మెటా ‘వెరిఫైడ్‌’ ఖాతా సేవ జీ రూ.699

ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌ లాంటి సామాజిక మాధ్యమాలను నిర్వహిస్తున్న మెటా.. మన దేశంలో తమ మొబైల్‌ యాప్‌లకు రూ.699 నెలవారీ చందాతో ‘వెరిఫైడ్‌’ ఖాతా సేవలను ప్రారంభించింది.

Published : 08 Jun 2023 02:32 IST

దిల్లీ: ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌ లాంటి సామాజిక మాధ్యమాలను నిర్వహిస్తున్న మెటా.. మన దేశంలో తమ మొబైల్‌ యాప్‌లకు రూ.699 నెలవారీ చందాతో ‘వెరిఫైడ్‌’ ఖాతా సేవలను ప్రారంభించింది. వెబ్‌కు కూడా రూ.599 నెలవారీ చందాతో వెరిఫైడ్‌ సేవలను ప్రారంభించే యోచనలో మెటా ఉంది. ‘వెరిఫైడ్‌ సేవలను ఇన్‌స్టాగ్రామ్‌ లేదా ఫేస్‌బుక్‌లో కొనుగోలు చేయొచ్చు. ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌పై రూ.699 నెలవారీ చందాతో దీనిని తీసుకోవచ్చ’ని కంపెనీ  తెలిపింది. వెరిఫైడ్‌ ఖాతా సబ్‌స్క్రిప్షన్‌ పొందాలంటే.. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వినియోగదార్లు ప్రభుత్వ గుర్తింపు కార్డు ద్వారా తమ ఖాతాను ధ్రువీకరించుకోవాలి. ఈ ఖాతాలకు సైబర్‌ మోసగాళ్ల నుంచి భద్రత, ఖాతా సహకారం లాంటివి లభిస్తాయి.  వెరిఫైడ్‌ ఖాతాకు అర్హత సాధించాలంటే.. ఇంతకుమునుపు చేసిన పోస్టింగ్‌లు సహా కనీస యాక్టివిటీ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది.  దరఖాస్తుదార్లకు కనీసం 18 ఏళ్ల వయస్సు ఉండాలి. ఫేస్‌బుక్‌ లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ ఖాతాకైతే వెరిఫైడ్‌ కోసం దరఖాస్తు చేస్తున్నారో ఆ ఖాతాకు సంబంధించి పేరు, ఫొటోకు సరిపోయేలా ప్రభుత్వ గుర్తింపు పత్రాన్ని సమర్పించాలి.


బొగ్గు, లిగ్నైట్‌ల అన్వేషణపథకానికి రూ.2,980 కోట్లు

దిల్లీ: బొగ్గు, లిగ్నైట్‌ అన్వేషణ పథకాన్ని కొనసాగించేందుకు ప్రభుత్వం బుధవారం ఆమోదం తెలిపింది. ఇందుకు అంచనా వ్యయం రూ.2,980 కోట్లుగా నిర్ణయించింది. ఈ పథకం కాలపరిమితిని 2021-22 నుంచి 2025-26 వరకు పొడిగించినట్లు ఆర్థిక వ్యవహారాలపై ఏర్పాటైన కేంద్ర మంత్రివర్గం తెలిపింది. 15వ ఆర్థిక సంఘంతో పాటు ఇది ముగిసిపోతుందని పేర్కొంది. ఈ పథకంలో భాగంగా బొగ్గు, లిగ్నైట్‌ అన్వేషణను రెండు దశల్లో- 1) ప్రమోషనల్‌ (ప్రాంతీయ) ఎక్స్‌ప్లోరేషన్‌ 2) కోల్‌ ఇండియాకు చెందని నిక్షేపాల్లో డీటెయిల్డ్‌ ఎక్స్‌ప్లోరేషన్‌- చేపడతారు. ఈ పథకానికి నిర్ణయించిన రూ.2980 కోట్ల అంచనా వ్యయంలో మొదటి దశ కోసం రూ.1,650 కోట్లు, రెండో దశ కోసం     రూ.1,330 కోట్లు చొప్పున ఖర్చు పెడతారు.


హోండా బళ్లకు 10 ఏళ్ల వరకు అదనపు వారెంటీ

దిల్లీ: హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (హెచ్‌ఎమ్‌ఎస్‌ఐ) 250 సీసీ విభాగం వరకు  స్కూటర్లు, మోటర్‌ సైకిల్‌ మోడళ్లన్నింటికీ వారెంటీ పొడిగింపు కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా వాహనం కొనుగోలు చేసిన తేదీ నుంచి 91 రోజులు- తొమ్మిదో సంవత్సరం వరకు అదనపు వారెంటీని వినియోగదార్లు కొనుగోలు చేసుకోవచ్చు. దీని వల్ల పూర్తి స్థాయిలో 10 ఏళ్ల వారెంటీ కవరేజీని పొందడమే కాకుండా.. వేరే వాళ్లకు వాహనాన్ని అమ్మినప్పుడు వారెంటీని బదలాయించేందుకు వీలుగా రెన్యువల్‌ సదుపాయమూ ఉంటుందని హెచ్‌ఎమ్‌ఎస్‌ఐ తెలిపింది. ‘ విక్రయానంతర సేవల్లో కొత్త ప్రమాణాలు నిర్దేశించాలన్నది మా లక్ష్యమ’ని హెచ్‌ఎమ్‌ఎస్‌ఐ డైరెక్టర్‌ (విక్రయాలు, మార్కెటింగ్‌) యోగేశ్‌ మాథుర్‌ తెలిపారు. అధిక విలువ ఉండే విడి భాగాలనూ కలుపుతూ 10 ఏళ్ల వరకు అదనపు వారెంటీ సదుపాయాన్ని అందించడం పరిశ్రమలో ఇదే మొదటి సారి అని పేర్కొన్నారు.

* వాహనం ఏడో సంవత్సరంలో 3 ఏళ్లకు; 8వ సంవత్సరంలో రెండేళ్లకు; తొమ్మిదో సంవత్సరంలో 1 ఏడాదికి- అదనపు వారెంటీని ఎంచుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఇందువల్ల స్కూటర్లకు 1.2 లక్షల కి.మీటర్ల వరకు, మోటర్‌ సైకిళ్లకు 1.3 లక్షల కి.మీటర్ల వరకు వారెంటీ కవరేజీ లభిస్తుందని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని