కీసరలో మేఘా గ్యాస్‌ 100వ స్టేషన్‌

ఎంఈఐఎల్‌ గ్రూపు సంస్థ అయిన మేఘా గ్యాస్‌, ఈ ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 400 సీఎన్‌జీ స్టేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు 2 లక్షల కొత్త కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Published : 08 Jun 2023 02:32 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఎంఈఐఎల్‌ గ్రూపు సంస్థ అయిన మేఘా గ్యాస్‌, ఈ ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 400 సీఎన్‌జీ స్టేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు 2 లక్షల కొత్త కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే ఈ సంస్థ దేశవ్యాప్తంగా 100 సీఎన్‌జీ స్టేషన్లను నెలకొల్పింది. 100వ సీఎన్‌జీ స్టేషన్‌ను తాజాగా హైదరాబాద్‌లోని కీసర వద్ద ఏర్పాటు చేసింది. ఈ స్టేషన్‌ను మేఘా గ్యాస్‌ సీఈఓ పి.వెంకటేష్‌ ప్రారంభించారు. ఇప్పటి వరకు తెలంగాణలో 46, ఆంధ్రప్రదేశ్‌లో 28, కర్ణాటకలో 12, ఉత్తరప్రదేశ్‌లో 4, మధ్యప్రదేశ్‌లో 4, తమిళనాడులో 3, పంజాబ్‌లో 3 సీఎన్‌జీ స్టేషన్లను సంస్థ ఏర్పాటు చేసింది. త్వరలో రాజస్థాన్‌లో సీఎన్‌జీ స్టేషన్లను ప్రారంభించనున్నట్లు మేఘా గ్యాస్‌ వెల్లడించింది. ఈ స్టేషన్ల నుంచి గృహ, వాణిజ్య అవసరాలకు గ్యాస్‌ (పీఎన్‌జీ, సీఎన్‌జీ) సరఫరా చేస్తున్నట్లు పేర్కొంది. గ్యాస్‌ పంపిణీ సేవలను విస్తరించే యత్నాల్లో భాగంగా ఇప్పటి వరకు 3,000 కిలోమీటర్ల పొడవైన పైప్‌లైన్‌ నిర్మించినట్లు వెంకటేష్‌ వెల్లడించారు. పైప్‌లైన్‌ను ఇంకా విస్తరిస్తామని, తద్వారా కొత్త స్టేషన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని