4 రోజుల లాభాల జోరుకు విరామం

సూచీల 4 రోజుల వరుస లాభాలకు అడ్డుకట్ట పడింది. కీలక వడ్డీ రేట్లను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) యథాతథంగా కొనసాగించిన నేపథ్యంలో వాహన, బ్యాంకింగ్‌, ఐటీ షేర్లకు లాభాల స్వీకరణ ఎదురైంది.

Published : 09 Jun 2023 02:18 IST

సమీక్ష

సూచీల 4 రోజుల వరుస లాభాలకు అడ్డుకట్ట పడింది. కీలక వడ్డీ రేట్లను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) యథాతథంగా కొనసాగించిన నేపథ్యంలో వాహన, బ్యాంకింగ్‌, ఐటీ షేర్లకు లాభాల స్వీకరణ ఎదురైంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 1 పైసా  లాభపడి 82.51  వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 0.31% నష్టపోయి 76.71 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లలో సియోల్‌, టోక్యో నష్టపోగా, షాంఘై, హాంకాంగ్‌ లాభపడ్డాయి. ఐరోపా సూచీలు లాభాల్లో ట్రేడయ్యాయి.

సెన్సెక్స్‌ ఉదయం 63,140.17 పాయింట్ల వద్ద స్తబ్దుగా ప్రారంభమైంది. ప్రారంభ ట్రేడింగ్‌లో 63,321.40 వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. మధ్యాహ్నం తర్వాత నష్టాల్లోకి జారుకుంది. ఒకదశలో 62,789.73 వద్ద కనిష్ఠాన్ని తాకి, చివరకు 294.32 పాయింట్ల నష్టంతో 62,848.64 వద్ద ముగిసింది. నిఫ్టీ 91.85 పాయింట్లు కోల్పోయి 18,634.55 దగ్గర స్థిరపడింది.  

* ఆర్‌బీఐ కీలక రేట్లలో మార్పు చేయనందున, స్థిరాస్తి, బ్యాంకింగ్‌, వాహన షేర్లు నష్టపోయాయి. స్థిరాస్తి షేర్లలో బ్రిగేడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ 3.12%, మ్యాక్రోటెక్‌ డెవలపర్స్‌ 2.73%, డీఎల్‌ఎఫ్‌ 2.28%, శోభా 2.11%, ఒబెరాయ్‌ రియాల్టీ 1.43%, గోద్రేజ్‌ ప్రోపర్టీస్‌ 1.40%, ఐబీ రియల్‌ ఎస్టేట్‌ 1.36% చొప్పున నష్టపోయాయి. వాహన షేర్లలో కమిన్స్‌ 1.87%, మహీంద్రా అండ్‌ మహీంద్రా 1.79%, ఐషర్‌ మోటార్స్‌ 1.75%, టీవీఎస్‌ 1.70%, బాష్‌ 1%, మారుతీ 0.69% డీలాపడ్డాయి. బ్యాంకింగ్‌ షేర్లలో బంధన్‌ బ్యాంక్‌ 1.72%, ఏయూ స్మాల్‌ బ్యాంక్‌ 1%, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 0.59%, ఐసీఐసీఐ బ్యాంక్‌ 0.28% నీరసించాయి.

* సెన్సెక్స్‌ 30 షేర్లలో 24 నష్టపోయాయి. కోటక్‌ బ్యాంక్‌ 2.68%, సన్‌ఫార్మా 2.68%, టెక్‌ మహీంద్రా 2.21%, ఎం అండ్‌ ఎం 1.79%, టాటా మోటార్స్‌ 1.46%, యాక్సిస్‌ బ్యాంక్‌ 1.43%, హెచ్‌యూఎల్‌ 1.30%, టీసీఎస్‌ 1.17%, బజాజ్‌ ఫైనాన్స్‌ 1.03% చొప్పున డీలాపడ్డాయి. ఎన్‌టీపీసీ 2.62%, ఎల్‌ అండ్‌ టీ 1.09%, పవర్‌గ్రిడ్‌ 0.98% మాత్రం లాభపడ్డాయి. రంగాల వారీ సూచీల్లో స్థిరాస్తి 1.51%, టెలికాం 1.06%, వాహన 0.97%, ఐటీ 0.88%, ఎఫ్‌ఎమ్‌సీజీ 0.81%, బ్యాంకింగ్‌ 0.80% మేర పడ్డాయి. పరిశ్రమలు, యుటిలిటీస్‌, యంత్ర పరికరాలు, విద్యుత్‌ రాణించాయి.

* వ్యర్థాల నిర్వహణ సేవలు అందించే అర్బన్‌ ఎన్విరో వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) ఈ నెల 12న ప్రారంభమై 14న ముగియనుంది. ఐపీఓ ద్వారా కంపెనీ రూ.11.42 కోట్లు సమీకరించనుంది. ఐపీఓ అనంతరం కంపెనీ షేర్లు ఎన్‌ఎస్‌ఈ ఎమర్జ్‌ ప్లాట్‌ఫామ్‌పై నమోదుకానున్నాయి.

* ఐపీఓ ద్వారా నిధులు సమీకరించేందుకు ఫార్మాస్యూటికల్‌ ఇంగ్రేడియెంట్‌ తయారీ సంస్థ వ్యాలియంట్‌ లేబొరేటరీస్‌ సెబీ వద్ద ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 1.15 కోట్ల తాజా షేర్లు విక్రయించనుంది. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ పద్ధతిలో ఎటువంటి షేర్లనూ విక్రయించడం లేదు.

* షేర్ల విభజన ప్రతిపాదనను పరిశీలించేందుకు ఈ నెల 27న బోర్డు సమావేశం కానున్నట్లు హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ ఎక్స్ఛేంజీలకు సమాచారం ఇచ్చింది.

* ఐకియో లైటింగ్‌ ఐపీఓ చివరి రోజున 66.29 రెట్ల స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా 1,52,24,074 షేర్లను ఆఫర్‌ చేయగా.. 1,00,92,76,892 షేర్లకు బిడ్‌లు దాఖలయ్యాయి. క్యూఐబీల నుంచి 163.58 రెట్లు, ఎన్‌ఐఐ విభాగంలో 63.35 రెట్లు, రిటైల్‌ మదుపర్ల నుంచి 13.86 రెట్ల స్పందన కనిపించింది.

* హెచ్‌ఎంఏ ఆగ్రో ఇండస్ట్రీస్‌ ఐపీఓ ఈ నెల 20న ప్రారంభమై 23న ముగియనుంది. ఒక్కో షేరుకు ధరల శ్రేణిగా రూ.555- 585ను నిర్ణయించారు. యాంకర్‌ మదుపర్లు 19వ తేదీన బిడ్‌లు దాఖలు చేయొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని