం ప్రకటించింది. తదుపరి 2022లో రూ.1.64 లక్షల కోట్ల విలువైన రెండో ప్యాకేజీని అందించింది. తాజాగా ప్రకటించిన రూ.89,047 కోట్ల ప్యాకేజీని కూడా కలుపుకుంటే.. ఇప్పటివరకు రూ.3,22,000 కోట్ల మొత్తాన్ని అందిస్తున్నట్లు లెక్క.

మారుమూల ప్రాంతాలకూ

దేశవ్యాప్తంగా 4జీ, 5జీ సేవలను అందించేందుకు బీఎస్‌ఎన్‌ఎల్‌కు ఈ స్పెక్ట్రమ్‌ ఉపయోగ పడనుంది. ఇప్పటివరకు టెలికాం సేవలు లేని మారుమూల గ్రామీణ ప్రాంతాలకు కూడా 4జీ సేవలు అందించడం బీఎస్‌ఎన్‌ఎల్‌కు సాధ్యం కానుంది. అధిక వేగం ఇంటర్నెట్‌ కోసం ఫిక్స్‌డ్‌ వైర్‌లెస్‌ యాక్సెస్‌ సేవలతో పాటు క్యాప్టివ్‌ నాన్‌ పబ్లిక్‌ నెట్‌వర్క్‌ల కోసం ప్రత్యేక సేవలు, స్పెక్ట్రమ్‌ను కూడా బీఎస్‌ఎన్‌ఎల్‌ అందిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని