SVB Crisis: అంకురాల హడల్‌.. వివిధ దేశాల్లో ‘సిలికాన్‌’ ప్రకంపనలు

డిపాజిటర్లు పెద్ద ఎత్తున నిధులను ఉపసంహరించుకోవడంతో దివాలా తీసిన అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ (ఎస్‌వీబీ) ప్రభావం మిగిలిన దేశాలపైనా పడుతోంది. ఎస్‌వీబీ బ్రిటన్‌శాఖ చెల్లింపులు నిలిపివేయడంతో పాటు కొత్తగా డిపాజిట్లను స్వీకరించడం లేదు.

Updated : 13 Mar 2023 13:11 IST

అమెరికాలో లక్ష మంది ఉద్యోగులకు కష్టం
కొంపముంచిన అధిక వడ్డీరేట్లు
ఎస్‌వీ బ్యాంకు చెల్లింపుల నిలిపివేత
దిద్దుబాటు చర్యలకు దిగిన అమెరికా
రంగంలోకి ఫెడ్‌, ఎఫ్‌డీఐసీ
మన దేశంలోనూ అప్రమత్తమైన ప్రభుత్వం

వాషింగ్టన్‌ / దిల్లీ: డిపాజిటర్లు పెద్ద ఎత్తున నిధులను ఉపసంహరించుకోవడంతో దివాలా తీసిన అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ (ఎస్‌వీబీ) ప్రభావం మిగిలిన దేశాలపైనా పడుతోంది. ఎస్‌వీబీ బ్రిటన్‌శాఖ చెల్లింపులు నిలిపివేయడంతో పాటు కొత్తగా డిపాజిట్లను స్వీకరించడం లేదు. ఎస్‌వీబీ చైనాలో 2012లో ఎస్‌పీడీ సిలికాన్‌ వ్యాలీ బ్యాంకును ప్రారంభించి టెక్‌ సంస్థలకు ఆర్థిక సేవలందిస్తోంది. చైనాలో ప్రభావం ఎంతనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు అమెరికా ఫెడరల్‌ రిజర్వు వడ్డీ రేట్లను భారీగా పెంచడమే ఎస్‌వీబీ కుప్పకూలడానికి కారణమని అమెరికా ఆర్థిక మంత్రి జానెట్‌ యెలెన్‌ అభిప్రాయపడ్డారు. వడ్డీ రేట్లు పెరగడంవల్ల ఎస్‌వీబీ బాండ్లు, తనఖా ఉన్న సెక్యూరిటీల మార్కెట్‌ విలువ పడిపోయిందని, అదే ప్రస్తుత స్థితికి కారణమని విశ్లేషించారు. బ్యాంకు ఆస్తులను నియంత్రణ సంస్థలు శుక్రవారం స్తంభింపజేశాయి.

ఎస్‌వీబీ ప్రధానంగా టెక్నాలజీ / అంకుర సంస్థలకు రుణాలిచ్చేది. వాటికి నిధులందని పరిస్థితి ఏర్పడటంతో ఈ బ్యాంకులో ఉన్న డిపాజిట్లను ఉపసంహరించడం ప్రారంభించాయి. ఈ నిధుల కోసం నష్టానికైనా బ్యాంకు బాండ్లను విక్రయించాయి. ఫలితంగా బ్యాంకు మరింత సంక్షోభంలో కూరుకుపోయింది. ఎస్‌వీబీలో డిపాజిటర్లకు 2.50 లక్షల డాలర్ల (రూ.2 కోట్లకు పైగా) బీమాను ఎఫ్‌డీఐసీ అందిస్తుంది. 2.50 లక్షల డాలర్ల కంటే అధిక మొత్తం డిపాజిట్‌ చేసిన సంస్థలు 37,000కుపైగా ఉన్నాయని అంచనా. పలువురు సంపన్నులు ఇంతకు మించిన భారీ మొత్తాలనే డిపాజిట్‌ చేశారని సమాచారం. ఈ బ్యాంకులో 150 బిలియన్‌ డాలర్ల డిపాజిట్లు స్తంభించాయి. ఎస్‌వీబీ పరిణామం తరువాత శాన్‌ఫ్రాన్సిస్కో కేంద్రంగా పని చేసే ఫస్ట్‌ రిపబ్లిక్‌ బ్యాంకు షేరు 34%, ఫీనిక్స్‌ కేంద్రంగా పని చేసే వెస్ట్రన్‌ అలయన్స్‌ బ్యాంకార్ప్‌ షేరు 2020 నవంబరు తరువాత కనిష్ఠ స్థాయికి; ప్యాక్‌వెస్ట్‌ బ్యాంకార్ప్‌ షేరు 38% పతనమయ్యాయి. ఆసియా దేశాలపై ఎస్‌వీబీ దివాలా ప్రభావం తక్కువేనని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.  


ఉద్దీపన లేదు

మెరికా ప్రభుత్వం ఎస్‌వీబీకి ఉద్దీపన ఏమీ ప్రకటించడం లేదని, కానీ డిపాజిటర్లకు సాయం చేసేందుకు ప్రయత్నిస్తుందని అమెరికా ఆర్థిక మంత్రి జానెట్‌ యెలెన్‌ ఆదివారం ప్రకటించారు. 15ఏళ్ల క్రితం బ్యాంకులకు ఉద్దీపనలు ఇచ్చి ఆదుకున్న పరిస్థితికి, ప్రస్తుతానికి పోలిక లేదని, అందువల్ల బ్యాంకును ఆదుకునే ఉద్దేశం లేదని ఆమె స్పష్టం చేశారు. ఎస్‌వీబీ వైఫల్య ప్రభావం ఇతర బ్యాంకులపై పడదనే భరోసాను అమెరికన్లకు ఇచ్చారు. అమెరికా బ్యాంకింగ్‌ వ్యవస్థ సురక్షితంగా, తగినంత మూలధనంతో ఉందని ప్రకటించారు. ఎస్‌వీబీని కొనుగోలు చేసే సంస్థ కోసం అమెరికా నియంత్రణ సంస్థలు అన్వేషిస్తున్నాయి.


రూ.64 కోట్ల నిల్వలున్నాయ్‌: నజారా టెక్‌

మ 2 అనుబంధ సంస్థలు కిడోపియా, మీడియా వర్క్స్‌లకు చెందిన రూ.64 కోట్ల నగదు నిల్వలు ఎస్‌వీబీలో ఉన్నాయని దేశీయ గేమింగ్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ నజారా టెక్నాలజీస్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు వెల్లడించింది. అయితే తమ గ్రూప్‌ సంస్థలవద్ద మరో రూ.600 కోట్ల నగదు నిల్వలున్నందున కార్యకలాపాలపై ఎటువంటి ప్రతికూల ప్రభావం పడదని స్పష్టం చేసింది.


ముంబయి సహకార బ్యాంకుపై వదంతులు

స్‌వీబీ మూసివేత కారణంగా.. ముంబయి కేంద్రంగా 116 ఏళ్లుగా సేవలందిస్తున్న శ్యామ్‌రావ్‌ విఠల్‌ కో (ఎస్‌వీసీ) ఆపరేటివ్‌ బ్యాంకుపై వదంతులు వ్యాపించాయి. పేరు దగ్గరగా ఉండటమే ఈ గందరగోళానికి కారణం. తమ డిపాజిట్ల భద్రతపై బ్యాంకు అధికారులను అడిగి ఖాతాదారులు నివృత్తి చేసుకున్నారు.


త్వరలో అంకుర సంస్థల నిర్వాహకులతో మంత్రి సమావేశం

స్‌వీబీ ప్రభావంపై చర్చించేందుకు ఎలక్ట్రానిక్స్‌, ఐటీశాఖల సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ ఈ వారంలో అంకుర సంస్థల నిర్వాహకులతో సమావేశం కానున్నారు.


లక్ష ఉద్యోగాలకు ప్రమాదం: వై కాంబినేటర్‌

స్‌వీబీ వైఫల్యంవల్ల ఇందులో డిపాజిట్‌ చేసిన 10,000 చిన్న వ్యాపార సంస్థలు తమ ఉద్యోగులకు రాబోయే 30 రోజుల్లో జీతాలు ఇవ్వలేవని, మూతబడే ప్రమాదమూ ఉందని.. లక్ష మంది ఉద్యోగులపై ఈ ప్రభావం పడుతుందని పేర్కొంటూ అమెరికా ప్రభుత్వానికి అంకుర సంస్థల ఇంక్యుబేటర్‌ వై కాంబినేటర్‌ పిటిషన్‌ సమర్పించింది. తమ పరిధిలోని అంకుర సంస్థల్లో మూడో వంతు కేవలం ఎస్‌వీబీ ఖాతాలనే కలిగి ఉన్నాయని తెలిపింది. ఈ పిటిషన్‌పై అంకుర సంస్థలు, చిన్న వ్యాపార సంస్థలకు చెందిన 3,500 మంది సీఈవోలు, 2 లక్షల మంది ఉద్యోగులు సంతకాలు చేశారు.

సాఫ్ట్‌వేర్‌ యాజ్‌ ఏ సర్వీస్‌ సేవలందించే భారతీయ అంకురాల్లో, అమెరికాలో శాఖలు కలిగినవి వై కాంబినేటర్‌కు అనుసంధానమై ఉంటాయి. అందువల్ల వీటిపైనా ప్రభావం పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే మీ షో, రాజోర్‌ పే, క్యాష్‌ ఫ్రీ పేమెంట్స్‌ వంటి దేశీయ సంస్థలు ఎస్‌వీబీలో తమ నగదు ఏమీ లేదని తెలిపాయి.


ఉపశమన చర్యలు

స్‌వీబీ దివాలా నేపథ్యంలో అమెరికా దిద్దుబాటు చర్యలకు దిగింది. బ్యాంకుల డిపాజిటర్లకు భరోసా కల్పించేందుకు ప్రత్యేక నిధిని (ఎస్‌పీవీ) ఏర్పాటు చేయాలని ది ఫెడరల్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎఫ్‌డీఐసీ), ది ఫెడరల్‌ రిజర్వు యోచిస్తున్నట్లు సమాచారం. వెంచర్‌ క్యాపిటల్‌, అంకుర సంస్థలకు రుణాలందించే మరికొన్ని చిన్న బ్యాంకులపైనా, డిపాజిటర్ల ఒత్తిడి పెరగొచ్చనే అంచనాల మధ్య ఈ ప్రతిపాదన వచ్చిందని సమాచారం. మరోవైపు ‘ఎస్‌వీబీ యూకే’ దివాలా ప్రక్రియ ప్రారంభించడంతోపాటు అందులో అర్హత కలిగిన డిపాజిటర్లకు 2.04 లక్షల డాలర్లను సాధ్యమైనంత త్వరగా అందిస్తామని బ్యాంకు ఆఫ్‌ ఇంగ్లండ్‌ తెలిపింది. బ్యాంక్‌ ఆస్తులను విక్రయించి డిపాజిట్‌దారులకు చెల్లిస్తామని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని