GST Hike: అన్‌బ్రాండెడ్‌ అయినా 5% జీఎస్‌టీ

బ్రాండెడ్‌ కాదు కదా అని ముందే నింపి పెట్టి, లేబుల్‌ వేసి ఉన్న పప్పు ధాన్యాలు, గోధుమ పిండి ప్యాకెట్లు కొన్నారనుకోండి.. 5 శాతం జీఎస్‌టీ చెల్లించాల్సిందే. 25 కిలోల లోపు బరువుండే ప్రీ ప్యాక్డ్‌, లేబుల్డ్‌ ఆహార వస్తువులకు కొత్త రేటు సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో

Updated : 19 Jul 2022 15:25 IST

ప్రీ ప్యాక్డ్‌, లేబుల్డ్‌ ఆహార వస్తువులపై వర్తింపు

బియ్యం, గోధుమ పిండి, పప్పుధాన్యాలు 25 కిలోల లోపు కొంటే పన్ను వర్తింపు

పెరుగు, లస్సీలకు 25 లీటర్లలోపుః కేంద్రం స్పష్టీకరణ

దిల్లీ: బ్రాండెడ్‌ కాదు కదా అని ముందే నింపి పెట్టి, లేబుల్‌ వేసి ఉన్న పప్పు ధాన్యాలు, గోధుమ పిండి ప్యాకెట్లు కొన్నారనుకోండి.. 5 శాతం జీఎస్‌టీ చెల్లించాల్సిందే. 25 కిలోల లోపు బరువుండే ప్రీ ప్యాక్డ్‌, లేబుల్డ్‌ ఆహార వస్తువులకు కొత్త రేటు సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో వస్తువులు, సేవల పన్ను(జీఎస్‌టీ)పై తరచూ అడిగే ప్రశ్నలకు సమాధానాలను కేంద్ర ఆర్థిక మంత్విత్వ శాఖ వెలువరించింది. జులై 18 ముందు వరకు రిజిస్టర్‌ బ్రాండ్‌ నిర్దిష్ట వస్తువులకే జీఎస్‌టీ వర్తించేది. ఇపుడు బ్రాండెడ్‌ కాని వాటిపైనా(ప్రీప్యాక్డ్‌, లేబుల్డ్‌) జీఎస్‌టీ వర్తిస్తుందని అందులో స్పష్టం చేసింది. దీని ప్రకారం..

* పప్పుధాన్యాలతో పాటు బియ్యం, గోధుమలు, గోధుమ పిండి వంటి వస్తువులను ఇప్పటిదాకా ‘బ్రాండెడ్‌, ప్యాకేజీ’ రూపంలో విక్రయిస్తేనే 5 శాతం జీఎస్‌టీ వర్తించేది. ఇకపై వీటిని ‘ప్రీప్యాకేజ్డ్‌, లేబుల్డ్‌’ రూపంలో అందించినా పన్ను పడుతుంది. పెరుగు, లస్సీ, మరమరాలు (బొరుగులు) వంటి వాటిని ప్రీప్యాకేజ్డ్‌, లేబుల్డ్‌ రూపంలో ఇచ్చినా 5 శాతం జీఎస్‌టీ వర్తిస్తుంది.

*  25 కిలోలు లేదా అంత కంటే తక్కువ పరిమాణంలో, ముందుగానే ప్యాక్‌ చేసి ఉన్న కొన్ని నిర్దిష్ట ఆహార వస్తువులపై జీఎస్‌టీ వర్తిస్తుంది. పెరుగు, లస్సీ వంటి వాటిపై ఈ పరిమితి 25 లీటర్లుగా ఉంటుంది.

* 25 కిలోలు/25 లీటర్లకు మించిన పరిమాణంలో ఒకే ప్యాకేజ్‌ కింద తృణ ధాన్యాలు, పప్పు ధాన్యాలు, గోధుమ వంటివి విక్రయిస్తే మాత్రం వాటిపై జీఎస్‌టీ వర్తించదు. పెద్ద పరిమాణంలో ఒకే ప్యాకేజీ కింద కాకుండా పలు ప్యాకేజీల రూపంలో (ఉదాహరణకు 10 కిలోల ప్యాకెట్లు 10) విక్రయిస్తే మాత్రం జీఎస్‌టీ పడుతుంది. అదే ఒకే ప్యాక్‌ కింద 50 కిలోల బియ్యం అమ్మితే మాత్రం దానిని ప్రీప్యాకేజ్డ్‌, లేబుల్డ్‌ కమొడిటీగా పరిగణించరు. పన్ను వేయరు.

* 25 కిలోల పరిమాణం వరకు ప్రీప్యాక్డ్‌ వస్తువులకే 5 శాతం జీఎస్‌టీ వర్తిస్తుంది. ఒక వేళ రిటైల్‌ దుకాణదారు 25 కిలోల ప్యాక్‌ను తయారీదారు లేదా పంపిణీదారు నుంచి కొనుగోలు చేసి, దానిని లూజుగా అమ్మితే మాత్రం దానిపై జీఎస్‌టీ వేయరు.

ద్రవ్యోల్బణం మరింత పెరగొచ్చు.. విశ్లేషకులు: ‘అంతక్రితం బ్రాండెడ్‌ ఆహార వస్తువులపై మాత్రమే జీఎస్‌టీ వర్తించేది. ఇపుడు ఇతరాలపైనా వేయడం వల్ల జీఎస్‌టీ పరిధిని మరింత విస్తరించినట్లయింద’ని కేపీఎమ్‌జీ ఇండియా ప్రతినిధి అభిశేక్‌ జైన్‌ అంటున్నారు. ఇందువల్ల ద్రవ్యోల్బణం మరింత పెరిగొచ్చు. ఇప్పటికే బియ్యం, తృణధాన్యాల వంటి ప్రాథమిక వినియోగదారు వస్తువుల రేట్లు ప్రియంగా ఉన్నాయని ఏఎమ్‌ఆర్‌జీ అండ్‌ అసోసియేట్స్‌ ప్రతినిధి ఒకరు అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని